Youth Dies After Sliding: సరదాగా వాటర్ గేమ్స్ ఆడాలని వెళ్లిన ఓ పాతికేళ్ల ఉన్నట్టుండి ప్రాణాలు కోల్పోయిన ఘటన నోయిడాలో జరిగింది. ధన్‌జయ్ మహేశ్వరి తన నలుగురు ఫ్రెండ్స్‌తో కలిసి నోయిడాలోని గ్రేట్ ఇండియా ప్లేస్ (GIP) మాల్‌కి వెళ్లాడు. ఆదివారం ఆటవిడుపు కోసం కాసేపు లోపలే గడిపారు. అందులోనే Entertainment City వాటర్‌ పార్క్‌లోనూ కాసేపు సేద తీరారు. వాటర్ స్లైడ్‌ చేయాలని ఒకరి తరవాత ఒకరు స్విమ్ కాస్ట్యూమ్స్ వేసుకుని వచ్చారు. అందరూ స్లైడింగ్ చేశారు. అయితే...ఇది చేసిన కాసేపటికే ధన్‌జయ్‌కి ఊపిరి తీసుకోవడంలో సమస్య ఎదురైంది. వెంటనే ఓ చోట కూర్చున్నాడు. కాసేపైతే అదే సర్దుకుంటుందిలే అనుకున్నా అంతకంతకీ సమస్య తీవ్రమైంది. వెంటనే సిబ్బంది అప్రమత్తమై ఆంబులెన్స్‌ని పిలిపించింది. హాస్పిటల్‌కి తీసుకెళ్లేలోపే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు నోయిడాకి వచ్చారు. ఢిల్లీలోని ఆదర్శ్‌నగర్‌లో ఉంటున్న ధన్‌జయ్‌ ఆటవిడుపు కోసం ఇక్కడికి వచ్చి ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతానికి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపించారు. అటాప్సీ రిపోర్ట్ వస్తే కానీ మృతికి కారణమేంటే చెప్పలేమని పోలీసులు వెల్లడించారు.