Nuh Violence: 



ఆందోళన..


హరియాణా అల్లర్ల అలజడి ఇంకా సద్దుమణగలేదు. ఘర్షణ జరిగిన నూహ్ ప్రాంతం పోలీసుల పహారాలోనే ఉంది. ముందస్తు జాగ్రత్తగా భద్రతను కట్టుదిట్టం చేసింది ప్రభుత్వం. మరింత అల్లర్లు చెలరేగకుండా ముందస్తు జాగ్రత్తగా ఇంటర్నెట్‌ సర్వీస్‌లను నిలిపివేశారు. ఆగస్టు 3వ తేదీ వరకూ నూహ్‌ పరిసర జిల్లాల్లో ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. శాంతిభద్రతలు అదుపు తప్పకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. పలు చోట్ల కర్ఫ్యూ కూడా విధించడం వల్ల స్థానికుల్లో ఆందోళన మొదలైంది. ఎటు చూసినా భయంగానే ఉందని, రేషన్‌ దుకాణానికీ వెళ్లలేకపోతున్నామని అసహనం వ్యక్తం చేస్తున్నారు. 


"రేషన్‌ సరుకులు తెచ్చుకుందామని బయటకు వస్తే ఇక్కడి పరిస్థితులు చూసి చాలా భయమేస్తోంది. ఎటు చూసినా గందరదోళమే. మా పిల్లల్నైతే అససు బయటకు పంపడం లేదు. రాత్రి పూట కూడా ఇలాగే భయపడుతూ గడుపుతున్నాం. ఎన్ని రోజులు ఇలా ఉండాలో అర్థం కావడం లేదు"


- స్థానికులు


ఇప్పటి వరకూ ఈ అల్లర్లకు కారణమైన 139 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 45 FIRలు నమోదయ్యాయి. అయితే...వీటిలో ఎక్కడా బజ్‌రంగ్ దళ్‌, వీహెచ్‌పీకి చెందిన వాళ్ల పేర్లు లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్ట్‌లు పెట్టిన వారిపై కేసులు పెట్టారు. దాదాపు 10 అభ్యంతరకరమైన పోస్ట్‌ల URLలను గుర్తించారు. ఈ ప్రాంతాల్లోని క్రిమినల్స్‌ ఎంత మంది ఉన్నారన్న లెక్కలూ తీస్తున్నారు పోలీసులు. నాలుగు గ్రామాల్లో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఇప్పటికే దీనిపై 10 సిట్‌ కమిటీలు ఏర్పాటయ్యాయి. ఒక్కో కమిటీకి ఒక్కో బాధ్యత అప్పగించారు. అయితే...అటు ఢిల్లీలోనూ ఈ అల్లర్లపై ఆందోళనలు జరుగుతున్నాయి. బజ్‌రంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్‌ కార్యకర్తలు ఢిల్లీ, NCR ప్రాంతాల్లో ర్యాలీలకు పిలుపునిచ్చారు. వీటికి అనుమతినిస్తే మరింత హింస చెలరేగే ప్రమాదముందని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం ఆ ర్యాలీలను అడ్డుకోవడాన్ని వ్యతిరేకించింది. ఇదే సమయంలో విద్వేష పూరిత ప్రసంగాలు చేయకుండా పోలీసులు జాగ్రత్త పడాలని హెచ్చరించింది. గుడ్‌గావ్‌, ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. సున్నితమైన ప్రాంతాల్లో భద్రత పెంచారు. 


నిఘా వైఫల్యమా..? 


హరియాణాలో అల్లర్లు జరగడానికి నిఘా వర్గాల వైఫల్యమే కారణమా..? ప్రస్తుతానికి దీనిపైనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ అంశం సుప్రంకోర్టు వరకూ వెళ్లింది. భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు CCTVలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది సర్వోన్నత న్యాయస్థానం. అయితే...ఇది కేవలం ఇంటిలిజెన్స్ వైఫల్యమే అన్న వాదనలు వినిపిస్తున్నాయి. అటు ఇంటిలిజెన్స్ అధికారులు మాత్రం తాము ముందుగానే దీనిపై హెచ్చరికలు చేశామని తేల్చి చెబుతున్నారు. పోలీసులకు సమాచారం అందించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదన్న వాదనా వినిపిస్తోంది. ముస్లింలు ఇంతగా దాడులు చేయడానికి కారణం...విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన యాత్ర. ఆ యాత్రను లీడ్ చేసిన మోను మనేసర్...గతంలో ఇద్దరు ముస్లింలను హత్య చేసిన కేసులో అరెస్ట్ అయ్యాడు. ఇదే వ్యక్తి అక్కడ బ్రిజ్ మండల్ జలాభిషేక్ యాత్ర నిర్వహించాడు. దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన ముస్లింలు దాడులు చేశారు. ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న వివరాల ప్రకారం...వేలాది మంది ఈ యాత్రలో పాల్గొన్నారు. దాదాపు 2,500 మంది ఆందోళనకారులు ఆలయంపై దాడి చేశారు. అక్కడి షాప్‌లను ధ్వంసం చేశారు. 


Also Read: Gyanvapi Mosque Case: జ్ఞానవాపి మసీదులో సర్వేకి లైన్ క్లియర్, అనుమతినిచ్చిన అలహాబాద్ హైకోర్టు