ఎన్నికలే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహ రచన చేస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌ (NDA)లో 38 పార్టీలకు చెందిన 430 మంది ఎంపీలతో మోదీ సమావేశం కానున్నారు. ఈ మేరకు ఎన్డీఏలోని 430 మంది ఎంపీలను బీజేపీ 11 గ్రూపులుగా విభజించింది. రానున్న ఎన్నికల్లో అధికారమే ఎజెండగా ఎన్డీఏ మిత్ర పక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడం, వారిని సమన్వయం చేసుకోవడంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో జూలై 31 నుంచి ఆగస్టు 10 వరకు ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సహా పార్టీ సీనియర్ నేతలు భాగం కానున్నారు. 


జులై 31న జరుగనున్న తొలి సమావేశంలో పశ్చిమ ఉత్తరప్రదేశ్, బుందేల్‌ఖండ్, బ్రజ్, అలాగే పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశాకు చెందిన 83 మంది ఎంపీలతో కూడిన రెండు బృందాలతో ప్రధాని మోదీ సమావేశమవుతారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో నడ్డా, గడ్కరీ, రెండో సెషన్‌లో అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ హాజరుకానున్నారు. ఈ సమావేశాలకు సమన్వయ కర్తలుగా కేంద్ర మంత్రులు సంజీవ్ బలియన్, బీఎల్ వర్మ, ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యతలు నిర్వర్తిస్తారు.  


ఆగస్టు 2న, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్‌లతో పాటు ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల నుంచి 96 మంది ఎంపీలతో కూడిన మూడు, నాలుగు గ్రూపులు సమావేశాలు నిర్వహించనున్నాయి. కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్, మహేంద్ర నాథ్ పాండే, ప్రహ్లాద్ జోషి, మురళీధరన్ ఈ సమావేశాలను సమన్వయకర్తలుగా పని చేస్తారు. .


బీహార్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీగఢ్, హర్యానా, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లకు చెందిన 63 మంది ఎంపీలతో కూడిన ఐదు, ఆరో గ్రూపులతో ఆగస్టు 3న ప్రధాని మోదీ సమావేశం అవుతారు. కేంద్ర మంత్రులు నిత్యానంద రాయ్, అనురాగ్ ఠాకూర్, అజయ్ భట్ ఈ సమావేశాలను సమన్వయం చేస్తారు. 


ఆగస్టు 8న ఉదయం రాజస్థాన్, మహారాష్ట్ర, గోవాల నుంచి మొత్తం 76 మంది ఎంపీలున్న రెండు గ్రూపులు ప్రధానిని కలవనున్నాయి. సమావేశాలకు కేంద్రమంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ కూడా హాజరవుతారని సమాచారం. సమావేశాలను భారతి పవార్, కపిల్ పాటిల్ సమన్వయకర్తలుగా పని చేస్తారు. అదే రోజు సాయంత్రం రాజస్థాన్ నుంచి ఏడు, ఎనిమిదవ గ్రూపుల సమావేశాలను సైతం నిర్వహిస్తారు. ఈ సమావేశాలకు JP నడ్డా, రాజ్‌నాథ్ సింగ్ హాజరవుతారు. మంత్రులు అర్జున్ రామ్ మేఘవాల్, కైలాష్ చౌదరి సమావేశాలు జరిగేలా సమన్వయం చేస్తారు. ఈ గ్రూపుల్లో రాజస్థాన్‌కు చెందిన 28 మంది ఎంపీలు ఉంటారు. 


ఆగస్టు 9వ తేదీన నడ్డా, గడ్కరీలు పాల్గొనే గుజరాత్, దాద్రా నగర్ హవేలీ, డామన్, డయ్యూ ఎంపీలతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. ఈ సమావేశాలకు కేంద్ర మంత్రులు పురుషోత్తం రూపాలా, దర్శన జర్దోష్ నేతృత్వంలో 35 మంది ఎంపీలు పాల్గొంటారు. అదే రోజు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌లు పాల్గొనే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఎంపీలతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. 46 మంది ఎంపీలు పాల్గొనే సమావేశాలను కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రేణుకా సింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.


త్రిపురతో పాటు సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం, మేఘాలయ రాష్ట్రాలకు చెందిన ఎన్డీయే ఎంపీలు ఆగస్టు 9న ప్రధానిని కలవనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశాలకు నడ్డా, నితిన్ గడ్కరీ హాజరుకానున్నారు. 31 మంది ఎంపీలు పాల్గొనే ఈ సమావేశాలను కేంద్ర మంత్రులు సర్బానంద సోనోవాల్, కిరణ్ రిజిజు నేతృత్వంలో సమావేశాలు జరుగుతాయి.