Air India Case:


వాట్సాప్ స్టేటస్ అర్థమేంటి...?


ఎయిర్‌ ఇండియా ఫ్లైట్‌లో ఓ మహిళపై యూరినేట్ చేసిన నిందితుడు శంకర్ మిశ్రాపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు ఢిల్లీ పోలీసులు. గతేడాది నవంబర్ 26న న్యూయార్క్ నుంచి ముంబయికి వస్తున్న ఫ్లైట్‌లో ఈ ఘటన జరిగింది. ఇప్పటికే బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ కొనసాగిస్తున్నారు. విమానంలోని నలుగురు సిబ్బందిని విచారించిన పోలీసులు..మరికొందరి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. నిందితుడిపై FIR నమోదు చేశారు. ఢిల్లీ పోలీసులు ఈ కేసు విచారణ కోసం ముంబయికి వెళ్లారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం...ముంబయిలోని కుర్లా ప్రాంతంలో నివసిస్తున్నట్టు తెలుసుకున్నారు. అక్కడికి చేరుకున్న పోలీసులు విచారణ 
కొనసాగిస్తున్నారు. అయితే...ఈ మధ్యే శంకర్ మిశ్రా పెట్టుకున్న వాట్సాప్ స్టేటస్ కూడా కీలక ఆధారంగా మారింది. "తప్పులను బట్టి మనల్ని డిఫైన్ చేయలేరు. అవి మనల్ని మనం మెరుగుపరుచుకోడానికి పనికొస్తాయి" అనే అర్థం వచ్చేలా స్టేటస్ పెట్టుకున్నాడని విచారణలో తేలింది. బాధితురాలు మాత్రం వీలైనంత త్వరగా నిందితుడుని పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆమె టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్‌కు ఫిర్యాదు కూడా చేశారు. 


మూడేళ్ల జైలుశిక్ష..? 


డిసెంబర్ 28న ఎయిర్ ఇండియా సంస్థ తమకు ఈ విషయం చెప్పిందని, ఆ తరవాత బాధితురాలని సంప్రదించి మరిన్ని వివరాలు సేకరించామని పోలీసులు తెలిపారు. ప్రాథమిక విచారణలో నిందితుడి పేరు శంకర్ శేఖర్ మిశ్రా అని తేలింది. ముంబయికి చెందిన ఈ బిజినెస్‌మేన్‌ ఎక్కడ ఉంటాడోనని పోలీసులు ఆరా తీస్తున్నారు. "బాధితురాలి ఫిర్యాదు మేరకు పబ్లిక్‌ ప్లేస్‌లో అనుచితంగా 
ప్రవర్తించి నందుకు ఐపీసీ సెక్షన్ 510, మహిళా గౌరవాన్ని భంగ పరిచినందుకు సెక్షన్ 509, అవమాన పరిచినందుకు సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశారు. అయితే...ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో ఉన్న సిబ్బందినీ విచారిస్తున్నారు. వాళ్లు చెప్పిన వివరాల ప్రకారం 50 ఏళ్ల శేఖర్ మిశ్రా...బిజినెస్‌క్లాస్‌లో ప్రయాణిస్తున్నాడు. మద్యం మత్తులో ఉన్నాడు. టాయ్‌లెట్‌ కోసం అని లేచి ముందుకు వెళ్లాడు. అయితే...వాష్‌రూమ్ వరకూ వెళ్లాననుకుని ఆ మత్తులోనే ఓ మహిళపై యూరినేట్ చేశాడు. ఇది జరిగిన వెంటనే సిబ్బందికి ఫిర్యాదు చేశానని, కానీ వాళ్లు స్పందించలేదని ఆరోపిస్తున్నారు బాధితురాలు. "లంచ్ టైమ్ తరవాత ఫ్లైట్‌లో లైట్స్ ఆఫ్ చేశారు. అప్పుడే ఓ ప్యాసింజర్ నా సీట్‌ దగ్గరకు వచ్చాడు. నాపై యూరినేట్ చేయడం మొదలు పెట్టాడు" అని టాటా గ్రూప్ ఛైర్మన్‌కు రాసిన లేఖలో తెలిపారు బాధితురాలు. 
ప్రస్తుతం నిందితుడిపై నమోదు చేసిన కేసుల పరంగా చూస్తే...దోషిగా తేలితే కనీసం మూడేళ్ల జైలు శిక్ష పడుతుందని పోలీసులు స్పష్టం చేశారు. ఎయిర్‌ ఇండియా అధికారులు చెప్పిన వివరాల ప్రకారం..ఈ కేసు విచారణకు అంతర్గత కమిటీని ప్రత్యేకంగా నియమించారు. ఈ మధ్య కాలంలో విమానాల్లో ఇలాంటి ఘటనలు పెరిగి పోతున్నాయి. 


Also Read: Delhi Mayor Election: ఆప్‌ బీజేపీ నేతల మధ్య ఘర్షణ,ఢిల్లీ మేయర్ ఎన్నిక ప్రక్రియకు బ్రేక్