Christmas 2022: ప్రముఖ చిత్ర కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సుదర్శన్ పట్నాయక్ క్రిస్మస్ సందర్భంగా భారీ శాంటాక్లాజ్‌ను రూపొందించారు. ఒడిశాలోని గోపాల్‌పుర్ బీచ్‌లో టమాటాలు, ఇసుకతో ఈ శాంటాక్లాజ్‌ను తయారు చేశారు. దీని కోసం 1.5 టన్నుల టమాటాలను వినియోగించారు. 






ఈ సైకత శిల్పం 27 అడుగుల ఎత్తు, 60 అడుగుల వెడల్పుతో ఉంది. దీన్ని రూపొందించేందుకు పట్నాయక్‌కు అతని విద్యార్థులు సాయం చేశారు. పట్నాయక్ తన విద్యార్థులు కలిసి రూపొందించిన ఈ శాంటాక్లాజ్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. పట్నాయక్ చేసిన ఈ సైకత శిల్పానికి ప్రశంసలు దక్కుతున్నాయి. 


క్రిస్మస్ శుభాకాంక్షలు


ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు క్రిస్మస్ (Christmas) పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. 2023 సంవత్సరాన్ని ఆశతో, ప్రేమతో, చిరునవ్వుతో స్వాగతించేందుకు సిద్ధంగా ఉన్నారు. క్రిస్మస్ సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సహా నేతలంతా తమ శుభాకాంక్షలు తెలిపారు.




అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు! యేసు క్రీస్తు చూపించిన దయ, సౌభ్రాతృత్వ సందేశాన్ని ఈ రోజున అంతా స్మరించుకుందాం. మనలోని ఆనందాన్ని అందరికీ పంచుదాం. తోటి జీవుల పట్ల, పర్యావరణం పట్ల కరుణ, స్ఫూర్తిని కలిగి ఉందాం. "


-రాష్ట్రపతి ద్రౌపది ముర్ము


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ట్విట్టర్ వేదికగా తన శుభాకాంక్షలు తెలియజేసారు. యేసు క్రీస్తు గొప్ప ఆలోచనలను గుర్తుచేసుకున్నారు.


క్రిస్మస్ శుభాకాంక్షలు! ఈ ప్రత్యేక దినం మన సమాజంలో సామరస్యం, ఆనందాన్ని మరింతగా పెంపొందించాలి. ప్రభువైన క్రీస్తు ఉదాత్తమైన ఆలోచనలను, సమాజానికి సేవ చేయడంపై ఉన్న ప్రాధాన్యతను గుర్తు చేసుకుందాం. "


-ప్రధాని నరేంద్ర మోదీ


Also Read: Mann Ki Baat Highlights: 'ఫెస్టివల్ మూడ్‌ను ఎంజాయ్ చేయండి- కానీ కరోనాతో జర జాగ్రత్త'