Breaking News Live Telugu Updates: మర్రి శశిధర్ రెడ్డికి షాక్, కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్ వేటు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 19 Nov 2022 05:15 PM
మర్రి శశిధర్ రెడ్డికి షాక్, కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్ వేటు

మాజీ మంత్రి, కేంద్ర ప్రభుత్వ విపత్తు నివారణ సంస్థ మాజీ ఉపాధ్యక్షులు మర్రి శశిధర్ రెడ్డి ని కాంగ్రెస్ పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు బహిష్కరించారు. పార్టీ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నారని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.

గచ్చిబౌలిలో విషాదం, ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి! 

హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. గచ్చిబౌలి టెలికాం నగర్ కు చెందిన ముగ్గురు పిల్లలు మధ్యాహ్నం ఈతకని వెళ్లి నానక్ రాంగూడ పటేల్ కుంటలో మునిగిపోయారు. మృతి చెందిన చిన్నారుల వయసు దాదాపు 12 సంవత్సరాలలోపు ఉంటుందని పోలీసులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన చిన్నారులు షాభాజ్ (15) దీపక్ (12) పవన్ (13) గా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం 

విశాఖ గాజువాక స్టీల్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం జరిగింది.  స్టీల్ ప్లాంట్ ఆర్.ఎం.హెచ్.పి డిపార్ట్మెంట్లో స్వల్ప అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కన్వేయర్ బెల్ట్ లు ఒకదానినొకటి ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు.  

శబరిమలకు వెళ్తూ లోయలపడ్డ ఏపీ భక్తుల బస్సు

శబరిమలకు వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ యాత్రికుల బస్సు ప్రమాదానికి గురైంది వారు ప్రయాణిస్తున్న బస్సు పతనంతిట్ట సమీపంలో లోయలో పడిపోయింది. 18 మందికి తీవ్ర గాయాలు కాగా అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బస్సు కొండ ఎక్కుతుండగా అదుపుతప్పి కింద పడినట్లు అనుమానిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియవలసి ఉంది.

Background

ఎమ్మెల్యే కొనుగోల కేసులో సిట్‌ దూకుడు తెలంగాణలో రాజకీయంగా కాక రేపుతోంది. పలువురు ప్రజాప్రతినిధులు, బీజేపీ సానుభూతిపరులకు నోటీసులు ఇవ్వడం దుమారం రేగుతోంది. అలెర్ట్‌ అయిన బీజేపీ విషయాన్ని కోర్టులో తేల్చోవాలని చూస్తోంది. 


ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ దూకుడు పెంచింది. కేసులో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉందని అనుమానిస్తున్న వారిని పిలిచి విచారించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఈ కేసులో అరెస్టైన వారు ఇచ్చిన సమాచారం. వీడియోలో ప్రస్తావనకు వచ్చిన వారికి నోటీసులు జారీ చేసింది. 


ఇలా వీడియోలో ప్రస్తావన వచ్చిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిల్ సంతోష్, కేరళ ఎన్డీఏ కన్వీనర్ తుషార్, అమృత ఇన్స్ట్యూట్ మెడికల్ సైన్స్‌లో ఉద్యోగి జగ్గుస్వామి, బండి సంజయ్ అనుచరుడు న్యాయవాది శ్రీనివాస్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21 న సిట్ ముందు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. 



 


ప్రజాప్రతినిధులు, ఇతరులకు 41(A) CRPC కింద నోటీసులు జారీ చేసింది సిట్. ఈ నెల 21 న కమాండ్ కంట్రోల్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన సిట్ కార్యాలయానికి వచ్చి విచారణకు హాజరుకావాలని సూచించింది. సిట్ విచారణకు హాజరు కాకుంటే అరెస్ట్ చేస్తామని నోటీసులో పేర్కొంది సిట్.


వరుసగా బీజేపీ కీలక నేతలు, సానుభూతిపరులకు రావడంతో బీజేపపీ అలెర్ట్ అయింది. దీనిపై హైకోర్టులో మధ్యంతర పిటిషన్ వేసింది. బీజేపీ లీడర్ గుజ్జెల ప్రేమేందర్‌రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. సిట్‌ నోటీసులపై స్టే ఇవ్వాలని అందులో అభ్యర్థించారు. 


గత నెల 26న మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో నలుగురు ఎమ్మెల్యేలతో సమావేశమైన నిందితుడు రామచంద్రభారతి పలువురు ముఖ్యనేతల పేర్లను ఉటంకించారు. నంబర్‌ 1, నంబర్‌ 2 అంటూ సంబోధించడంతోపాటు బీజేపీ అగ్రనేతలు బీఎల్‌ సంతోష్‌, సునీల్‌కుమార్‌ బన్సల్‌, కేరళ నేత తుషార్‌ పేర్లను పేర్కొన్నాడు. తుషార్‌కు ఇప్పటికే నోటీసు జారీ చేసిన సిట్‌.. బీఎల్‌ సంతోష్‌కూ నోటీసు పంపింది. విచారణకు వచ్చేటప్పుడు 9449831415 నంబరు సిమ్‌తోపాటు ఐఎంఈఐ నంబరు 353846108969790తో కూడిన సెల్‌ఫోన్‌ను వెంట తీసుకురావాలని సూచించింది. బన్సల్‌కు నోటీసు ఇచ్చారా? లేదా? అనే అంశంపై స్పష్టత రాలేదు.


పరారీలో జగ్గుస్వామి


ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఇప్పటికే కేరళకు చెందిన వైద్యుడు జగ్గుస్వామికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 21న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కొచ్చిలోని ఓ ఆశ్రమానికి చెందిన వైద్యకళాశాలలో పనిచేస్తున్న జగ్గు ఇంటికి సిట్ అధికారులు గత శనివారం వెళ్లారు. అయితే అప్పటికే జగ్గుస్వామి పోలీసులు వస్తున్న విషయాన్ని తెలుసుకొని పరారయ్యారు. జగ్గుస్వామి ఇంటితోపాటు కార్యాలయంలో సోదాలు చేసిన సిట్ అధికారులు పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కొచ్చి పోలీసుల సాయంతో జగ్గుస్వామి కోసం వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో ఆయన ఇంటికి సిట్ అధికారులు నోటీసులు అంటించారు. బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఉన్న సిట్ కార్యాలయంలో 21వ తేదీన హాజరుకావాలని పేర్కొన్నారు.


 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.