Mekapati Goutham Reddy Passed Away: ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కన్నుమూశారు. దుబాయ్ నుంచి భారత్‌కు నిన్ననే తిరిగొచ్చిన ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రికి గుండెపోటు రావడంతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేర్పించిన కొంత సమయానికే పరిస్థితి విషమించి ఉదయం 8:45కు తుదిశ్వాస విడిచారు. ఏపీ కేబినెట్‌లో సౌమ్యుడిగా పేరున్న మంత్రి కన్నుమూయడంతో పార్టీ నేతలతో పాటు రాష్ట్ర ప్రజలు గౌతమ్ రెడ్డి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మంత్రి మేకపాటి గౌతం రెడ్డి మరణంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించడంతో పాటు అధికార లాంఛనాలతో ఆయన స్వగ్రామం బ్రాహ్మణపల్లిలో ఎల్లుండి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన జీవిత విశేషాలు ఇవే..


నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారుడు ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. ఆయన తండ్రి రాజమోహన్‌రెడ్డి ఉదయగిరి, ఒంగోలు, నరసరావుపేట, నెల్లూరు పార్లమెంట్‌ సభ్యుడిగా పనిచేశారు.  1971 నవంబర్ 2న మేకపాటి గౌతమ్‍రెడ్డి జన్మించారు. మేకపాటి గౌతమ్‍రెడ్డి స్వగ్రామం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి 1994-1997లో మాంచెస్టర్ యూకేలో సైన్స్ అండ్ టెక్నాలజీ మాంచెస్టర్ ఇన్‌స్టిట్యూట్ విశ్వవిద్యాలయం (UMIST) నుండి ఎమ్మెస్సీ పట్టా పొందారు.







కె.ఎం.సి. సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌‌గా మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. అయితే ప్రజా సేవా చేయాలని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి విజయం సాధించిన నేతలలో గౌతమ్ రెడ్డి ఒకరు. 2014లో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా 30,191 ఓట్లతో జిల్లాలో అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. మేకపాటి కుటుంబానికి జిల్లాలో రాజకీయంగా మంచిపట్టు ఉంది. 2019లో మరోసారి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించి వైఎస్ జగన్ కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. వైఎస్ జగన్ నమ్మే అతి కొద్ది మంది నేతలు, సన్నిహితులలో మేకపాటి గౌతమ్ రెడ్డి ఒకరని చెప్పవచ్చు. ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖా మంత్రిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. గౌతమ్ రెడ్డికి భార్య శ్రీకీర్తి, కుమార్తె అన్యన్యరెడ్డి, కుమారుడు అర్జున్‌రెడ్డి ఉన్నారు.

చివరి వారం రోజులు రాష్ట్రం కోసమే..
తాను చనిపోయే ముందు చివరి వారం రోజులు సైతం రాష్ట్ర ప్రయోజనాల కోసమే గౌతమ్ రెడ్డి పనిచేశారు. దుబాయ్‌ ఎక్స్‌పో- 2020లో ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి 17వ తేదీ వరకు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించారు. హైపర్‌ రిటైల్, ఫుడ్‌ ప్రోసెసింగ్‌ రంగంలో పెట్టుబడులకు రీజెన్సీ గ్రూపుతో రాష్ట్రంలో రూ. 5,150 కోట్ల పెట్టుబడులకు ఆరు కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకున్నామని దుబాయ్‌లో మంత్రి గౌతమ్ రెడ్డి ఇటీవల తెలిపారు. 


Also Read: Mekapati Gowtham Reddy Live News: మంత్రి మేకపాటి కన్నుమూత - ఏపీలో రెండ్రోజులు సంతాప దినాలు


Also Read: Mekapati Goutham Reddy: బిజినెస్ నుంచి పాలిటిక్స్‌కు వచ్చి మేకపాటి గౌతమ్ రెడ్డి సక్సెస్, మీకు ఈ విషయాలు తెలుసా