India Growth: 


ఈ సవాళ్లు దాటగలమా? 


సుస్థిర ఆర్థికాభివృద్ధి సాధించిన దేశాల్లో భారత్ కూడా ఒకటి. కానీ..ఇప్పటికీ...దిగువ మధ్యాదాయ దేశాల జాబితాలోనే ఉండిపోయింది ఇండియా. ప్రస్తుత వృద్ధి రేటు ఆశాజనకంగానే ఉన్నా...ఇదే ట్రెండ్‌తో కొనసాగితే...భవిష్యత్‌లో పై మెట్టు ఎక్కటం కాస్త కష్టమేనంటున్నారు ఆర్థిక నిపుణులు. అందుకే...సరైన రోడ్ మ్యాప్ వేసుకుని అధికాదాయ దేశాల లిస్ట్‌లో చేరిపోయే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు. ఈ లక్ష్యం చేరుకోవాలంటే..ప్రధానంగా మూడు సవాళ్లు దాటుకోవాల్సి ఉంటుంది. అందులో ఒకటి ఆర్థిక-సామాజిక సమానత్వం సాధించటం. GDP పరంగా చూస్తే..భారత్ మెరుగ్గానే ఉంది. కానీ...సామాజికంగా చూస్తే మాత్రం ఇంకా అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. అన్ని వర్గాలకూ అభివృద్ధి ఫలాలు అందటం లేదు. ఫలితంగా...ఆర్థిక, సామాజిక సమతుల్యత సాధ్యమవడం లేదు. ఇక రెండో సవాలు...ఉద్యోగాల కల్పన. ప్రపంచ దేశాలతో పోల్చితే...భారత్‌లోనే యువ జనాభా ఎక్కువ. ఇక్కడే నిరుద్యోగ సమస్యా ఉంది. శ్రామిక శక్తి తక్కువగా ఉంటోంది. ఉద్యోగాలు సృష్టించటం పెద్ద ప్రహసనమైపోయింది. అసంఘటిత రంగాలకు చెందిన కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పించటంలో వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మూడో సవాలు...విధానాల అమలు. ఆర్థిక సంస్కరణలు చేపట్టడంలో భారత్ పురోగతి సాధించిప్పటికీ..అవి చూపించిన ప్రభావం తక్కువగానే ఉంది. అంటే...ఇంకా చేయాల్సింది ఎంతో ఉందన్నమాట. 


నిపుణుల సూచనలివే..


ఈ సవాళ్లతో పాటు అంతర్గతంగా మరి కొన్ని ఇబ్బందులు వెంటాడుతున్నాయి. ప్రపంచీకరణ, వాతావరణ మార్పులు, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సహా మరి కొన్ని సాంకేతిక సవాళ్లు తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. వీటికి పరిష్కారం ఆలోచించాలని చెప్పటమే కాదు...ఆ పరిష్కా రాలేంటో కూడా చెబుతున్నారు కొందరు ఎక్స్‌పర్ట్‌లు. అవేంటో చూద్దాం. 


1. ఈజ్ ఆఫ్ లివింగ్‌ లక్ష్యం పెట్టుకోవాలన్నది ఎక్స్‌పర్ట్‌లు ఇస్తున్న మొదటి సలహా. వీటితో పాటు పునరుత్పాదక వనరులను సంరక్షించు కోవటమూ కీలకమేనని అంటున్నారు. 
2. ఆర్థిక వృద్ధి రేటు, సామాజిక పురోగతితో సమానంగా ఉండాలి. అంటే...ఈ రెండు అంశాల్లో సమానత్వం సాధించాలి. 
3. భారత్‌లోని అన్ని ప్రాంతాలకు, అన్ని వర్గాలకూ సంపద చేరాలి. అంటే...ఆర్థిక వృద్ధి ఫలాలు అన్ని మూలలా కనిపించాలి. 
4. ఎలాంటి ఒత్తిళ్లనైనా తట్టుకుని నిలబడగలిగేంతగా ఆర్థికంగా బలపడాలి. 


ఉద్యోగ సృష్టి కీలకం..


ఈ నాలుగు అంశాలతో పాటు మరి కొన్ని సూచనలూ చేస్తున్నారు నిపుణులు. ఆర్థిక, సామాజిక అభివృద్ధి ఎజెండాలను ఇంటిగ్రేట్ చేయాల్సి ఉంటుంది. 2047 నాటికి భారత్ 100వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటుంది. ఆ సమయానికి...ఈ లక్ష్యం సాధించాలి. అంతే కాదు. ఉద్యోగాలు క్రియేట్ చేయటంలోనూ...2047 నాటికి వ్యూహాలు మార్చుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగాల కల్పనతోనే..దేశ ఉత్పాదకత పెరుగుతుంది. పరిశ్రమల్లో కొత్త సర్వీసులను ప్రారంభించి...వాటిలో కొత్త ఉద్యోగాలు సృష్టించడం ద్వారా నిరుద్యోగ సమస్యను పరిష్కరించుకోవచ్చు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా...టెక్నాలజీల్లో మార్పులు అందిపుచ్చుకుంటే ఇదేమంత కష్టం కాదు. తక్కువ నైపుణ్యాలున్న
శ్రామికులకు...స్కిల్ అప్‌గ్రెడేషన్‌ చేస్తే చాలా వరకు మార్పులు వస్తాయి. ఇందుకోసం...ఆర్థికంగా, పారిశ్రామికంగా విధానాల్లో సంస్కరణలు చేయాలి. వీటితో పాటు పోటీని తట్టుకుని నిలబడే సంస్థలు స్థాపించటమూ కీలకమే. అంటే..అంకురాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సి ఉంటుంది. మొత్తంగా Business Environment ను అందరికీ అనుకూలంగా మార్చాలి. మార్కెటింగ్ కాంపిటీషన్‌ను బలోపేతం చేయడమూ ముఖ్యమే. 


Also Read: India's Competitiveness: ఇండియాలో అభివృద్ధి కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతోందా? ఈ సవాలు ఎలా దాటాలి?


Also Read: Digital Rupee: డిజిటల్‌ రూపాయిపై ఆర్బీఐకి ఎందుకింత ఆసక్తి! వీటితో నష్టాలేమైనా ఉన్నాయా!