G20 Summit: ప్రతిష్టాత్మక జీ20 శిఖరాగ్ర సదస్సు ఢిల్లీ వేదికగా సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ సదస్సు కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అంగరంగ వైభవంగా నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఢిల్లీ వేదికగా జరగనున్న ఈ సమావేశానికి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల అధినేతలు హాజరు కానున్నారు. ఈ సదస్సుకు వచ్చే దేశాధినేతలు తిలకించేందుకు.. మదర్ ఆఫ్ డెమోక్రసీ పేరుతో ప్రత్యేక ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన చూసేందుకు వచ్చే ప్రపంచ దేశ అగ్ర నాయకులను ఆహ్వానించేందుకు ప్రత్యేకంగా ఏఐతో అవతార్ ను అభివృద్ధి చేసింది కేంద్ర సర్కారు. 


వేద కాలం నుంచి ఆధునిక యుగం వరకు దేశ ప్రజాస్వామ్య సంస్కృతులను ఈ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించనున్నారు. ఆడియో రూపంలో, టెక్ట్స్ రూపంలో దీనిని ఏర్పాటు చేశారు. ఆడియో రూపంలో ఇంగ్లీష్, ఫ్రెంచ్, మాండరీన్, ఇటాలియన్, కొరియన్, జపనీస్ సహా 16 ప్రపంచ భాషల్లో ఆడియోను అందుబాటులో ఉంచుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ ను చూసేందుకు ప్రపంచ దేశాల అగ్రనేతలు, ఇతర ప్రతినిధులు రాగానే వారిని ఏఐ ఆధారిత అవతార్ ఆహ్వానం పలుకుతుంది. ఎగ్జిబిషన్ ప్రాముఖ్యత గురించి అతిథులకు ఈ అవతార్ వివరించి చెబుతుంది. వారికి ఏ భాష కావాలంటే ఆ భాషలో సవివరిస్తుంది.


Also Read: Telangana High Court: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం


జీ20 సదస్సు జరగనున్న ప్రదేశానికి ఎదురుగా భారీ నటరాజ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. భారీ ఏర్పాట్లపై మధ్య ఈ అతిపెద్ద నటరాజ విగ్రహం సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలవనుంది.


28 అడుగుల భారీ నటరాజ విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించింది కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. ఈ విగ్రహాన్ని తమిళనాడులో ప్రత్యేకంగా రూపొందించి ఢిల్లీకి తెప్పించారు. ఈ అతిపెద్ద నటరాజ విగ్రహాన్ని తమిళనాడు కుంభకోణం తాలూకా స్వామిమలైలోని దేవ సేనాపతి శిల్పకళాశాలలో తయారు చేశారు. దేవా. రాధాకృష్ణన్, దేవా.పి. కందన్, దేవా స్వామినాథన్ తమ సహోద్యోగులతో కలిసి ఆరు నెలల పాటు శ్రమించి ఈ నటరాజ విగ్రహాన్ని రూపొందించారు. ఈ భారీ విగ్రహాన్ని తమిళనాడు నుంచి ఢిల్లీకి రోడ్డు మార్గం ద్వారా తీసుకువచ్చారు. సుదీర్ఘమైన గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి దాదాపు రెండున్నర వేల కిలోమీటర్లు ఈ విగ్రహాన్ని తరలించారు. తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మీదుగా ఢిల్లీకి చేర్చారు. శిఖరాగ్ర సదస్సు జరిగే ప్రగతి మైదాన్ లోని భారత్ మండపంలో ఈ 19 టన్నుల విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు.


ఈ నటరాజ విగ్రహాన్ని బంగారం, వెండి సహా 8 లోహాలతో తయారు చేశారు. ఈ విగ్రహం రూపకల్పన కోసం కేంద్ర మంత్రిత్వ శాఖ ఆరు నెలల ముందే ఆర్డర్ ఇచ్చింది. విగ్రహం మొత్తం ఎత్తు 22 అడుగులు కాగా.. దాని స్టాండ్ 6 అడుగుల ఎత్తు ఉంటుంది. 21 అడుగుల వెడల్పు ఉంటుంది. దాదాపు రూ.10 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు సమాచారం.