అధికారికంగా ఈ పని పూర్తి చేశాం: సీఎం శిందే


ముస్లిం పేర్లున్న నగరాలకు హిందూ పేర్లు పెడుతూ వస్తోంది భాజపా. ఇప్పటికే పలు ప్రాంతాల పేర్లు మార్చింది. ఇప్పుడు మహారాష్ట్రలోనూ ఇదే పని మొదలు పెట్టింది. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే ఓ కీలక ప్రకటన చేశారు. ఔరంగాబాద్‌ పేరుని సంబాజీనగర్‌గా, ఉస్మానాబాద్‌ పేరుని ధారాశివ్‌గా మార్చుతూ ఉత్తర్వులు జారీ చేశారు. నేవీ ముంబయి ఎయిర్‌పోర్ట్‌కు మాజీ లోక్‌సభ ఎంపీ డీబీ పాటిల్ పేరు పెట్టారు. గత ప్రభుత్వం చివరిసారి కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు అప్పటి సీఎం ఉద్దవ్ ఠాక్రే అనధికారికంగా ఈ పేర్లు మార్చేందుకు ప్రయత్నించారని అన్నారు సీఎం శిందే. ఆ పనిని తమ ప్రభుత్వం అధికారికంగా చేపట్టిందని స్పష్టం చేశారు. జూన్‌ 29న మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం చివరిసారి కేబినెట్ మీటింగ్‌ ఏర్పాటు చేసుకుంది. ఆ సమయంలోనే ఔరంగాబాద్‌ను సంబాజీనగర్‌గా, ఉస్మానాబాద్‌ను ధారాశివ్‌గా మార్చాలన్న ప్రతిపాదనలకు అంగీకరించారు.





 కాంగ్రెస్ వర్సెస్ శివసేన..


మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్‌ పేరునే ఔరంగాబాద్ ప్రాంతానికి పెట్టారు. అయితే ఈ పేరు మార్చాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఔరంగజేబు పేరు తొలగించి, మరాఠా సామ్రాజ్య వ్యవస్థాపకుడు, ఛత్రపతి శివాజీ పెద్ద కొడుకు సంబాజీ పేరునే పెట్టాలని చాలా కాలంగా వాదన వినిపిస్తోంది. శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే కూడా ఇదే డిమాండ్‌ను చాలా సార్లు వినిపించారు. అయితే ఈ పేరు మార్చే విషయమై శివసేన, కాంగ్రెస్ మధ్య చాలా రోజుల నుంచి భేదాభిప్రాయాలున్నాయి. శివసేన ఇందుకు మద్దతునివ్వగా, కాంగ్రెస్ మాత్రం వ్యతిరేకిస్తూ వచ్చింది. ఇలా పేరు మార్చటం వల్ల "సెక్యులర్ పార్టీ"లకు ముస్లిం ఓటు బ్యాంకు పోతుందన్న భయం పట్టుకుందంటూ శివసేన సామ్‌నా పత్రికలో ఓ సంపాదకీయం రావటంపై కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక నేవీ ముంబయి ఎయిర్‌పోర్ట్‌ను ఇప్పటి నుంచి డీబీ పాటిల్ అంతర్జాతీయ విమానాశ్రయంగా పిలవాలని శిందే ప్రభుత్వం స్పష్టం చేసింది. 


Also Read: Jahangirpuri Man Shot Dead: తాపీగా నడుచుకుంటూ వచ్చాడు, తుపాకీతో కాల్చాడు-దిల్లీలో మైనర్ ఘాతుకం