Fake ED Officers: 


ఛత్తీస్‌గఢ్‌లో ఘటన..


ఛత్తీస్‌గఢ్‌లో కొన్ని రోజులుగా ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. లిక్కర్ స్కామ్‌ కేసులో అధికారులను, బడావ్యాపారులను అరెస్ట్ చేశారు. ఫలితంగా...బిజినెస్‌మేన్‌లు ఈ సోదాలపై ఆందోళన చెందుతున్నారు. ఈ భయాన్నే క్యాష్ చేసుకున్నాడు ఓ ఫేక్ ఈడీ ఆఫీసర్. ఈడీ నుంచి వచ్చామని చెప్పి బెదిరించి ఓ వ్యాపారి ఇంట్లో సోదాలు చేశాడు. ఆ తరవాత మరో నలుగురు వచ్చారు. మొత్తం ఐదుగురు ఫేక్ ఆఫీసర్లు సోదాల పేరుతో కాసేపు హడావుడి చేసి చివరకు రూ.2 కోట్లతో ఉడాయించారు. ఈడీ పేరు చెప్పగానే భయపడిపోయినా ఆ వ్యాపారి ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు. రూ.2 కోట్లు ఇచ్చేంత వరకూ వాళ్లు ఊరుకోలేదు. అక్కడితోనూ ఆగిపోలేదు ఆ కేటుగాళ్లు. ఎక్కడా అనుమానం రాకుండా పక్కా స్కెచ్ వేశారు. బ్లాక్ స్కార్పియోలోకి ఆ వ్యాపారిని ఎక్కించారు. అచ్చం ఈడీ అధికారుల్లాగే నమ్మిస్తూ ప్రశ్నలు వేశారు. చాలా సేపు ఇంటరాగేట్ చేశారు. కొంత దూరం వెళ్లాక ఉన్నట్టుండి కార్‌లో నుంచి ఆ వ్యాపారిని బయటకు తోశారు. ఆ తరవాతే అర్థమైంది..వాళ్లు అసలు ఈడీ అధికారులు కారని. వెంటనే పోలీస్‌ స్టేషన్‌కి పరిగెత్తాడు ఆ వ్యాపారి. జరిగిందంతా వాళ్లకు వివరించాడు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడైతే ఆ వ్యాపారిని కిందకు తోసేసి వెళ్లారో ఆ ప్రాంతంలోని సీసీటీవీలను పరిశీలించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఓ రైస్‌మిల్ నడుపుకునే వినేష్ గుప్తా తన ఇంట్లో రూ.2కోట్లు దాచుకున్నాడు. ఇది పసిగట్టిన ఆ ఫేక్ ఆఫీసర్‌లు..ఓ బ్లాక్ స్కార్పియోలో వెళ్లారు. ఢిల్లీ నుంచి వచ్చామని చెప్పి ఇంట్లోకి వెళ్లారు. కాసేపు హడావుడి చేసి ఆ తరవాత నేరుగా డబ్బుల గురించే ప్రస్తావించారు. ఆ రెండు కోట్లు ఎక్కడ పెట్టారో చెప్పాలని ఒత్తిడి తెచ్చారు. ఈ కేసులో ముగ్గురుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 


నకిలీ పోలీస్ స్టేషన్..


ఓ దొంగల ముఠా ఏకంగా నకిలీ ఠాణా ఏర్పాటు చేసి దందాలు చేయడం మొదలు పెట్టింది. ఈ ఘటన గతేడాది బీహార్ లో జరిగింది. బాంకా జిల్లాకు చెందిన భోలా యాదవ్ అనే వ్యక్తి ఈ ముఠాకు నాయకత్వం వహించాడు. తన గెస్ట్ హౌస్ ను నకిలీ పోలీస్ స్టేషన్ గా మార్చాడు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా కొంత మందికి రోజూ రూ.500 ఇచ్చి యూనిఫామ్ లు అందించాడు. వారికి నాటు తుపాకులు కూడా ఇచ్చాడు. వీరందరికీ హెడ్ గా ఓ డీఎస్పీని ఏర్పాటు చేశాడు. మొత్తానికి నకిలీ పోలీసులతో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి.. ఎవరికీ అనుమానం రాకుండా రన్ చేశాడు భోలా యాదవ్. అది నకిలీ పోలీస్ స్టేషన్ అని తెలియని జనాలు అక్కడికి వచ్చి ఫిర్యాదులు కూడా చేయడం మొదలు పెట్టారు. ఫిర్యాదుదారుల నుంచి కూడా డబ్బులు వసూలు చేయడం మొదలు పెట్టారు. పోలీసు ఉద్యోగాలు సైతం ఇస్తామని అమాయకులను మోసం చేసి భారీగా డబ్బులు లాగుతున్నారు. సుమారు 8 నెలల పాటు వీరి దందా కొనసాగింది. ఈ పోలీస్టేషన్ సైతం ఎంతో దూరంలో లేదు.. అసలు పోలీస్ స్టేషన్ కు అత్యంత దగ్గరగానే ఉంది. ఓ రోజు అసలు పోలీస్ స్టేషన్ లో పని చేసే శంభు యాదవ్.. నాటు తుపాకులతో ఉన్న పోలీసులను చూశాడు. వాళ్ల తీరు మీద అతడికి అనుమానం వచ్చింది. అసలు విషయాన్ని ఆరా తీశాడు. మొత్తంగా ఈ ఫేక్ పోలీస్ స్టేషన్ వ్యవహారం బయటపడింది. వెంటనే శంభు యాదవ్.. ఈ విషయాన్ని తన పై అధికారులకు చెప్పాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నకిలీ పోలీస్టేషన్ రన్ చేస్తున్న వారిని పట్టుకున్నారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఆరుగురు నకిలీ పోలీసులు ఉన్నారు. 


Also Read: మేకిన్ ఇండియా కాన్సెప్ట్‌కి ఫిదా అయిన పుతిన్, మోదీ విజనరీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్