వీపీఎన్ లను బ్యాన్ చేయాలని కేంద్రానికి హోంశాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సు చేసింది. ఈ సర్వీసుల వల్ల ఎంతోమంది నేరగాళ్లు వివిధ కార్యకలాపాలు సాగిస్తున్నారని పేర్కొంది. ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహకారంతో హోంశాఖ ఈ వీపీఎన్ లను గుర్తించి శాశ్వతంగా బ్లాక్ చేయాలని ఈ కమిటీ కోరింది. ఈ వీపీఎన్ లను శాశ్వతంగా బ్యాన్ చేసేందుక అంతర్జాతీయ ఏజెన్సీల సహకారం కూడా కావాలని వెల్లడించింది.


కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత దేశంలో ముఖ్యంగా ఐటీ పరిశ్రమ వర్క్ ఫ్రమ్ హోం విధానంలో పనిచేస్తోంది. ఇందుకోసం కంపెనీలు వీపీఎన్ లను పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నాయి. ఇందుకు ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది. ఇందుకోసం డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ విధించిన రూల్స్ ను కూడా కాస్త సడలించింది. అయితే ఇప్పుడు అవే వీపీఎన్ లను బ్యాన్ చేయాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసింది.


వీపీఎన్ అంటే?


వీపీఎన్ అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్​వర్క్. ఇది యూజర్లకు, ఇంటర్నెట్​కు మధ్య సురక్షితమైన కనెక్షన్ అందిస్తుంది. వీపీఎన్​ ద్వారా మనం సెకండరీ నెట్​వర్క్​కు కనెక్ట్ అవుతాం. బ్రాడ్​బ్యాండ్​లో మన ఇంటర్నెట్ యాక్టివిటీని వీపీఎన్ నెట్​వర్క్​ పూర్తిగా అడ్డుకుంటుంది. ఇతర సైట్లు, నెట్​వర్క్​లు మన బ్రౌజింగ్ యాక్టివిటీని చూడకుండా చేస్తుంది. రిమోట్ వర్కింగ్ కోసం వీపీఎన్​ను సంస్థలు ఉపయోగిస్తుంటాయి. పనికి సంబంధించిన సమాచారాన్ని, ఫైళ్లను ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసే వీలు దీని ద్వారా కలుగుతుంది.


ఎవరికీ దొరకదు..


వీపీఎన్ నెట్​వర్క్​ వినియోగించే వారికి ఎలాంటి భయం ఉండదు. ఎవరూ ట్రాక్ చేసే వీలే లేదు. ఇది ఫోన్​ను ప్రైవేట్ సర్వర్లకు కనెక్ట్ చేస్తుంది. తద్వారా యూజర్ల ఐపీ అడ్రెస్ ఇతర నెట్​వర్క్​లకు కనిపించదు. డివైజ్ నుంచి వెళ్లే సమాచారాన్ని ఎన్​క్రిప్ట్ చేస్తుంది. ఏ నెట్​వర్క్​, సైట్ వీటిని గుర్తించలేవు. సైబర్ సెక్యూరిటీ నుంచి కూడా దీని ద్వారా తప్పించుకోవచ్చని కమిటీ తన నివేదికలో పేర్కొంది. వీటి ద్వారా సైబర్ నేరగాళ్లు మరింతగా రెచ్చిపోయే అవకాశం ఉందని హెచ్చరించింది. దేశ భద్రతకు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం లేకపోలేదని పేర్కొంది.


గల్వాన్ ఘర్షణ అనంతరం జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం చైనాకు చెందిన పలు యాప్ లను ఇప్పటికే బ్యాన్ చేసింది. మరి ఈ వీపీఎన్ లపైన కూడా ఎదైనా యాక్షన్ తీసుకుంటుందేమో చూడాలి.


Also Read: Dengue Fever in UP: యూపీలో మిస్టరీ ఫీవర్.. 40 మందికి పైగా మృతి