Employee Well Being : నేను పడుకోవడానికే ఇంటికి వెళ్తున్నట్టుందిరా.. నేను అయితే ఆఫీస్​లోనే పడుకుంటే బెటర్​ ఏమో అనుకుంటున్నాను.. పైసలు సంపాదిస్తున్నాను కానీ దానితో ఎంజాయ్ చేయలేకపోతున్నాను మావ.. వీకెండ్, మంథ్ ఎండ్ టార్గెట్​లతో పిచ్చిలేస్తుంది బ్రో.. నేను అయితే కంపెనీ కోసమే బతుకుతున్నాను అనిపిస్తుంది.. ఇలాంటి ఎన్నో డైలాగ్స్ మీరు మీ కొలిగ్స్​తో చెప్పడమో.. లేదా మీ కొలిగ్స్ మీతో చెప్పడం చేస్తూ ఉంటారు. పరిస్థితి ఎంత విషమించింది అంటే.. జాబ్ ప్రెజర్​తో మనుషులు చచ్చిపోయే స్టేజ్​కి వెళ్లిపోయింది. అంతేందుకు ఓ రోబో కూడా పని ఒత్తిడితో ఆత్మహత్య చేసుకుంది.


రీసెంట్​గా పూనెలోని 26 ఏళ్ల సీఏ వర్క్ ప్రెజర్​తో ప్రాణాలు విడిచింది. లక్షల్లో జీతం వచ్చినా.. కంపెనీ నుంచి వచ్చే ప్రెజర్​ని తట్టుకోవడం ఆమెను పూర్తిగా క్షీణించేలా చేసింది. కూతురుని కోల్పోయిన తల్లి.. తన బిడ్డ జాబ్​లో జాయిన్ అయిన తర్వాత సరిగ్గా నిద్రపోయేది కాదని, వర్క్ విషయంలో స్ట్రెస్ ఎక్కువగా తీసుకునేదని.. యాంగ్జైటీ కూడా అటాక్ చేసిందంటూ ఎమోషనల్​గా ఆ కంపెనీకి ఓ లెటర్​ కూడా రాసింది. రాత్రి పగలూ తేడా లేకుండా.. వారాంతాల్లో కూడా పనిచేసేదంటూ లేఖలో పేర్కొంది. ఇక్కడ ఉద్యోగులు గుర్తించుకోవాల్సింది ఏంటంటే.. ఉద్యోగిగా మీకు ఏదైనా అయితే కంపెనీ మీ ప్లేస్​ని రిప్లేస్ చేస్తుంది. కానీ మీ ఫ్యామిలీకి మీరు బిగ్గెస్ట్ లాస్ అవుతారు. 


షాకింగ్ విషయాలు ఇవే


ప్రపంచవ్యాప్తంగా పని ఒత్తిడితో మరణించేవారి సంఖ్య ఆందోళనని కలిగిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం పని ఒత్తిడి వల్ల కలిగే డిప్రెషన్, ఆందోళనతో సంవత్సరానికి 12 బిలియన్ల మంది ఇబ్బందులు పడుతున్నారట. ఇండియాలో కూడా ఈ విషయం ఆందోళన కలిగించే విధంగానే ఉంది. ప్రపంచ గణాంకాల ప్రకారం ప్రతి నలుగురు ఉద్యోగులలో ఒకరు ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారట. ఇండియాలో అయితే సరైన కార్మిక రక్షణ చట్టాలు లేకపోవడం వల్ల ఉద్యోగులకు ఈ పని భారం మరింత ఎక్కువ అవుతుందని అధ్యయనాలు చెప్తున్నాయి. 


పని ఒత్తిడి ఎప్పుడు ఎక్కువ అవుతుందంటే.. 


పనిభారం ఎక్కువ కావడం, లేదా ఇచ్చిన పనిని పూర్తి చేయలేకపోవడం, లే ఆఫ్ ప్రెజర్స్, ఇంక్రిమెంట్స్ ఇబ్బందులు. ఇవన్నీ ఉద్యోగికి ప్రెజర్​ని ఇచ్చేకారకాలే. ఒక్కోసారి ఇవన్నీ ఒకేసారి ఎదురుకావొచ్చు. ఈ టార్గెట్స్ కంప్లీట్ అయితేనే ఇంక్రిమెంట్ ఇస్తాము. అప్రైజల్ ఇలా చేస్తూనే వస్తుంది కాబట్టి ఈ వర్క్ చేయాలంటూ.. టార్గెట్స్ వల్ల కూడా ప్రెజర్ ఎక్కువ అవుతోందని చెప్తున్నారు. ఇవే కాకుండా వీకెండ్ వర్క్స్, మంథ్ ఎండ్ టార్గెట్స్ కూడా ఉద్యోగులపై ఒత్తిడిని పెంచుతున్నాయి. 


మనశ్శాంతి కోసం ఎటైనా పోవాలన్నా.. లీవ్స్ ఇవ్వడానికి కంపెనీలు ఇబ్బందులు ఇబ్బందులు పెడుతున్నాయి. కొందరు పగలు, రాత్రి తేడా లేకుండా పనిలోనే నిమగ్నమవుతున్నారు. ఈ కారణాలవల్లే చాలామంది ఫ్యామిలీ లైఫ్​కి దూరమవుతున్నారు. పర్సనల్​ లైఫ్​ని అనే సంగతిని కూడా మరచిపోతున్నారు. వీటివల్ల మానసికంగా, శారీరకంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. నిద్ర లేమి, గుండె సమస్యలు, షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఒత్తిడి, యాంగ్జైటీ వంటి మానసిక సమస్యలు ఎక్కువ అవుతున్నాయి.


ఎలా బ్యాలెన్స్ చేయాలంటే.. 


ఒత్తిడి లేకుండా పని జీవితాన్ని ముందుకు సాగించాలంటే కొన్ని బౌండరీలు సెట్ చేసుకోవాలి. స్వీయ సంరక్షణకు ప్రాధాన్యతనిచ్చుకోవాలి. పై అధికారి మెప్పు గురించి ఆలోచిస్తూ.. పనికి మించిన భారం తీసుకోకూడదు. మీ స్థోమత లేదా పరిధిని దాటే ఏ వర్క్​కైనా నో చెప్పడం నేర్చుకోండి. మొహమాటంతో సరే చేసేస్తాను అనేది మీకు తలకు మించిన భారం కావొచ్చు. కొలిగ్స్ వర్క్​ని కూడా మీద వేసుకోవడం మానేయండి. మీకు అప్పగించిన పనిని.. టైమ్ లిమిట్ పెట్టుకుని దానిలోనే కంప్లీట్ అయ్యేలా చూసుకోండి. 



వారి సహాయం కోరండి.. 


వర్క్ ప్రెజర్​ వల్ల ఒత్తిడి పెరుగుతుంటే మీ ఫ్రెండ్స్, కొలిగ్స్, ఫ్యామిలీ సహాయం తీసుకోండి. వారికి మీ ఇబ్బందిని వివరించండి. ఈ ఒత్తిడి, యాంగ్జైటీ నుంచి బయటపడేందుకు ఇతరుల సహాయం తీసుకోవడంలో తప్పులేదు. పరిస్థితి మీ చేయి దాటిపోతుందని భయం వేస్తే కచ్చితంగా వైద్యులు, నిపుణుల సహాయం తీసుకోండి. పర్సనల్ స్పేస్​లోకి వర్క్​ని తీసుకెళ్లకండి. రెగ్యూలర్​గా వ్యాయామం, యోగా చేసేలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.


యాజమాన్యం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..


ఉద్యోగిని కాపాడుకోవాల్సిన బాధ్యత కంపెనీకి కూడా ఉంది. అందుకే యజమానులు.. ఉద్యోగులకు పని సంబంధిత ఒత్తిడిని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలి. దీనివల్ల ఉద్యోగులకే కాదు.. పనిలో కూడా క్వాలిటీ పెరుగుతుంది. ఉద్యోగికి కనీస అవసరాలు తీర్చడం, జాబ్ సెక్యూరిటీ అందించడం వంటివి చేయాలి. ఆఫీస్​లో హెల్తీ ఎన్వీరాన్​మెంట్ ఉండేలా చూడడం, ఉద్యోగుల మానసిక ఆరోగ్యానికి, స్వీయ సంరక్షణను ప్రోత్సాహించేలా వర్క్​షాప్స్​ నిర్వహించడం చేయాలి. 


Also Read : ఈ టిప్స్ ఫాలో అయితే కేవలం 5 నిమిషాల్లోనే మీ ఒత్తిడి తగ్గించుకోవచ్చు