Vijayawada To Dubai Flight Services: విజయవాడ ప్రాంత ప్రజలు ఎంతో కాలం నుంచి వేచి చూస్తున్న అంతర్జాతీయ విమానయాన సేవలు విజయవాడ విమానాశ్రయం నుండి నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని బందర్ పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి ఒక ప్రకటన లో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పౌర విమానయాన శాఖ మంత్రితో, ఎయిర్ ఇండియా అధికారులతో అనేక పర్యాయాలు ఈ విషయమై ఢిల్లీ లో చర్చించినట్లు తెలిపారు. ఆ కృషి ఫలితంగా ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ వారిచే విజయవాడ నుండి షార్జా ( దుబాయ్ ) కు వారం లో రెండు రోజులు నడపనున్నట్లు వెల్లడించారు.


ఫ్లైట్ టైమింగ్స్ వివరాలు.. 
ప్రతి సోమవారం మరియు శనివారం రాత్రి 9.05 గంటలకు విమానం బయలు దేరుతుంది. మొదటిసారిగా నేటి సాయంత్రం ఈ విమానం విజయవాడ కు వచ్చి షార్జా కు ప్రయాణీకులను తీసుకువెళుతుంది. అలాగే విజయవాడ నుండి మస్కట్ కు ప్రతి శనివారం మధ్యాహ్నం 1.15 గంటలకు, విజయవాడ నుండి కువైట్ కు ప్రతి బుధవారం 4.30 గంటలకు విమానాలు నడుపుతారని ఎంపీ బాలశౌరి తెలిపారు.


నేటి సాయంత్రం విజయవాడ విమానాశ్రయంలో మొదటిసారిగా వస్తున్న షార్జా విమానానికి స్థానిక పార్లమెంట్ సభ్యులు, విజయవాడ ఎయిర్ పోర్ట్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ అయిన వల్లభనేని బాలశౌరి స్వాగతం పలకనున్నారు. అలాగే షార్జాకు ప్రయాణీకులకు బోర్డింగ్ పాసులు అందజేయనున్నారు. ఈ మేరకు ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్  లక్ష్మి కాంత రెడ్డి ఎంపీ బాలశౌరిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. నేటి సాయంత్రం 4 గంటలకు విజయవాడ విమానాశ్రయంలో ఈ కార్యక్రమంలో ఎంపీ పాల్గొననున్నారు.


విమాన టికెట్ల ధరలు ఏమేర ఉంటాయంటే.. 
ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సీఈఓ అలోక్‌ సింగ్‌ మాట్లాడుతూ.. దుబాయ్‌, నార్త్రన్‌ ఎమిరేట్స్‌ వెళ్లే ప్రయాణికులకు విజయవాడ నుంచి షార్జాకు డైరెక్ట్‌ ఫ్లైట్ ఉపయోగపడుతుందన్నారు. షార్జాతో పాటు మస్కట్‌, కువైట్‌లకు కూడా తమ సంస్థ విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా విమాన సర్వీసులు నడుపుతుందని తెలిపారు. విజయవాడ - షార్జా (Vijayawada To Dubai Flights)కు ఛార్జీలు రూ. 13,669 నుండి ప్రారంభమవుతాయి. షార్జా - విజయవాడకు 399 ఎమిరేట్స్‌ దిర్హమ్స్‌ (దాదాపు రూ.9000) నుంచి మొదలవుతాయి. కరోనా కారణంగా హైదరాబాద్‌, బ్యాంకాక్‌ మధ్య నిలిపివేసిన ప్యాసింజర్‌, కార్గో సేవలను రెండు సంవత్సరాల తర్వాత ప్రారంభించారు.