Ugadi 2024 Food Recipes : ఉగాది వంటలు, పండుగ వంటలు అంటే మనగు గుర్తొచ్చే రెసిపీలలో ఉగాది పచ్చడి కాకుండా.. బూరెలు, గారెలు కచ్చితంగా ఉంటాయి. అయితే వీటిని చేసుకోవడం కష్టమనుకుంటారు కానీ.. కొన్ని టిప్స్ ఫాలో అయితే ఒకేసారి రెండు టీస్టీ రెసిపీలు చేసుకోవచ్చు. పైగా రెండూ కరకరలాడేలా.. టేస్టీగా రావడానికి కూడా కొన్ని టిప్స్ ఉన్నాయి. ఇంతకీ ఆ టిప్స్ ఏంటో.. కావాల్సిన పదార్థాలేమిటో.. ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం. 


కావాల్సిన పదార్థాలు


మినపప్పు - 2 కప్పులు


బియ్యం పిండి - 1 కప్పు


శనగపప్పు - 1 కప్పు


బెల్లం - 1 కప్పు


యాలకుల పొడి - 1 టీస్పూన్


గారెల కోసం..


అల్లం - అంగుళం


పచ్చిమిర్చి -2 


కరివేపాకు - 1 రెబ్బ


ఇంగువ - చిటికెడు


సాల్ట్ - రుచికి తగినంత


నూనె - డీప్​ ఫ్రైకి సరిపడేంత


తయారీ విధానం..


పండుగల సమయంలో ముందురోజు రాత్రి మినపప్పు నానబెట్టుకుంటే మంచిది. ఉదయాన్నే దానిని పిండి చేసుకుని.. వంటలు చేసుకునేందుకు వీలుగా ఉంటుంది. లేదంటే నాలుగు గంటలు ముందే మినపప్పును నానబెట్టుకోవచ్చు. ఈ మినప్పపును పిండి చేసుకుని వంటను ప్రారంభించవచ్చు. అయితే ఇదే పప్పును మనం బూరెలు, గారెల కోసం ఉపయోగించుకోవచ్చు. ఇక్కడో సింపుల్ టిప్​ ఫాలో అయితే వడలు, గారెలు గుళ్లగా వస్తాయి. పిండిని మిక్సీ చేసేప్పుడు దానిలో ఓ మూడు ఐస్​ క్యూబ్స్ వేస్తే వడలు మంచిగా వస్తాయి. దీనిలో అవసరం మేరకు ఐస్ వాటర్ పోసి.. మెత్తగా, పిండి గట్టిగా ఉండేలా రుబ్బుకోవాలి. ఈ పిండిని రెండు భాగాలుగా చేసి బూరెలు, గారెల కోసం ఉపయోగించుకోవచ్చు. 


బూరెలు చేసేందుకు..


మినపప్పును రుబ్బే ముందు మీరు శనగపప్పును నానబెట్టుకోవాలి. కనీసం రెండు గంటలు నానితే మంచిది. బియ్యం పిండిలో నీటని వేసి.. కనీసం అరగంట అయినా నానబెట్టుకోవాలి. శనగపప్పు నానిన తర్వాత దానిని కుక్కర్​లోకి తీసుకుని రెండు కప్పుల నీటిని వేసి.. బాగా ఉడకనివ్వాలి. శనగపప్పును మీడియం మంట మీద ఉడికించుకోవాలి. అది ఉడికేలోపు బెల్లం పాకం సిద్ధం చేసుకోవాలి. స్టౌవ్ వెలిగించి దానిపై కడాయిపెట్టి దానిలో బెల్లం వేయాలి. దానిలో పావు కప్పు నీరు వేసి బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం కరిగి పొంగు వచ్చిన తర్వాత స్టౌవ్ ఆపేసి దానిని వడకట్టుకోవాలి ఇలా చేయడం వల్ల దానిలోని మలినాలు పోతాయి. 


శనగపప్పు మెత్తగా ఉడికిన తర్వాత దానిలో మిగిలిన నీటిని తీసేయాలి. శనగపప్పును ఓ గిన్నెలోకి తీసుకుని మెత్తగా పప్పు గుత్తితో ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి కడాయి పెట్టి.. దానిలో మెత్తగా చేసుకున్న పప్పు, ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న బెల్లం పాకం వేయాలి. బెల్లం, పప్పు బాగా కలిసేవరకు ఎక్కువ మంట మీద ఉడికించుకోవాలి. ఇలా ఉడికించే కొద్ది నీరు పోయి మిశ్రమం గట్టిగా అవుతుంది. ఇలా గట్టిగా అయ్యాక.. టీస్పూన్ యాలకుల పొడి వేసి కలిపి స్టౌవ్ ఆపేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత నిమ్మకాయంత సైజులో ఉండలుగా చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి. 


ఇప్పుడు మినపపిండిలో నానబెట్టిన బియ్యం పిండిని కలిపాలి. అవసరమైతే కాస్త నీరు కలుపుకోవచ్చు. పిండి దోస పిండె కంటే కాస్త థిక్​గా ఉండాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి కడాయి పెట్టి.. దానిలో డీప్​ ఫ్రైకి సరిపడా నూనె వేయాలి. అవి వేడి అయ్యాక పూర్ణం ఉండలను మినప పిండిలో ముంచి .. వాటిని నూనెలో వేసి వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ రకంగా బూరెలు చేస్తే గంటలపాటు క్రిస్పీగా, ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. 


గారెల కోసం..


గారెలు కోసం తీసుకున్న పిండిలో ఓ స్పూన్ అల్లం తురుము, కరివేపాకు తురుము, చిటికెడు ఇంగువ, పచ్చిమిర్చి తరుగు, రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి.. బూరెలు చేసుకోగ మిగిలిన నూనెను పెట్టండి. అది వేడయ్యాక.. చేతులను బాగా కడిగి.. కాస్త తడిగా ఉంచి.. గారెలను ఒత్తుకుని నూనెలో వేసి వేయించుకోవాలి. ఇలా చేసుకున్న గారెలు క్రిస్పీగా, టేస్టీగా వస్తాయి. ఈ పండుగకి మీరు వీటిని చేయాలనుకుంటే ఈ రెసిపీలను ఫాలో అయిపోండి. ఇవి మీకు మంచి టేస్ట్​ని అందిస్తాయి. పండుగ వాతావరణం తీసుకువస్తాయి. 


Also Read : ఉగాది పచ్చడిని ట్రెడీషనల్​గా ఇలాగే చేయాలి.. మామిడి కాయలను అస్సలు వేయకూడదట