Morbi Bridge Collapse: కేబుల్ బ్రిడ్జి ఘటనలో 134కు చేరిన మృతుల సంఖ్య- ప్రధాని మోదీ సంతాపం

ABP Desam   |  Murali Krishna  |  31 Oct 2022 11:39 AM (IST)

Morbi Bridge Collapse: గుజరాత్ మోర్బీ తీగల వంతెన కూలిన ఘటనలో మృతుల సంఖ్య 134కు చేరింది. మృతుల కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.

Morbi Bridge Collapse: కేబుల్ బ్రిడ్జి ఘటనలో 134కు చేరిన మృతుల సంఖ్య- ప్రధాని మోదీ సంతాపం

(Image Source: PTI, ANI)

Morbi Bridge Collapse: సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని కెవాడియాలో సోమవారం జరిగిన జాతీయ ఐక్యతా దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ' వద్ద సర్దార్ పటేల్‌కు నివాళులర్పించారు ప్రధాని మోదీ. 

ఈ సందర్భంగా మోర్బీలో వంతెన కూలిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 134కు చేరింది. 

ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ దుఃఖ సమయంలో ప్రభుత్వం అన్ని విధాలుగా మృతుల కుటుంబాలకు అండగా ఉంది. గుజరాత్ ప్రభుత్వం నిన్నటి నుంచి సహాయక చర్యలు చేపట్టింది. కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలా సాయం చేస్తోంది. నేను ఏక్తా నగర్‌లో ఉన్నాను కానీ నా మనసు మాత్రం మోర్బీ బాధితులతోనే ఉంది. నా జీవితంలో చాలా అరుదుగా నేను ఇలాంటి బాధను అనుభవించి ఉంటాను. -                                               ప్రధాని నరేంద్ర మోదీ

ఇదీ జరిగింది

మోర్బీ నగరంలోని మచ్చు నదిపై బ్రిటీష్ కాలం నాటి తీగల వంతెన ఆదివారం కుప్పకూలింది. ప్రమాద సమయంలో వంతెనపై దాదాపు 500 మంది ఉన్నట్లు సమాచారం. వంతెన కూలడం వల్ల చాలామంది నీటిలో పడి గల్లంతయ్యారు. సందర్శకులు నదిలో పడిపోగానే ఆ ప్రాంతంలో భీతావహ పరిస్థితులు కనిపించాయి.

ఈతరాని వారు మునిగిపోగా.. చాలామంది రక్షించాలంటూ హాహాకారాలు చేశారు. ఒకరిపై ఒకరు పడడం వల్ల కొంతమంది గాయపడ్డారు. మరికొంతమంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తీగలను పట్టుకుని వేలాడుతూ కనిపించారు. నీళ్లలో మునిగిపోతున్నవారిని రక్షించేందుకు మరి కొంతమంది ప్రయత్నించారు. వంతెన కూలిన ప్రమాద విషయం తెలియగానే అగ్నిమాపక విభాగం అధికారులు, పోలీసులు, ఇతర సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గల్లంతైనవారి కోసం పడవల సాయంతో గాలింపు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు.

ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 134 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో 170 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు.

పరిహారం

వంతెన కూలిన ఘటనపై కేసు నమోదు చేసిన గుజరాత్ సర్కార్‌ విచారణ జరిపేందుకు ఐదుగురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. గుజరాత్‌ సర్కార్‌ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, గాయపడినవారికి రూ.50 వేల చొప్పున అందజేయనున్నట్లు తెలిపింది.

Also Read: Morbi Bridge Collapses: మోర్బి వంతెనకు ఫిట్‌నెస్ సర్టిఫికేట్ లేదా? ఆ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమా?

Published at: 31 Oct 2022 11:27 AM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.