ప్రధానమంత్రి నరేంద్రమోడీకి.. ఇంత వరకూ భారత ప్రధానులెవరికీ దక్కని గౌరవం దక్కనుంది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలికి ప్రధాని మోడీ అధ్యక్షత వహించనున్నారు. ఇంత వరకూ భారత ప్రధాని ఎవరూ ఈ మండలికి నాయకత్వం వహించలేదు. ఆగస్టు 9న ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సమావేశం జరగనుంది. సమావేశంలో ప్రపంచ శాంతి, కౌంటర్ టెర్రరిజం వంటి సమస్యలపై వంటి సమస్యలపై చర్చించనున్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అధ్యక్ష పదవిని భారత్ ఆగస్టు ఒకటో తేదీన చేపట్టింది. ఆగస్టు నెల మొత్తం భారత్‌ ఈ పదవిలో ఉంటుంది.  భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్య దేశం కాదు. తాత్కాలిక సభ్య దేశంగా కొనసాగుతోన్న భారత్‌..  అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి. 


వచ్చే ఏడాది డిసెంబర్‌లోనూ మరోసారి అధ్యక్ష పదవిని భారత్‌ చేపట్టనుంది. ప్రధాని మోడీ శాంతి స్థాపన, ఉగ్రవాదంపై పోరు, సముద్ర తీర భద్రత అంశాలను అజెండాగా సమావేశాల్లో చర్చకు ప్రతిపాదించే అవకాశం ఉంది.  ఉగ్రవాదంపై పోరులో భారత్‌ ఎప్పుడూ ముందుంటుందని.. ఇకపై కూడా ఈ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని భారత్ అధికారికంగా ప్రకటించింది.   భద్రతా మండలి అధ్యక్ష పదవిని భారత్‌ చేపట్టడంపై అనేక దేసాలు హర్షం వ్యక్తంచేశాయి. భారత్‌ అజెండాలోని మూడు అంశాలపై కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాయి.   భద్రతా మండలి అధ్యక్ష పదవిని చేపట్టిన నేపథ్యంలో.. ఇతర సభ్యదేశాలతోనూ కలిసి ముందుకు సాగుతామని భారత విదేశాంగమంత్రి డాక్టర్‌ ఎస్‌ జైశంకర్‌ పేర్కొన్నారు. 


Also Read: e-RUPI : ఇండియా ఎలక్ట్రానిక్ "రూపీ" వచ్చేస్తోంది.. ఇది బిట్‌కాయిన్ లాంటి క్రిప్టో కరెన్సీనా.. ఇవిగో వివరాలు


ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. శాశ్వత సభ్య దేశాలుగా అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్,  ప్రాన్స్​ఉన్నాయి.  శాశ్వత సభ్య దేశాలకు కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయి.  ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా. జనాభా పరంగా రెండో అతిపెద్ద దేశంగా భారత్​కు గుర్తింపు ఉంది.  భారత్​కు శాశ్వత సభ్యత్వంపై ప్రతిపాదనలు వచ్చినప్పటికీ ముందడుగు పడలేదు. భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టాలని భారత ప్రధాని సహా పలు దేశాలు డిమాండ్​ను తెరమీదకు తెస్తున్నాయి. 


భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టాలంటే మొదటగా సాధారణ సభలో తీర్మానం చేసి, ఐక్యరాజ్య సమితి చార్టర్​ను మార్చి కొత్త దేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పించే నిబంధనను చేర్చాల్సి ఉంటుంది.  శాశ్వత సభ్యదేశాలుగా ఉన్న చైనా, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్​, రష్యాలు భారత్​ శాశ్వత సభ్యదేశంగా ఉండేందుకు ఒప్పుకుంటే సభ్యత్వం వచ్చేది. కానీ చైనాతోపాటు మరికొన్ని దేశాలు ప్రతీసారి అడ్డుపడుతున్నాయి. తాత్కలిక సభ్య దేశంగా మాత్రం అవకాశం దక్కుతోంది. భారత్ అంది వచ్చిన అవకాశాన్ని శాశ్వతసభ్యదేశంగా మారేందుకు ఉపయోగించుకునే అవకాశం ఉంది. 


Also Read: Karnataka Cabinet : బొమ్మై కేబినెట్‌లో "సీడీ" సమీకరణాలు.. ఆ ఆరుగురికి చోటు లభిస్తుందా..