Manipur Violence: 



రాహుల్ పర్యటన..


కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మణిపూర్‌లో పర్యటిస్తున్నారు. బాధితులు ఎక్కువగా ఉన్న మొయిరాంగ్‌లోని ప్రజల్ని పలకరించారు. వారితో కాసేపు మాట్లాడారు. అక్కడి బాధితుల్లో కొందరు రాహుల్‌ని పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. వాళ్లను ఓదార్చిన రాహుల్.."గుండె పగిలిపోతోంది" అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. 


"ఇక్కడి ప్రజల్ని కదిలిస్తేనే గుండె పగిలిపోతోంది. చాలా మంది తమ వాళ్లను పోగొట్టుకున్నారు. నిరాశ్రయులయ్యారు. ప్రతి ఒక్కరూ సాయం కోసం అర్థిస్తున్నారు. చిన్నారులు వెక్కివెక్కి ఏడుస్తున్నారు. ఇప్పుడు మణిపూర్‌లో శాంతియుత వాతావరణం ఎంతో అవసరం. ఇంత మంది ప్రాణాల్ని కాపాడేందుకు అందరం కలిసి కట్టుగా పని చేయాలి. ఇక్కడి ప్రజలు ప్రశాంతంగా గపిడేందుకు ప్రయత్నించాలి. రిలీఫ్ క్యాంప్‌లోనూ ప్రజలతోనూ మాట్లాడాను. అక్కడ రోజువారీ సరుకులకే ఇబ్బందిగా ఉంది. వాళ్లకు కావాల్సినవేవీ అందుబాటులో లేవు. ప్రభుత్వం దీనిపై తప్పకుండా దృష్టి సారించాలి. నేనిక్కడే ఉన్నాను. శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు ఏం చేయాలో అది చేస్తాను"


- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత 











మొయిరాంగ్‌తో పాటు బిష్ణుపూర్‌లోని రిలీఫ్‌ క్యాంప్‌లలోనూ పర్యటించారు రాహుల్ గాంధీ. అల్లర్ల కారణంగా తీవ్రంగా నష్టపోయిన బాధితులను పరామర్శించారు. మణిపూర్ కాంగ్రెస్ చీఫ్ ఓక్రం ఇబ్బోయ్ సింగ్‌తో పాటు పార్టీ జనరల్ సెక్రటరీ కేసే వేణుగోపాల్‌ రాహుల్‌తో ఉన్నారు. అంతకు ముందు రోజు చురచంద్‌పూర్‌లోని బాధితులను పరామర్శించారు రాహుల్. అయితే..బాధితులను కలిసేందుకు అధికారులు అంగీకరించడం లేదని కాంగ్రెస్ ఆరోపించింది. రాహుల్ కాన్వాయ్ ను అడ్డుకున్న పోలీసులు రోడ్డు మార్గం ద్వారా వెళ్లొద్దని ఆయనకు సూచించారు. భద్రతా పరమైన కారణాల దృష్ట్యా వాయు మార్గంలో వెళ్లాలని చెప్పారు. హెలికాప్టర్ లో అక్కడి వెళ్లవచ్చని సూచించారు. హింసాత్మక ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా బిష్ణుపూర్ లో కాన్వాయ్ ని ఆపివేయాలని రాహుల్ గాంధీని కోరినట్లు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. రాహుల్ గాంధీని అడ్డుకోవడంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ట్విట్టర్ వేదికగా స్పందించారు. మణిపూర్ లోని బిష్ణుపూర్ సమీపంలో రాహుల్ కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. సహాయ శిబిరాల్లో మగ్గుతున్న ప్రజలను కలుసుకునేందుకు, కలహాలతో  అల్లాడుతున్న రాష్ట్రంలో వైద్యం అందించేందుకు రాహుల్ అక్కడికి వెళ్తుండగా పోలీసులు నిలువరించినట్లు చెప్పారు. మణిపూర్ పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మౌనం వీడటం లేదని, రాష్ట్రాన్ని వదిలేశారని ఆరోపించారు.


Also Read: Manipur Violence: రాజీనామా చేయనున్న మణిపూర్ సీఎం బైరెన్ సింగ్! గవర్నర్‌తో భేటీ అందుకేనా!