రోజూ నిద్రలేచిన వెంటనే దేవుడి పటమో, లేదో అరచేతినో.. నచ్చినవారి ముఖాన్ని చూసేవాళ్లం. కానీ, ఇప్పుడు రోజులు మారాయి. నిద్రలేస్తూ.. చేతులు ఆటోమెటిక్‌గా మొబైల్‌ను వెతికేస్తు్న్నాయి. వెంటనే వేళ్లు సోషల్ మీడియా అప్‌డేట్స్‌పై తైతకలాడుతున్నాయి. ఇది కాస్తా.. అలవాటుగా మారి, మాయదారి రోగంగా మార్పు చెందుతోంది. కొత్త కొత్త రోగాలను తెచ్చిపెడుతోంది. అయితే, తాజా అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. అవేంటో చూసేయండి మరి. 


నిద్రలేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఎక్కువ మంది సోషల్ మీడియాతోనే గడిపేస్తుంటారు. పనిలో ఒక్క నిమిషం సందు దొరికినా చాలు వెంటనే ఫోన్ తీసుకుని ఇన్ స్టా, యూట్యూబ్ రీల్స్ అంటూ వీడియోలు చూస్తూ టైమ్ పాస్ చేసేస్తుంటారు. ఇంకొంతమంది అయితే సోషల్ మీడియా లేకపోతే వారి జీవితమే లేదన్నట్టు ఫీల్ అయిపోతారు. నిద్ర మొహంతో ఒక సెల్ఫీ, మేకప్ తో మరొక సెల్ఫీ అంటూ తమ భావాలను ఇతరులతో పంచుకుంటారు. దీని వల్ల వచ్చే లాభాలు గోరంత అయితే వచ్చే నష్టాలు మాత్రం కొండంత.


శరీరంలోని సగం రోగాలు సోషల్ మీడియా అతి వినియోగం వల్ల వచ్చాయని అంటే చాలా మంది ఆశ్చర్యపోతారు. కానీ ఇది వాస్తవం. అందుకే సోషల్ మీడియా వినియోగాన్ని రోజుకి ఒక 15 నిమిషాల పాటు తగ్గించడం వల్ల ఆరోగ్యం బాగుండటమే కాదు రోగనిరోధక పనితీరు గణనీయంగా మెరుగుపడుతుందని కొత్త అధ్యయనం చెబుతోంది. అంతే కాదు డిప్రెషన్, ఒంటరితనం భావన కూడా తగ్గిపోతుందని కొత్త పరిశోధన సూచిస్తుంది.


అధ్యయనం ఇలా సాగింది..


సోషల్ మీడియా కాసేపు పక్కన పెట్టడం వల్ల వారి మానసిక, శారీరక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం కనిపించదనేది దాని మీద జరిపిన పరిశోధన వివరాలను జర్నల్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ బిహేవిరల్ సైన్స్ లో ప్రచురించారు. యూకేలోని స్వాన్సీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు దాదాపు 50 మంది మీద పరిశోధన జరిపారు. ఈ అధ్యయనంలో 20-25 సంవత్సరాల వయస్సు కలిగిన 50 మందిని పరిశీలించారు. వారిలో 33 మంది స్త్రీలు, 17 మంది పురుషులు పాల్గొన్నారు. రోజుకి 15 నిమిషాల పాటు సోషల్ మీడియా చూడకుండా వేరే ఏదైనా పని చేయమని చెప్పారు. మూడు నెలల పాటు ఇలా చేశారు.


ఫలితాలు సూపర్..


సోషల్ మీడియా పక్కన పెట్టేయడం వల్ల వారి రోగనిరోధక శక్తి పనితీరులో 15 శాతం మెరుగుదల గుర్తించారు. వాటిలో జలుబు, ఫ్లూ, మొటిమలు వంటి సమస్యలు తగ్గుముఖం పట్టడం గుర్తించారు. ఇక 50 శాతం నిద్ర నాణ్యత మెరుగుపడింది. 30 శాతం డిప్రెషన్ లక్షణాలు కూడా తగ్గిపోయాయని పరిశోధకులు గుర్తించారు. ప్రజలు సోషల్ మీడియా వినియోగాన్ని తగ్గించుకున్నప్పుడు వారి శారీరక ఆరోగ్యం, మానసిక శ్రేయస్సు తో పాటు జీవితానికి కూడా అనేక విధాలుగా ప్రయోజనాలు చేకూరుస్తుందని ఈ డేటా నిరూపిస్తుందని సైకాలజీ నిపుణులు చెబుతున్నారు.


సోషల్ మీడియా వినియోగానికి ఆరోగ్యానికి మధ్య సంబంధం ప్రత్యక్షంగా ఉందా లేదా అనేదాని మీద మరికొన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు వెల్లడించారు. సోషల్ మీడియాకి బానిసైన వ్యక్తులు ఆందోళన, నిరాశ, శారీరక రుగ్మతలతో బాధపడుతున్నారు.  అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ ప్రచురించిన మరొక అధ్యయనం ప్రకారం కేవలం కొన్ని వారాల పాటు సోషల్ మీడియాకి దూరంగా ఉండటం వల్ల బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యం పరిస్థితి కూడా మెరుగుపడిందని తేలింది. మరి మీరు ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటే జస్ట్ 15 నిమిషాల పాటు సోషల్ మీడియాకి దూరంగా ఉండి చూడండి.


 గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: కాళ్ళు, పాదాల్లో వాపు ఎక్కువగా ఉందా? వెంటనే డాక్టర్‌ను కలవండి, ఎందుకంటే..