థియేటర్లలో 'ఆర్ఆర్ఆర్' సందడి కొనసాగుతోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధిస్తోంది. 'ఆర్ఆర్ఆర్' విడుదలైన వారం రోజులకు థియేటర్లలో కొన్ని సినిమాలు వస్తున్నాయి. తెలుగులో తాప్సి పన్ను ప్రధాన పాత్రలో 'మిషన్ ఇంపాజిబుల్', హిందీలో 'శర్మాజీ నమ్ కీన్', 'ఎటాక్', మలయాళంలో 'భీష్మ పర్వం' తదితర సినిమాలు ఈ వారం సందడి చేయనున్నాయి. ఆ సినిమాల జాబితా...


'శర్మాజీ నమ్ కీన్'
హిందీ ప్రేక్షకులకు 'శర్మాజీ నమ్ కీన్' సినిమా కాదు... ఒక ఎమోషన్! రిషి కపూర్ నటించిన చివరి సినిమా కావడంతో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాకుండా ఆయన మరణించడంతో ఆ పాత్రను పరేష్ రావెల్ పూర్తి చేశారు. రిషి కపూర్ కొన్ని సన్నివేశాల్లో కనిపిస్తే...కొంతసేపు పరేష్ రావెల్ కనిపిస్తారన్నమాట. మార్చి 31న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ సినిమా విడుదల కానుంది.
Also Read: రిషి కపూర్ మరణించిన 700 రోజులకు, ఆయన చివరి సినిమా విడుదల



'రాధే శ్యామ్'
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన 'రాధే శ్యామ్' మూవీ సైతం ఏప్రిల్ 1న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదల కానుంది (Radhe Shyam On Prime). 



మిషన్ ఇంపాజిబుల్
ఈ వారం థియేటర్లలోకి వస్తున్న తొలి తెలుగు సినిమా 'మిషన్ ఇంపాజిబుల్'. కొంత విరామం తర్వాత తాప్సి పన్ను తెలుగు సినిమా చిత్రమిది. ఏప్రిల్ 1న సినిమా విడుదల అవుతోంది. దీనికి 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'తో ప్రేక్షకులను ఆకట్టుకున్న స్వరూప్ ఆర్.ఎస్.జె దర్శకుడు. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. తీవ్రవాదుల్ని పట్టుకోవడం కోసం చిన్నారులు చేసే ప్రయత్నాలు వినోదం పండించగా... తాప్సి పాత్ర ఆసక్తి రేపింది. 



ఎటాక్
జాన్ అబ్రహం, రకుల్ ప్రీత్ సింగ్, జాక్వలిన్ ఫెర్నాండేజ్ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'ఎటాక్'. ఇదీ ఏప్రిల్ 1న విడుదలవుతోంది. యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. ఈ వారం ప్రేక్షకుల ముందుకొస్తున్న కమర్షియల్ ప్యాకేజ్డ్ సినిమా కూడా ఇదేనని చెప్పొచ్చు.



ఆడవాళ్ళు మీకు జోహార్లు
శర్వానంద్, రష్మిక జంటగా నటించిన సినిమా 'ఆడవాళ్ళు మీకు జోహార్లు'. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 2 నుంచి సోనీ లివ్ ఓటీటీలో వీక్షకులకు అందుబాటులోలకి వస్తోంది. పెళ్లి నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ఇందులో వినోదం వీక్షకుల్ని ఆకట్టుకుంది.
Also Read: 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' రివ్యూ: ఫస్టాఫ్ హిట్టు - సెకండాఫ్ గురించి మీకు అర్థమవుతోందా?


భీష్మ పర్వం
మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటించిన లేటెస్ట్ సినిమా 'భీష్మ పర్వం'. మార్చి 3న థియేటర్లలో విడుదలైంది. నెల తిరగకుండా డిజిటల్ తెరపైకి వస్తోంది. ఏప్రిల్ 1 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.



డ్రైవ్ మై కార్
ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాల్లో తప్పకుండా చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే... అది 'డ్రైవ్ మై కార్' అని చెప్పాలి. ఉత్తమ అంతర్జాతీయ సినిమాగా ఆస్కార్ అందుకున్న ఈ సినిమా 'ముబి' (mubi ott) ఓటీటీలో ఏప్రిల్ 1న విడుదల అవుతోంది. ఇండియాలో ఆ ఓటీటీకి స‌బ్‌స్కైబ‌ర్స్ తక్కువ. ఆ సినిమా కోసం ఎంత మంది ఓటీటీ స‌బ్‌స్క్రిప్ష‌న్‌ తీసుకుంటారో చూడాలి.



థియేటర్లలో ఏప్రిల్ 1న తెలుగు, బంజారా భాషల్లో 'సేవా దాస్' సినిమా, తెలుగులో హాలీవుడ్ సినిమా 'మార్బియస్' విడుదల కానున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌లో మార్చి 31న యానిమేషన్ వెబ్ సిరీస్ 'స్టోరీస్ ఆఫ్ విట్ అండ్ మేజిక్', డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో మార్చి 30న 'మూన్ నైట్' వెబ్ సిరీస్ విడుదల కానున్నాయి.