UP Shopkeeper Marketing Strategy: ప్రస్తుతం ప్రపంచం అంతా మార్కెటింగ్ మేనియా నడుస్తుంది. వ్యాపారులు తమ ఉత్పత్తులు, సేవలను వినియోగదారుల దగ్గరికి తీసుకెళ్లేందుకు వివిధ రకాల మార్కెటింగ్ వ్యూహాలను అవలంబిస్తారు. స్మార్ట్‌ఫోన్‌ను ఒక వినియోగదారుడికి విక్రయించాలనుకుంటే, వారు దానితో పాటు కొన్ని బహుమతులను కూడా అందిస్తారు. దీని వల్ల వినియోగదారుడికి మొబైల్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనే కోరిక పెరుగుతుంది.


అయితే ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ దుకాణదారుడు స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలుపై ఇలాంటి ఆఫరే ఒకటి ఇచ్చాడు. ఒక స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రెండు బీర్ క్యాన్లను ఉచితంగా ఇస్తామని ఆఫర్ ప్రకటించాడు. ఈ విషయం తెలియగానే ప్రజలు దుకాణం బయట బారులు తీరారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.


పీటీఐ కథనం ప్రకారం ఉత్తరప్రదేశ్‌లోని భదోహి జిల్లాలో ఒక దుకాణదారుడు ఈ ఆఫర్‌కు సంబంధించిన పోస్టర్‌లు, కరపత్రాలను వేర్వేరు ప్రదేశాలలో ఉంచాడు. ఈ ఆఫర్ మార్చి 3వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు అందుబాటులో ఉంది. దీనికి 'హోలీ బంపర్ ధమాకా' అని పేరు పెట్టారు.


ఈ ఆఫర్ గురించి విన్న జనాలు షాప్ దగ్గర గుమిగూడి బీరు తాగుతూ ఫోన్లు కొనడం మొదలుపెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు వెంటనే దుకాణానికి చేరుకుని గుంపును చెదరగొట్టి షాపు యజమాని రాజేష్ మౌర్యను ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 151 కింద అరెస్టు చేసి దుకాణాన్ని సీజ్ చేశారు.


ఈ ఆఫర్‌తో స్థానిక వాతావరణం చెడిపోతోందని, అలాగే ఈ మార్కెటింగ్ పద్ధతి సరికాదని పోలీసు అధికారులు తెలిపారు. అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రవర్తనా నియమావళి ప్రకారం ఏదైనా ఉత్పత్తి లేదా సేవ ప్రచారం కోసం ఆల్కహాల్ ఉపయోగించడం సరైనది కాదు. లైసెన్స్ పొందిన వారు మాత్రమే మద్యాన్ని ప్రమోషన్‌గా ఉపయోగించగలరు. బహిరంగంగా మద్యం సేవించడం కూడా చట్టవిరుద్ధమే.


ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ టెక్నో తన మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్‌ను మనదేశ మార్కెట్లో ఇటీవలే లాంచ్ చేసింది. అదే టెక్నో ఫాంటం వీ ఫోల్డ్. బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023 ఈవెంట్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.  ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్లస్ ప్రాసెసర్‌ను అందించారు. అంటుటు టెస్టింగ్ ప్లాట్‌ఫాంలో 10.8 లక్షల స్కోరును సాధించింది. ఈ ఫోన్ త్వరలో మనదేశంలో కూడా లాంచ్ కానుందని తెలుస్తోంది.


ఈ ఫోన్ ధర ఇప్పటికే ఆన్‌లైన్‌లో లీక్ అయింది. ఇందులో బేస్ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.89,999 కాగా, 12 జీబీ ర్యామ్ + 512 జీబీ వేరియంట్ ధర రూ.99,999గా ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద ఈ ఫోన్‌ను రూ.79,999కే అందించే అవకాశం ఉంది. బ్లాక్, వైట్ కలర్ వేరియంట్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం మనదేశంలో అత్యంత చవకైన ఫోల్డబుల్ ఇదే కావచ్చు. ఎందుకంటే శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ల ధర రూ.లక్ష వరకు ఉంది.