CM Jagan Inaugurates Kidney Research Center in Uddanam: తన పాదయాత్రలో ఉద్దానం ప్రజల బాధను చూశానని, అప్పుడు తాను ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు హామీలు నెరవేర్చానని సీఎం జగన్ (CM Jagan) తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో (Palasa) గురువారం రూ.85 కోట్లతో నిర్మించిన డా.వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ (YSR Kidney Research Center), సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని (Super Speciality Hospital) ఆయన ప్రారంభించారు. ఇక్కడ 42 మంది సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు, 60 మంది స్టాఫ్ నర్సులు, 60 మంది సహాయక సిబ్బంది, 200 పడకల సామర్థ్యంతో డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేశారు. ఈ ఆస్పత్రిలో కిడ్నీ వ్యాధిగ్రస్థులకు అత్యాధునిక పరికరాలతో ప్రత్యేక వైద్య సేవలు అందనున్నాయి. అలాగే, ఉద్దానంలో రూ.700  కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టును (YSR Sujala Dhara Project) ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ పథకం ద్వారా దాదాపు 7 మండలాల్లోని 807 గ్రామాలకు సురక్షిత మంచి నీటి సరఫరా జరగనుంది. '2024, ఫిబ్రవరిలో ఇక్కడే ఈ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ లోనే కిడ్నీ మార్పిడి చికిత్సను మొదలుపెడతాం. దేశంలోనే పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్ వైద్య రంగానికి ఆదర్శంగా నిలుస్తుంది.' అని సీఎం జగన్ తెలిపారు. కిడ్నీ వ్యాధి గ్రస్థులకు ఉచితంగా మందులందిస్తున్నామని, విలేజ్ క్లినిక్, ఆరోగ్య సురక్ష ద్వారా పేదలకు అండగా ఉన్నట్లు చెప్పారు. 










అత్యున్నత వైద్యమే లక్ష్యం


రాష్ట్రంలో ప్రజలందరికీ అత్యున్నత వైద్యం అందించడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. 'ఉద్దానం అంటే ఉద్యానవనం అని అర్థం. పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలాసలో రూ.85 కోట్లతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మించాం. సురక్షిత మంచి నీటి కోసం రూ.700 కోట్లతో సుజలధార ప్రాజెక్టు అందుబాటులోకి తెచ్చాం. కిడ్నీ వ్యాధిగ్రస్థులకు కిడ్నీ రీసెర్చ్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ద్వారా అత్యున్నత ప్రమాణాలతో వైద్య సేవలు అందిస్తున్నాం. కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేసే వ్యవస్థను కూడా అందుబాటులోకి తెస్తాం.' అని సీఎం పేర్కొన్నారు. కిడ్నీ వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించేలా జిల్లాలోని 7 మండలాల్లో స్క్రీనింగ్ పరీక్షలు చేయిస్తున్నామని తెలిపారు. పేదవాడిని ఎలా ఆదుకోవాలి, ఎలా తోడుగా ఉండాలి, పేదరికం నుంచి ఎలా బయటపడెయ్యాలి, వారి బతుకులు మార్చాలనే తాపత్రయం మీ బిడ్డకు మాత్రమే ఉందని, ఈ తేడాని ప్రజలు గమనించాలని సూచించారు. 


అంతకు ముందు కిడ్నీ రీసెర్చ్ సెంటర్, ఆస్పత్రిని సీఎం జగన్ పరిశీలించారు. అనంతరం ఉద్దానం తాగునీటి ప్రాజెక్టు పనితీరును వంశధార ఇంజినీరింగ్, గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం అధికారులు, టెక్కలి సబ్ కలెక్టర్ ఆయనకు వివరించారు. హిరమండలం వంశధార ప్రాజెక్టు నుంచి తాగునీరు గ్రామాలకు వెళ్తున్న విధానం, ఇంటింటికీ నీరు ఎలా అందుతుందో సీఎం పరిశీలించారు.






Also Read: Vizag Hospital Fire Accident: వైజాగ్‌ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం- పరుగులు తీసిన రోగులు