Vande Bharat Fare: 


రైల్వేబోర్డ్ ప్రకటన..

రైల్వే బోర్డ్ ప్రయాణికులకు తీపి కబురు చెప్పింది. వందేభారత్‌తో పాటు అన్ని AC చైర్‌ కార్‌, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌ రైళ్ల టికెట్ ధరల్ని తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. 25% మేర తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. గత నెల రోజులుగా ఈ రైళ్లలో ఆక్యుపెన్సీ 50% కన్నా తక్కువకు పడిపోయింది. అందుకే...ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వే బోర్డ్ తెలిపింది. ఈ రైళ్ల వినియోగం మరింత పెంచేందుకు టికెట్ ధరల్ని తగ్గించినట్టు వివరించింది. ఈ ధరలు తగ్గించే అధికారం జోనల్ రైల్వేస్‌కే అప్పగించింది రైల్వే శాఖ. అయితే..బేసిక్ ఫేర్‌పైనే ఈ 25% తగ్గింపు ఉంటుంది. మిగతా ఛార్జీలు..అంటే రిజర్వేషన్ ఛార్జ్‌లు, సూపర్ ఫాస్ట్ సర్‌ఛార్జ్‌, GST ఛార్జీల్లో మాత్రం ఎలాంటి మార్పులేదు. ఈ తగ్గింపు తక్షణమే అమల్లోకి వస్తుందని రైల్వే ప్రకటించింది. 


ఇవీ వివరాలు..


ఈ తగ్గింపు కేవలం ఏసీ చైర్ కార్‌లు, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ట్రైన్‌లకు మాత్రమే వర్తిస్తుంది. టికెట్ బేస్‌ ఫేర్‌పై 25% తగ్గింపు లభిస్తుంది. ఇక్కడ  కీలక విషయం ఏంటంటే...గత నెల రోజుల్లో 50% తక్కువ ఆక్యుపెన్సీ నమోదైన రైళ్లలో మాత్రమే ఇది వర్తిస్తుంది. ఎండ్ టు ఎండ్ జర్నీకే కాకుండా మధ్య స్టేషన్‌లలో దిగిపోయే వారు కూడా 25% తగ్గింపుతో టికెట్‌లు కొనుగోలు చేసుకోవచ్చు. దాదాపు ఆర్నెల్ల పాటు ఈ స్కీమ్ కొనసాగే అవకాశాలున్నాయి. ఆ తరవాత డిమాండ్ ఆధారంగా ఈ తగ్గింపుని అమలు చేస్తూ ఉంటారని కొందరు అధికారులు వెల్లడించారు. వీకెండ్స్‌లో లేదా వీక్‌డేస్‌లో టికెట్ ధరలు తగ్గించి ఎక్కువ మంది ప్రయాణికులు సర్వీస్‌లు పొందే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఆక్యుపెన్సీని గమనించిన తరవాతే ఈ స్కీమ్‌ని కంటిన్యూ చేయాలా..లేదా ఆపేయాలా అన్నది రైల్వేబోర్డు నిర్ణయం తీసుకుంటుంది. ఆక్యుపెన్సీ ఊహించిన దానికంటే ఎక్కువగా పెరిగితే అప్పుడు ఈ స్కీమ్‌ని ఎత్తేసే అవకాశముంది. స్పెషల్ ట్రైన్‌లలో మాత్రం ఈ స్కీమ్ వర్తించదు. 


తగ్గిన ఆక్యుపెన్సీ..


ఇటీవ‌ల ప్రారంభించిన నాలుగు వందేభార‌త్ రూట్ల‌లో త‌క్కువ ఆక్యుపెన్సీ ఉంది. ఇండోర్ - భోపాల్‌, మ‌డ్‌గోన్ - ముంబ‌యి, జ‌బ‌ల్‌పూర్ - భోపాల్ రూట్ల‌లో మ‌రీ త‌క్కువగా 21 శాతం నుంచి 55 శాతం వ‌ర‌కు ఆక్యుపెన్సీ ఉంది. జూన్‌ నెలకు సంబంధించి ఆయా రైళ్ల ఆక్యుపెన్సీని పరిశీలిస్తే.. భోపాల్‌- ఇండోర్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ కేవలం 29 శాతం, ఇండోర్‌- భోపాల్‌ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు కేవలం 21 శాతం ఆక్యుపెన్సీని మాత్రమే నమోదు చేశాయి. భోపాల్‌- జబల్‌పుర్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్ రూటులో 32 శాతం ఆక్యుపెన్సీ ఉంది. జబల్‌పుర్‌- భోపాల్‌ వందే భారత్‌ ఆక్యుపెన్సీ రేషియో 36శాతంగా ఉంది. దేశంలో చాలా వందే భారత్‌ రైళ్లు 100శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయ‌ని, కొన్ని మాత్రమే తక్కువ ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయ‌ని ఓ సీనియ‌ర్ అధికారి తెలిపారు. ముఖ్యంగా తక్కువ ప్రయాణ సమయం ఉన్న రైళ్లలో టికెట్‌ ధరలు తగ్గిస్తే మరింత ఆదరణ సొంతం చేసుకుంటాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.  


Also Read: పట్టాలపై నట్‌లు బోల్టులు మిస్‌, తృటిలో తప్పిన ప్రమాదం - చూడకపోతే మరో బాలాసోర్ అయ్యేదేమో!