Morbi Bridge Collapse: తీవ్ర విషాదం- భాజపా ఎంపీ కుటుంబంలో 12 మంది మృతి

Advertisement
ABP Desam   |  Edited By: Murali Krishna Updated at: 31 Oct 2022 01:15 PM (IST)

Morbi Bridge Collapse: గుజరాత్‌లో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో భాజపా ఎంపీకి చెందిన 12 మంది కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు.

(Image Source: PTI)

NEXT PREV

Morbi Bridge Collapse: గుజరాత్ మోర్బీలో కేబుల్ బ్రిడ్జ్ కూలిన ఘటనలో ఇప్పటివరకు 134 మంది మృతి చెందారు. ఈ ఘటన భాజపాకు చెందిన ఎంపీ ఇంట తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో భాజపా ఎంపీ మోహన్‌ కుందారియా కుటుంబసభ్యులు 12 మంది ప్రాణాలు కోల్పోయారు.

Continues below advertisement


బాధలో


రాజ్‌కోట్‌ ఎంపీ మోహన్‌ కుందారియా సోదరి కుటుంబసభ్యులు మొత్తం 12 మంది ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంపై స్పందించిన కుందారియా.. దర్యాప్తు జరుగుతుందని, బాధ్యులను శిక్షిస్తామన్నారు.



వంతెన కూలిన ప్రమాదంలో నేను 12 మంది కుటుంబసభ్యులను కోల్పోయాను. అందులో చిన్నారులు కూడా ఉన్నారు. వారంతా నా సోదరి కుటుంబానికి చెందినవారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది. బాధ్యులను తప్పకుండా శిక్షిస్తాం. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలే ఉన్నారు.                  -    మోహన్ కుందారియా, రాజ్‌కోట్ ఎంపీ


ఇదీ జరిగింది


మోర్బీ నగరంలోని మచ్చు నదిపై బ్రిటీష్ కాలం నాటి తీగల వంతెన ఆదివారం కుప్పకూలింది. ప్రమాద సమయంలో వంతెనపై దాదాపు 500 మంది ఉన్నట్లు సమాచారం. వంతెన కూలడం వల్ల చాలామంది నీటిలో పడి గల్లంతయ్యారు. సందర్శకులు నదిలో పడిపోగానే ఆ ప్రాంతంలో భీతావహ పరిస్థితులు కనిపించాయి.






ఈతరాని వారు మునిగిపోగా.. చాలామంది రక్షించాలంటూ హాహాకారాలు చేశారు. ఒకరిపై ఒకరు పడడం వల్ల కొంతమంది గాయపడ్డారు. మరికొంతమంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తీగలను పట్టుకుని వేలాడుతూ కనిపించారు. నీళ్లలో మునిగిపోతున్నవారిని రక్షించేందుకు మరి కొంతమంది ప్రయత్నించారు. వంతెన కూలిన ప్రమాద విషయం తెలియగానే అగ్నిమాపక విభాగం అధికారులు, పోలీసులు, ఇతర సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గల్లంతైనవారి కోసం పడవల సాయంతో గాలింపు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు.


ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 134 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో 177 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు.


పరిహారం


వంతెన కూలిన ఘటనపై కేసు నమోదు చేసిన గుజరాత్ సర్కార్‌ విచారణ జరిపేందుకు ఐదుగురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. గుజరాత్‌ సర్కార్‌ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, గాయపడినవారికి రూ.50 వేల చొప్పున అందజేయనున్నట్లు తెలిపింది.


Also Read: Morbi Bridge Collapse: కేబుల్ బ్రిడ్జి ఘటనలో 134కు చేరిన మృతుల సంఖ్య- ప్రధాని మోదీ సంతాపం

Published at: 31 Oct 2022 01:09 PM (IST)
Continues below advertisement
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.