చేసే పనిలో సంతృప్తి లేనప్పుడు.. నచ్చిన పనిని ఎంచుకోవాలి. అనుకున్న ఫలితాలను అందుకోవాలి. సక్సెస్ అనేది ఎవరికీ ఊరికే రాదు. శక్తి వంచన లేకుండా కష్టపడినప్పుడే విజయం మీ ముందు తలవంచుతుంది. చత్తీస్ గఢ్ లోని తుస్లీ గ్రామంలో యువతీ యువకులు ఇప్పుడు చేస్తున్నది అదే. కాలంతో పాటు వాళ్లూ అప్ డేట్ అయ్యారు. ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేయడం కంటే సొంతంగా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలి అనుకున్నారు. అంతే, మరో ఆలోచన లేకుండా యూట్యూబ్ ఛానల్స్ ప్రారంభించారు. ఒకరిద్దరు సక్సెస్ కాగానే.. ఊరిలోని యువకులంతా అదే బాట పట్టారు. ఇప్పుడు ఆ ఊరు యూట్యూబర్స్ హబ్‌గా మారింది. ఇక్కడి యువత ఏకంగా 40 యూట్యూబ్ చానళ్లు నడుపుతున్నారు. వినోదంతో పాటు విద్యకు సంబంధించిన కంటెంట్ రూపొందిస్తూ మంచి ఆదరణ దక్కించుకుంటున్నారు.


శ్రీకారం చుట్టింది వీళ్లే


తుస్లీ గ్రామంలో యూట్యూబ్ సంస్కృతిని మొదలు పెట్టింది ఇద్దరు స్నేహితులు. ఒకరు  జ్ఞానేంద్ర శుక్లా, మరొకరు జై వర్మ. వీరు రూపొందించిన కొన్ని వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి. నెటిజన్ల నుంచి వీరి వీడియోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. వారికి వచ్చిన ఆదరణతో మిగతా యువకులు సైతం యూట్యూబ్ చానెళ్లు  ప్రారంభించారు. వారు కూడా బాగా సక్సెస్ అయ్యారు.


ఎస్బిఐ ఉద్యోగం వదులుకున్న శుక్లా


జ్ఞానేంద్ర శుక్లా యూట్యూబూర్ గా మారడానికి ముందు ఎస్‌బిఐ ఉద్యోగం చేసేవాడు. "నేను ఇంతకుముందు ఎస్‌బిఐలో నెట్‌వర్క్ ఇంజనీర్‌గా పనిచేశాను. నా ఆఫీసులో హై-స్పీడ్ ఇంటర్నెట్ ఉండేది. అక్కడ యూట్యూబ్ వీడియోలు చూసేవాడిని. నాకు సినిమాలంటే చాలా ఇష్టం. 2011-12లో యూట్యూబ్ కొత్త వెర్షన్ ప్రారంభించా. యూట్యూబ్‌లో చాలా తక్కువ ఛానల్స్ ఉన్నాయి. ఉద్యోగం కూడా నాకు పెద్దగా నచ్చలేదు.  అందుకే  ఉద్యోగం వదిలి యూట్యూబ్‌ని ప్రారంభించాను. ఇప్పటి వరకు, మేము దాదాపు 250 వీడియోలు చేశాం. 1.15 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉన్నాం. ఇంతకుముందు యూట్యూబ్‌లో కంటెంట్‌ క్రియేట్ చేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బంది పడేవాళ్లం. పబ్లిక్‌ ప్లేస్‌లో నటించలేకపోయాం. కానీ, కొందరు గ్రామ పెద్దలు రాంలీలాలో నటించమని చెప్పడంతో మాలోని భయం పోయింది. ఈరోజు  ఊరి ప్రజలంతా యూట్యూబ్‌లో వీడియోలు చేసి మంచి పాపులారిటీతో పాటు డబ్బులు సంపాదిస్తున్నారు" అని శుక్లా తెలిపారు.   


టీచర్ ఉద్యోగాన్ని వదులుకున్న వర్మ


జై వర్మ తమ యూట్యూబ్ కెరీర్‌ కోసం ఉపాధ్యాయ వృత్తిని వదులుకున్నారు.  "మమ్మల్ని చూసి యూట్యూబ్ కోసం, తర్వాత టిక్‌టాక్ కోసం,  ఇప్పుడు రీల్స్ కోసం  యువతీ యువకులు వీడియోలు చేయడం ప్రారంభించారు. నేను కెమిస్ట్రీలో MSc డిగ్రీని కలిగి ఉన్నాను.  పార్ట్‌ టైమ్ టీచర్‌ గా చేశాను. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌ కూడా రన్ చేశాను.  ఇంతకు ముందు  నేను నెలకు రూ. 12,000-రూ. 15,000 సంపాదించాను. ఇప్పుడు మేము నెలకు రూ. 30,000-35,000 సంపాదిస్తున్నాం. తుస్లీ గ్రామంలో దాదాపు 3 వేల మంది ఉన్నారు. అందులో 40 శాతం మంది యూట్యూబ్‌కి కనెక్ట్ అయ్యారు" అని జై వర్మ తెలిపారు.


బాలికలకు సాధికారత కల్పిస్తున్న యూట్యూబ్


అటు నక్సల్స్ ప్రభావిత రాష్ట్రంలో బాలికలకు సాధికారత కల్పించే సాధనంగా యూట్యూబ్ మారిపోయింది. పింకీ సాహు అనే యూట్యూబర్ సైతం మంచి కంటెంట్ రూపొందిస్తూ సక్సెస్ ఫుల్ గా చానెల్ రన్ చేస్తున్నది. "నేను యూట్యూబ్ ప్రారంభించి 1.5 సంవత్సరాలు అయ్యింది. మాకు దాదాపు 40 యూట్యూబ్ ఛానెల్‌లు ఉన్నాయి. ఇక్కడ మహిళలు సాధారణంగా ఇండ్ల నుంచి బయటకు రావడానికి అనుమతించరు. కానీ, మా యూట్యూబ్ ఛానెల్ ద్వారా అమ్మాయిలు కూడా ఏదైనా చేయగలరని నిరూపించాం" అని వెల్లడించింది. చూశారుగా, మనసుంటే మార్గం ఉంటుంది. మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి. లక్ కలిసొస్తే మీరు కూడా వీడియోలతో ఉపాధి పొందవచ్చు. 


Also read: పీరియడ్స్ వచ్చే ముందు రొమ్ముల్లో నొప్పి రావడం సహజమేనా?


Also read: ఈ చిత్రంలో మీకు మొదట ఏ జీవి కనిపిస్తోంది? దాన్ని బట్టి మీ మెదడు ఏ వైపు చురుగ్గా పనిచేస్తుందో చెప్పవచ్చు