దక్షిణాదిలో సింగర్‌గా, నటిగా మంచి క్రేజ్ సంపాదించిన నటి మమతా మోహన్ దాస్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘యమదొంగ’ సినిమాతో అందరినీ ఆకట్టుకున్న టాలీవుడ్‌లో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అయితే ఈ మధ్య ఎక్కువగా సినిమాల్లో కనిపించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్ గానే ఉంటుంది. తాజాగా మమతా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. ఈ సందర్భంగా లేడీ సూపర్ స్టార్ నటి నయనతారపై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె మాటల వలన తాను చాలా బాధపడ్డానని చెప్పింది. ప్రస్తుతం మమతా చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 


ఇటీవల నటి మమతా మోహన్ దాస్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. ఈ సందర్బంగా తన సినిమా కెరీర్ కు సంబంధించిన విషయాలను వెల్లడించింది. తాను సినిమాలు చేస్తున్నపుడు జరిగిన ఓ సందర్భాన్ని గుర్తు తెచ్చుకుని ఆవేదన వ్యక్తం చేసింది. ఓ పెద్ద సినిమా ప్రాజెక్టు లో తనకు అవకాశం వచ్చిందని, ఓ పాట కోసం తనను మేకర్స్ సంప్రదించారని చెప్పింది. నాలుగు రోజుల పాటు ఆ పాట షూటింగ్ జరిగిందని తెలిపింది. ఆ పాట షూట్ చేస్తున్నప్పుడే తనకు డౌట్ వచ్చిందని, తీరా ఫైనల్ అవుట్ పుట్ వచ్చిన తర్వాత చూస్తే అసలు తను ఫ్రేమ్ లోనే కనిపించలేదని పేర్కొంది. వాళ్లు తనకు చెప్పిన విధంగా పాటను చిత్రీకరించలేదని తెలిపింది. కేవలం ఓకే ఒక్క షాట్ లో మాత్రమే తాను ఎక్కడో వెనక కనిపించానని చెప్పింది. 


అయితే తర్వాత ఆ విషయాన్ని తాను వదిలేశానని, కానీ కొన్నాళ్ల తర్వాత అసలు విషయం తెలిసి బాధపడ్డానని తెలిపింది. వాస్తవానికి ఆ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉందని, ఆ పాటలో వేరే హీరోయిన్ ఉన్నట్లయితే.. తాను షూటింగ్‌కు రానని ఆమె చెప్పడం వల్లే తనపై ఆ షాట్స్ తీశారని మమతా పేర్కొంది. ఈ విషయం తనకు అప్పుడు తెలియదని, కొన్ని రోజుల తర్వాత కొందరు తనతో చెప్పారని చెప్పింది. అందుకే ఆ పాటలో తనకు ప్రాధాన్యమివ్వలేదని తెలిపింది. ఆ హీరోయిన్ అలా అనడం తనకు బాధకలిగిందని, ఆ పాట వలన తనకు నాలుగు రోజులు వృథా అయ్యాయని తెలిపింది. ఇక రజనీకాంత్, నయనతార కలిసి చేసిన సినిమాలలో ‘కథానాయకుడు’ ఒకటి. ఈ సినిమాలో మమతా మోహన్ దాస్ అతిథి పాత్రలో కనిపించింది. అయితే ఈ సినిమా షూటింగ్ అప్పటి విషయాలనే మమతా గుర్తుచేసుకుందని, ఆమె నయనతార గురించే చెప్పి ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్.


మమతా మోహన్ దాస్ ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో ఉంటోంది. సినిమాల్లో తక్కువగా కనిపించినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్ గా ఉంటుంది. గతంలో తనకు క్యాన్సర్ వ్యాధి సోకిందని వచ్చిన కామెంట్లపై ఘాటుగా సమాధానం ఇచ్చింది. అలాగే సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలకు తనదైన శైలిలో ట్రోలర్స్ కు రిప్లై ఇస్తోంది మమతా. గతేడాది ‘జన గణ మన’ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తోంది. 


Also Read : నరేష్, పవిత్ర లోకేష్ పెళ్లి నిజమా? ఫేకా? - వీడియోలో ఇవి గమనించారా?