Liquor Price Himachal Pradesh: 


లిక్కర్‌పై సెస్ పెంపు..


మందు బాబులకు ఇదో చేదు వార్త. లిక్కర్, బీర్ ధరలు మరింత ప్రియం కానున్నాయి. సెస్‌ కింద ఒక్కో బాటిల్‌పై అదనంగా రూ.17 కట్టాల్సి ఉంటుంది. అంతకు ముందు ఈ పన్ను కేవలం రూ.7గా ఉండేది. ఇప్పుడు ఏకంగా పది రూపాయలు పెంచి షాక్ ఇచ్చింది ప్రభుత్వం. ఇంతకీ ఇదెక్కడో చెప్పలేదు కదూ. హిమాచల్‌ ప్రదేశ్‌లో. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచే ఈ ధరలు అమల్లోకి రానున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మద్యంపై సెస్‌ను పెంచుతున్నట్టు సీఎం సుఖ్వీందర్ సింగ్ సుకు వెల్లడించారు. వీటితో పాటు మిల్క్ సెస్‌ను కూడా పెంచారు. ఒక్కో పెట్ బాటిల్‌పై రూ.10 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాదు. Godhan Development Fund కింద మరో రూ.2.50 కట్టాలి. ఇటీవలే హిమాచల్ ప్రదేశ్‌లో కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలోనే సెస్‌ను పెంచాలన్న చర్చ వచ్చింది. అయితే అంతకు ముందు ఉన్న కొవిడ్ సెస్‌ను తొలగించి ఆ స్థానంలో కొత్త సెస్‌లను తీసుకురావాలని నిర్ణయించారు. అందులో భాగంగానే మద్యం, పాలపై పన్ను భారం మోపారు. ఈ సెస్‌లో ప్రతి బాటిల్‌పై రూ.1.50 మేర ఎక్సైజ్ డెవలప్‌మెంట్ ఫండ్‌కు వెళ్తుంది. రూ.2 మేర సెస్‌ను పంచాయతీ రాజ్‌ నిధులకు తరలిస్తారు. పంచాయతీలను అభివృద్ధి చేసేందుకు ఈ నిధులు ఖర్చు చేస్తారు. వీటితో పాటు హెల్త్ సర్వీసెస్‌ విభాగానికీ రూ.1 మేర సెస్‌ కేటాయిస్తారు. ఆంబులెన్స్ సేవల్ని మెరుగు పరిచేందుకు ఈ నిధులను ఖర్చు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 


హిమాచల్‌ప్రదేశ్‌లో ఏటా రూ.1,829 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతాయి. ఏటా తలసరి వినియోగం 9  బాటిళ్లుగా ఉన్నట్టు ప్రభుత్వమే అధికారికంగా వెల్లడించింది. నెలకు 75 లక్షల బాటిళ్లు అమ్ముడవుతున్నాయి. రోజుకు 2.5 లక్షల బాటిళ్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఈ మద్యం విక్రయాల ద్వారా ఏటా కనీసం రూ.2,400 కోట్లు ఆర్జించాలని టార్గెట్‌గా పెట్టుకుంది హిమాచల్ ప్రభుత్వం.