Elon Musk: 


వేలాది మంది ఫిర్యాదులు..


ట్విటర్‌ బాస్ ఎలన్ మస్క్‌కి, ఉద్యోగులకు మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఏ మాత్రం సమాచారం లేకుండా తమను ఉద్యోగంలో నుంచి తొలగించారని మండి పడుతున్నారు. వేలాది మంది ఎంప్లాయీస్ న్యాయ పోరాటానికి దిగారు. ఇప్పటి వరకూ ఎలన్‌ మస్క్‌పై 2,200 మంది ఉద్యోగులు కేసులు పెట్టారు. కంపెనీ రీకన్‌స్ట్రక్షన్ పేరుతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని వేల మంది కేసులు పెట్టేందుకే 35 లక్షల డాలర్లు ఖర్చు చేసినట్టు సమాచారం. ట్విటర్‌లో ఒకప్పుడు సీనియర్ స్టాఫ్ నెట్‌వర్క్ ఇంజనీర్‌గా పని చేసిన క్రిస్ వుడ్‌ఫీల్డ్‌ ఈ విషయం వెలుగులోకి తీసుకొచ్చారు. లేఆఫ్‌లలో తానూ ఉద్యోగం పోగొట్టుకున్నారు క్రిస్. అప్పటి నుంచి మస్క్‌పై మండి పడుతున్నారు. ఇస్తామన్న డబ్బులూ ట్విటర్ ఇవ్వకుండా మోసం చేసిందని ఆరోపిస్తున్నారు. మధ్యవర్తిత్వం వహించి తమ సమస్యను పరిష్కరించాలని ఉద్యోగులు కోరుతున్నప్పటికీ...అందుకు ట్విటర్ యాజమాన్యం మాత్రం అంగీకరించడం లేదు. ఈ కేసులతో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెబుతోంది. ఈ క్రమంలోనే వేరే కేసులనూ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు ఉద్యోగులు. మధ్యవర్తిత్వం కేసులలో ఉద్యోగులు వినిపించే వాదనను కోర్టులు పరిగణించవని, అందుకే ఈ కేసులను వేరే విధంగా బదిలీ చేయాలనే యోచనలో ఉన్నామని క్రిస్ వెల్లడించారు. 


మస్క్ అగ్రెసివ్‌నెస్..


అయితే...సీనియర్ న్యాయవాదులు మాత్రం మధ్యవర్తిత్వమే మంచిదని ట్విటర్‌కి హితబోధ చేస్తున్నారు. అనవసరంగా చిక్కుల్లో పడడం కన్నా ఉద్యోగులతో రాజీ కుదుర్చుకోవాలని సూచిస్తున్నారు. అటు లీగల్ ఖర్చులూ తగ్గుతాయని చెబుతున్నారు. కానీ...ఈ విషయంలో ట్విటర్‌ వెనక్కి తగ్గుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఇప్పటికే మస్క్ తన అగ్రెసివ్‌నెస్‌తో చాలా మంది ఉద్యోగులను పోగొట్టుకున్నారు. సీనియర్ పొజిషన్‌లో ఉన్న వారినీ తొలగించారు. దీనిపై ఉద్యోగులు చాలా ఆగ్రహంతో ఉన్నారు. తమను అవమానించారని ఫైర్ అవుతున్నారు. అందుకే...అంత ఖర్చు చేసి మరీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఎలాగైనా మస్క్ నుంచి సమాధానం రావాలని డిమాండ్ చేస్తున్నారు. 


ఫేక్ ఫాలోవర్స్...


టెక్ బిలియనీర్, టెస్లా, ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ పై తాజాగా వెలువడిన రిపోర్టు ఒకటి షాకింగ్ కు గురి చేస్తోంది. తన ఆలోచనలు, నిర్ణయాలు, చిత్ర విచిత్ర వ్యాఖ్యానాలతో షాక్ లు ఇచ్చే ఎలన్ మస్క్ కు తాజాగా ఓ రిపోర్టు షాక్ ఇచ్చింది. ట్విట్టర్ లో ఎలన్ మస్క్ కు ఏకంగా 153.9 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఇందులో చాలా వరకు ఖాతాలు నకిలీవని, అందులో కొన్ని యాక్టివ్ లో లేవని, మరికొన్ని కొత్త అకౌంట్స్ అని ఆ రిపోర్టు నివేదించింది. Mashable నివేదిక ప్రకారం మస్క్ కి ఉన్న 153.9 మిలియన్ల మంది ఫాలోవర్స్ లో దాదాపు 42 శాతం అంటే 65.3 మిలియన్ల కంటే ఎక్కువ ఖాతాలకు కనీసం ఒక్క ఫాలోవర్ కూడా లేరని ఈ నివేదిక పేర్కొంది. థర్డ్ పార్టీ రీసెర్చర్ ట్రావిస్ బ్రౌన్ సేకరించిన డేటాను ఈ నివేదిక ప్రస్తావించింది. ఎలన్ మస్క్ ను ఫాలో అవుతున్న ట్విట్టర్ ఖాతాల్లో 100 మిలియన్లకు పైగా అకౌంట్లలో ఒక్కో ఖాతాలో కనీసం 10 ట్వీట్లు కూడా లేవని ఆ నివేదిక పేర్కొంది. ఈ మేరకు డేటాను ఆ రిపోర్టు ప్రచురించింది. 


Also Read: Raksha Bandhan 2023: ప్రధానికి రాఖీ కట్టిన స్కూల్ విద్యార్థినులు, కాసేపు సరదాగా ముచ్చటించిన మోదీ