Imran Khan Arrest:


అరెస్ట్‌కు సిద్ధం..


పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ అరెస్ట్‌కు రంగం సిద్దం చేసుకుంటోంది ప్రభుత్వం. దీనిపై ఇమ్రాన్ వర్గం తీవ్రంగా మండి పడుతోంది. ఇదంతా ఓ కుట్ర అని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇమ్రాన్ ఖాన్ కూడా తన అరెస్ట్‌ను ఖండిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ఇదంతా "లండన్ ప్లాన్‌"లో భాగంగానే జరుగుతోందని ఆరోపించారు. ట్విటర్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. నవాజ్ షరీఫ్‌పై ఉన్న కేసులన్నింటినీ రద్దు చేసేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. 


"ఇదంతా లండన్ ప్లాన్‌లో భాగమే. నన్ను అరెస్ట్ చేసి, జైల్లో పెట్టాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. నవాజ్ షరీఫ్‌ అలా భరోసా ఇచ్చారు.  మా పార్టీని పూర్తిగా పతనమయ్యేలా చేయడమే కాకుండా ఆయనపై ఉన్న కేసులను రద్దు చేయాలని కుట్ర చేస్తున్నారు"


-ఇమ్రాన్ ఖాన్, పాక్ మాజీ ప్రధాని






ఎలా అరెస్ట్ చేస్తారు: ఇమ్రాన్ 


మార్చి 18న చెప్పినట్టుగానే కోర్టుకు హాజరవుతానని చెప్పినా,తన వర్గం వాళ్లపై ఎందుకు దాడులు చేస్తున్నారో అర్థం కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు ఇమ్రాన్. బుధవారం తెల్లవారుజామున లాహోర్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన కాసేపటికే ఇమ్రాన్ ఇలా వీడియో పోస్ట్ చేశారు. పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇమ్రాన్‌ ఇంటికి వస్తున్నారు. అక్కడ పోలీసులు కాపు కాస్తున్నారు. ఫలితంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తుతోంది. దాదాపు 14 గంటలుగా అక్కడ అదే పరిస్థితులున్నాయి. ఇమ్రాన్‌ను అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు పోలీసులు. తనంతట తానుగానే కోర్టుకు వస్తానని, అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని హైకోర్టుకి విన్నవించారు ఇమ్రాన్. క్రిమినల్ ప్రోసీజర్ ప్రకారం తాను షూరిటీ బాండ్‌ను ఇచ్చానని, అలాంటప్పుడు నన్ను అరెస్ట్ చేయడం కుదరదని స్పష్టం చేశారు. అయితే...DIG మాత్రం ఆ బాండ్‌ను పట్టించుకోకుండా అక్రమంగా తనను అరెస్ట్ చేయాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు.  


ఏంటీ కేసు..? (Toshakhana Case)


Dawn పేపర్ ఇచ్చిన వివరాల ప్రకారం...2020లో ఓ జర్నలిస్ట్ రైట్‌ టు ఇన్‌ఫర్మేషన్ లా ఉపయోగించి సంచలన విషయాలు వెలుగులోకి తీసుకొచ్చాడు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు పెద్ద ఎత్తున గిఫ్ట్‌లు అందాయని వెల్లడించాడు. అయితే...నిపై అప్పటి పాక్ మంత్రులంతా మండి పడ్డారు. అలాంటి వివరాలు బయట పెడితే అంతర్జాతీయ దేశ పరువుకు భంగం వాటిల్లుతుందని అన్నారు. అప్పటికే Federal Information Commissionలో కేసు నమోదు చేశారు. అయినా ప్రభుత్వం జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. ఫలితంగా హైకోర్టుని ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన ఇస్లామాబాద్ హైకోర్టు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి నోటీసులు పంపింది. ఆ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు బదులు ఇవ్వాల్సిందేనని ఆదేశించింది. అయినా ప్రభుత్వం స్పందించలేదు. ఇదే ఆయన పదవికి ఎసరు పెట్టింది. ప్రతిపక్షాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఇమ్రాన్‌పై అనర్హతా వేటు వేయాలని కోరాయి. గల్ఫ్ దేశాలు గిఫ్ట్ ఇచ్చిన కాస్ట్‌లీ వాచ్‌లను అమ్మేసి పెద్ద మొత్తంలో సంపాదించారని ఆయనపై ఆరోపణలొచ్చాయి. దీనిపై ప్రభుత్వం ఎలాంటి బదులు ఇవ్వకపోవడం వల్ల పాక్ ఎన్నికల సంఘం ఇమ్రాన్‌పై అనర్హతా వేటు వేసింది. 2022లో ఉన్నట్టుండి ఆయన తన పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడిదే కేసులో ఆయనను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. 


Also Read: Arunachal: అరుణాచల్ ప్రదేశ్ భారత్‌దే, చైనా వాదనలో అర్థం లేదు - తీర్మానించిన అమెరికా