Google office Bomb Threat:


హైదరాబాద్ నుంచి కాల్..


పుణేలోని గూగుల్ ఆఫీస్‌కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. బాంబులతో పేల్చేస్తామంటూ ఓ ఆగంతకుడు కాల్ చేసి బెదిరించాడు. గూగుల్ ఆఫీస్‌కు కాల్ చేసి బాంబ్ పెట్టాం అని హెచ్చరించాడు. వెంటనే యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. ముంబయి పోలీసులు, పుణె పోలీసులు దీనిపై విచారణ మొదలు పెట్టారు. ప్రాథమిక సమాచారం ప్రకారం...ఆ కాలర్ తన పేరు పనయం శివానంద్‌గా చెప్పాడు. అంతే కాదు. తాను హైదరాబాద్‌లో ఉంటాననీ అన్నాడని గూగుల్ యాజమాన్యం వివరించింది. ల్యాండ్‌లైన్‌కు కాల్ చేసి ఇలా బెదిరించినట్టు వెల్లడించింది. ఈ సమాచారాన్నంతా ముంబయి పోలీసులు పుణె పోలీసులకు అందించారు. అయితే...ఆఫీస్‌లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో గాలించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. వెంటనే ముంబయికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అసలు ఎందుకు ఇలా చేశాడన్నది మాత్రం ఇంకా తేలలేదు. ప్రస్తుతానికి కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు అందిస్తామని పోలీసులు తెలిపారు. 


NIAకి వార్నింగ్...


ముంబయిలో మరో ఉగ్రదాడికి కుట్ర జరగనున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. NIAకి బెదిరింపు ఈమెయిల్స్ వచ్చిన వెంటనే... ముంబయి పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులతో పాటు మిగతా దర్యాప్తు సంస్థలూ దీనిపై విచారణ చేపడుతున్నాయి. NIA మెయిల్ ఐడీకి బెదిరింపు మెయిల్స్ పంపిన వ్యక్తి తనను తాను "తాలిబన్‌"గా చెప్పుకున్నాడు. సిరాజుద్దీన్ హక్కానీ ఆదేశాల మేరకుముంబయిలో మరోసారి ఉగ్రదాడికి ప్లాన్ చేస్తున్నట్టు బెదిరించాడు. తాలిబన్ ఆర్గనైజేషన్‌లో కీలక వ్యక్తి...సిరాజుద్దీన్. అయితే...ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో అని విచారిస్తున్నారు పోలీసులు. ముంబయిలోనే కాకుండా...దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలోనూ భద్రత పెంచారు. అత్యంత ప్రమాదకరమైన తాలిబన్ గ్రూప్‌ హెడ్‌ సిరాజుద్దీన్‌ది చాలా పెద్ద నెట్‌వర్క్. తాలిబన్‌లలో నెంబర్ 2 పొజిషన్‌ ఇతనిదే. హక్కానీ జాడ చెప్పిన వాళ్లకు అమెరికా 10 మిలియన్ డాలర్ల నజరానా ఇస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఇప్పుడే కాదు. ముంబయికి ఇలాంటి బెదిరింపులు జనవరిలోనూ వచ్చాయి. కంట్రోల్ రూమ్‌కి ఓ వ్యక్తి కాల్ చేసి సిటీలోని చాలా చోట్లు బాంబు దాడులు చేస్తామని హెచ్చరించాడు. మరో రెండు నెలల్లో బాంబ్ బ్లాస్ట్‌లు జరుగుతాయని వార్నింగ్ ఇచ్చాడు. అప్పటి నుంచే భద్రత పెంచిన పోలీసులు...ఇప్పుడు మరింత కట్టుదిట్టం చేశారు.అయోధ్య రామ మందిరాన్ని పేల్చే కుట్ర జరిగే ప్రమాదముందని ఇటీవలే నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ హెచ్చరికలతో పోలీసులూ అలెర్ట్ అయ్యారు. భారీ భద్రత నడుమ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.


Also Read: Mahmood Madani: ఇలా అవుతుందని ఊహించలేదు, 100 సార్లు క్షమాపణలు చెబుతున్నాను - ఇస్లాం వివాదంపై మహమూద్ మదాని