రాజశేఖర్ కథానాయకుడిగా రూపొందిన సినిమా 'శేఖర్'. వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మే 20న సినిమాను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాకు రాజశేఖర్ సతీమణి, నటి జీవిత దర్శకత్వం వహించారు. ఈ దంపతుల పెద్ద కుమార్తె శివాని ఈ సినిమాలో కీలక పాత్ర చేశారు. రాజశేఖర్ కూతురిగానే సినిమాలో కూడా నటించింది శివాని. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.

 

'పోలీస్ యూనిఫామ్ వేసుకొని కూడా డ్యూటీ చేయనివాళ్లు చాలా మంది ఉంటారు.. అదే పోలీస్ ఉద్యోగానికి రిజైన్ చేసి కూడా డ్యూటీ కోసం ప్రాణమిచ్చే వాళ్లు వేలల్లో ఒక్కరే ఉంటారు' అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. ఈ డైలాగ్ తో హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో చెప్పేశారు. హీరో కూతురికి యాక్సిడెంట్ జరగడం, దాని వెనుక ఎవరున్నారో తెలుసుకోవాలని హీరో ప్రయత్నించే సన్నివేశాలను ట్రైలర్ లో చూపించారు. 

 

ట్రైలర్ చివర్లో హీరోకి కూడా యాక్సిడెంట్ జరగడం చూపించారు. అరకు నేపథ్యంలో 'శేఖర్' సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపించనున్నారు రాజశేఖర్. పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.