Rains in Telangana AP: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడగా.. తమిళనాడు వైపుగా అల్పపీడనం కొనసాగుతోంది. దక్షిణ కోస్తాంధ్ర పై భారీ ప్రభావం చూపుతోంది. అల్పపీడనంతో నేడు ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. అక్టోబర్ 31 నుంచి ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. అల్పపీడనం వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు ఈశాన్య రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించాయని ఏపీ వెదర్ మ్యాన్ తెలపగా, వాతావరణ కేంద్రం ఆ విషయాన్ని స్పష్టం చేసింది. ఈశాన్య రుతుపవనాలు, అల్పపీడనాలతో వర్షాలకు అనుకూల వాతావరణం ఏర్పడుతోంది. ఉపరితల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు తీరంలో సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉంది. 
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఏపీ, తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా, రాత్రివేళ చలి అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు అక్టోబర్ 31 రాత్రి నుంచి వర్షాలు మొదలవుతాయి. అంత వరకు చిరు జల్లులు పడతాయి. అక్టోబర్ 31 రాత్రి లేదా అర్ధరాత్రి సమయంలో మొదట నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కోస్తా భాగాల్లోకి అల్పపీడనం ప్రవేశిస్తుంది. తర్వాత నవంబర్ 1, 2, 3, నవంబర్ 4 వరకు ఈ వర్షాలు కొనసాగనున్నాయి. కానీ నవంబర్ 1, నవంబర్ 2 తేదీల్లో అత్యధికంగా వర్షాలు కురవనున్నాయి. ఈసారి అల్పపీడనానికి ఉత్తర భాగంలో ఉపరితల ఆవర్తనం ఉండటం వలన వర్ష తీవ్రత కోస్తా భాగాల్లో ఉంటుంది.






తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
రాష్ట్రంలో వాతావరణం పొడిగా మారుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు రాత్రివేల చలి తీవ్రత రాష్ట్రంలో పెరుగుతోంది. నేడు కొన్ని జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్టోబర్ 31 నుంచి రాష్ట్రంలో మూడు, నాలుగు రోజులపాటు వర్షాలున్నాయి. నవంబర్ తొలి వారంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. హైదరాబాద్ లో ఆకాశాన్ని మేఘాలు కమ్మేశాయి. నగరంలో ఉదయం వేళ పొగమంచు ఏర్పడుతుంది. హైదరాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రత 30 కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీలుగా నమోదైంది. ఈశాన్య దిశ నుంచి గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఉపరితల ఆవర్తనం తమిళనాడు తీరంలో ఉండటంతో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం ఉంటుంది. మరోవైపు ఉత్తర కోస్తాంధ్రలో నేటి నుంచి ఈశాన్య రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో అక్టోబర్ చివరి నుంచి కోస్తాంధ్రాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అన్నిటికంటే తక్కువగా వర్షాలు పడనుంది. నవంబర్ 2, నవంబర్ 3న వైజాగ్, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. అన్నిటికంటే తక్కువగా శ్రీకాకుళం జిల్లాలో వర్షాలున్నాయి. ఉత్తర కోస్తాంధ్ర, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మాత్రం నవంబర్ 2, 3 చలి గాలులు వీచనున్నాయి. తెలంగాణలో ఇది వర్షాకాలం కాదు. తెలంగాణ - ఆంధ్ర సరిహద్దు భాగాల్లో మాత్రం నవంబర్ 2, 3 తేదీల్లో చినుకులు ఉండే అవకాశాలున్నాయి.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కోస్తా భాగాల్లో అధికంగా వర్షాలు పడే అవకాశాలున్నాయి. కృష్ణపట్నం, మైపాడు, తూపిలిపాలెం, శ్రీహరికోట లాంటి చోట్ల ఎక్కువ వర్షాలు పడతాయని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. మరో వైపున నెల్లూరు నగరం, గూడూరు, తిరుపతి, శ్రీకాళహస్తి వైపు మాత్రం భారీ నుంచి అతిభారీ వర్ష సూచన ఉంది. ఈ జిల్లాల్లో అత్యధికంగా నవంబర్ 1, 2 తేదీల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. నవంబర్ 3, 4 తేదీలలో సాధారణ వర్షాలున్నాయి. 
ప్రకాశం, అన్నమయ్య జిల్లా, కడప, చిత్తూరు జిల్లా తూర్పు ప్రాంతాల్లో, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో తీర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. చిట్వేల్, ఒంగోలు, కందుకూరు, బద్వేల్, మచిలీపట్నం, అమలాపురం, నర్సాపురం లాంటి ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణం ఉంటుంది. నవంబర్ 1న మొదలుకానున్న వర్షాలు నవంబర్ 4న తగ్గుముఖం పడతాయని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.