WHO on Mpox: ప్రపంచాన్ని వణికిస్తున్న మరో మహమ్మారి మంకీ పాక్స్ (Mpox). ప్రస్తుతం ఇది మన దేశంలో ఉనికిలో లేకున్నా, ముప్పు మాత్రం పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరిస్తోంది. ఇందుకు తగిన జాగ్రత్తలు అవసరమని స్పష్టం చేస్తోంది. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందని కూడా సూచించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ఈ వైరస్ దేశంలోకి ప్రవేశించకుండా చర్యలు చేపట్టాయి. అయితే, అందరిలో ఒకటే సందేహం... ఎంపాక్స్ మరో కోవిడ్-19 కానుందా? లాక్ డౌన్‌లకు దారి తీస్తుందా అని. 


అయితే, ఈ విషయంలో మీరు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ, ఇది ఒక అటువ్యాధి. ఒకరి నుంచి మరొకరికి ఈజీగా సోకుతుంది. కోవిడ్ తరహాలో ప్రతాపం చూపే అవకాశాలు లేకున్నా.. మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. WHO రీజనల్ డైరెక్టర్ (యూరప్) హన్స్ క్లుజ్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఈ వైరస్‌ను ప్రపంచం నుంచి తరిమికొట్టేందుకు మనమంతా సిద్ధంగా ఉండాలన్నారు. అది మరొక కోవిడ్‌లా మారకుండా జాగ్రత్తపడాలని తెలిపారు. 


కంట్రోల్ చేయొచ్చు, కానీ.. 


ప్రపంచం నుంచి ఎంపాక్స్‌ను తరిమి కొట్టాలంటే తప్పకుండా మనం కొన్ని చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని హన్స్ అన్నారు. దీనిపై నిర్లక్ష్యం వహిస్తే.. కోవిడ్ తరహాలోనే ఆందోళన కలిగించవచ్చని అన్నారు. ఎంపాక్స్ సోకితే జ్వరం తరహా లక్షణాలన్నీ కనిపిస్తాయని, కానీ.. కొన్ని సందర్భాల్లో అది ప్రమాదకరం కూడా వచ్చని ఆయన అన్నారు. ఎందుకంటే.. ఇది చాలా సులభంగా ఒకరి నుంచి మరొకరికి సోకుతుందన్నారు. ఎంపాక్స్ (Clade 1b వేరియెంట్) సోకిన వ్యక్తి.. జస్ట్ మీ పక్కన నిలుచున్నా వ్యాప్తిస్తుందన్నారు.


జాగ్రత్తగా ఉంటేనే...


ఆఫ్రికా ప్రజలను భయపెడుతోన్న ఎంపాక్స్ తరహా కేసు ఒకటి స్వీడన్‌లో కూడా నమోదైందని అన్నారు. అయితే, అది తేలికపాటి Clade 2 వేరియెంట్‌కు చెందినదని అన్నారు. ప్రస్తుతం యూరప్ మొత్తంలో ఈ వేరియెంట్‌కు చెందిన 100 కేసులు నమోదయ్యాయని చెప్పారు. అందుకే, హెల్త్ ఎమర్జెన్సీ డిక్లర్ చేసినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో మంకీ పాక్స్ నుంచి మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కోవిడ్‌ను మాస్కులు, శానిటైజేషన్‌తో కంట్రోల్ చేయగలిగాం. కానీ, ఎంపాక్స్‌ను అలా చేయలేం. వీలైనంత వరకు అంతుబట్టని జ్వరాలు, శరీరంపై దద్దర్లు వంటి లక్షణాలతో ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండటమే బెటర్. 


2022 నుంచే అప్రమత్తం, కానీ.. 


ఆఫ్రికాలో ఇప్పటివరకు సుమారు 17వేలకు పైగా ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో ఇండియా కూడా ఆఫ్రికా నుంచి దేశానికి వచ్చే పౌరులకు స్క్రీనింగ్ నిర్వహిస్తోంది. 2022లో కూడా ఇదే విధంగా హెల్త్ ఎమర్జెన్సీ డిక్లర్ చేశారు. అయితే, అప్పుడు కేసులు చాలా తక్కువ. పైగా ఎంపాక్స్ వైరస్ ప్రభావం కూడా ప్రమాదకరంగా లేదు. అయితే, కొత్త రెండేళ్లుగా నమొదవుతున్న కేసులు, వైరస్ వ్యాప్తి, మరణాలు.. ఎంపాక్స్‌ తీవ్రతను సూచిస్తున్నాయి. 


200 పైగా మరణాలు, ఇండియాలోకి ఎంట్రీ


ఎంపాక్స్ వల్ల ఇప్పటివరకు 208 మంది మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఇప్పటికే ఈ వ్యాధి ఇండియాలోకి కూడా ప్రవేశించిందని వార్తలు వస్తున్నాయి. దాదాపు 30 మందిలో ఈ వైరస్ లక్షణాలు గుర్తించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వ్యాధి వల్ల మరణాలు చోటుచేసుకోలేదు. అయితే, ఆఫ్రికా.. ఐరోపా దేశాల నుంచి ఇండియా వచ్చే వ్యక్తులకు వైద్య పరీక్షలు చాలా అవసరం. వీలైనంత వరకు వారితో దూరంగా ఉండటం ద్వారా ఎంపాక్స్‌ బారిన పడకుండా ఉండవచ్చు. ఇతరులను టచ్ చేయడం, వారు వాడిన వస్తువులను వాడటం, స్వలింగ సంపర్కం, శారీరక కలయిక వంటివి వేగంగా వైరస్ వ్యాప్తికి కారణం అవుతున్నాయి. కాబట్టి, బీ కేర్ ఫుల్. 


Also Read: హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO.. 70 దేశాల్లో మంకీ పాక్స్ వ్యాప్తి, వందల్లో మరణాలు.. చికిత్స, లక్షణాలు ఇవే