Kerala Lottery Jackpot: 


రూ.10 కోట్ల లాటరీ


అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో చెప్పలేం. ఉన్నట్టుండి కొందరిని లక్షాధికారులు, కోటీశ్వరులను చేసేస్తుంది. కేరళలోని మలప్పురంలో ఇదే జరిగింది. పరప్పనంగడి మున్సిపాలిటీలో హరిత కర్మ సేనలో పని చేస్తున్న 11 మంది మహిళలు ఓ లాటరీ టికెట్ కొన్నారు. ఈ టికెట్ ధర రూ.250. ఈ లాటరీలో వాళ్లు గెలుచుకున్న మొత్తం ఎంతో తెలుసా...? రూ.10 కోట్లు. ఇప్పుడు వాళ్ల ఆనందం పట్టలేకుండా ఉంది. మొత్తం 11 మంది కలిసి ఈ టికెట్ కొనుగోలు చేశారు. ఇందుకోసం 9 మంది రూ.25 చొప్పున ఇచ్చారు. మిగతా ఇద్దరు రూ.12.5 చొప్పున ఇచ్చారు. ఇలా మొత్తం రూ.250 కలెక్ట్ చేసి టికెట్‌ కొనేశారు. అదృష్ట దేవత వీళ్లని చూసి కనికరించినట్టుంది. అందుకే రూ.10 కోట్ల లాటరీ దక్కింది వీళ్లకి. దాదాపు రెండున్నరేళ్లుగా వీళ్లు చేస్తున్న పని చెత్త ఏరివేయడం. భూమిలో కలిసిపోని వ్యర్థాలను సేకరించడమే వీళ్ల డ్యూటీ. ఈ పరప్పనంగడి మున్సిపాలిటీలో దాదాపు 57 మంది హరిత కర్మ సేన సిబ్బంది ఉన్నారు. లాటరీ తగిలినా సరే తమ పని తాము చేసుకుంటామని చెబుతున్నారు ఈ మహిళలు. కలిసికట్టుగా పని చేయడం వల్లే ఈ అదృష్టం తమని వరించిందని సంతోషంగా చెబుతున్నారు. 


"నిజంగా చెప్పాలంటే మాకు ఈ లాటరీ వస్తుందని అస్సలు నమ్మకం లేదు. ఇప్పటికే నాలుగు సార్లు ఇలాగే టికెట్స్ కొన్నాం. ఏ ఒక్కటీ తగల్లేదు. విన్నింగ్ టికెట్‌ని అమ్ముకున్నారని మాకు సమాచారం అందింది. అది నిజమే అనుకుని ఆశలు వదులుకున్నాం. నేను పని చేసుకుని మధ్యాహ్నం ఇంటికి వెళ్లాను. అప్పుడే నా కొడుకు నాతో ఓ విషయం చెప్పాడు. టికెట్ కొన్నామా లేదా అని అడిగాడు. కొన్నామని చెప్పాను. మన ఇంటికి ఓ వ్యక్తి కాల్ చేసి రూ.10కోట్ల లాటరీ తగిలిందని చెప్పాడు అంటూ మా అబ్బాయి చెబుతుంటే సంతోషం పట్టలేకపోయాను"


- లాటరీ గెలుచుకున్న మహిళ


ఇళ్లు కట్టుకుంటాం..


ఇంతకీ ఈ డబ్బుతో ఏం చేస్తారని అడిగితే..మంచి ఇళ్లు కట్టుకుంటామని చెబుతున్నారు. పిల్లల చదువుకి ఖర్చు చేస్తామని కొందరు, అప్పులు తీర్చేసామని మరి కొందరు చెప్పారు. వీళ్లంతా నిరుపేదలే. ఇంటి నుంచి ఆఫీస్‌కి వెళ్లడానికి డబ్బ ఖర్చవుతోందని నడుచుకుంటూ వెళ్తున్నారట. ఇప్పుడు ఉన్నట్టుండి ఇంత పెద్ద మొత్తం వచ్చే సరికి సంతోష పడుతున్నారు. 


జర్మనీలోనూ...


లాటరీ టికెట్లు ఒక్కోసారి కొంత మంది జీవితాలను అనుకోని మలుపులు తిప్పుతుంటాయి. తాజాగా జర్మనీకి చెందిన ఓ యువకుడికి కనీవినీ ఎరుగని లాటరీ తగిలించింది. ఏకంగా రూ. 81 కోట్ల లాటరీ గెల్చుకున్నాడు. డార్ట్‌మండ్‌కు చెందిన కుర్సాట్ యిల్డిరిమ్ స్టీల్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసే వాడు. కొద్ది రోజుల కిందట లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. తాజాగా వాటి ఫలితాలు వెల్లడి అయ్యాయి. ఇందులో ఏకంగా 9,927,511,60 యూరోలు అంటే భారత కరెన్సీలో రూ. 81 కోట్లు గెలుచుకున్నాడు.


Also Read: PM Modi: టార్గెట్ 2024- 430 మంది ఎంపీలతో ప్రధాని మోదీ సమావేశం