అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈపాటికి మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి హడావిడి చేస్తూ ఉండేది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయాలనుకున్నారు. కానీ 'ఆర్ఆర్ఆర్' సినిమా కోసం సంక్రాంతి బరి నుంచి తప్పుకొని ఏప్రిల్ 1న రావాలనుకుంది. మొదట ఈ నిర్ణయం అభిమానులకు రుచించకపోయినా.. వేసవి సీజన్ కాబట్టి భారీ వసూళ్లను సాధిస్తుందని అనుకున్నారు. 

 

సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవడంతో మహేష్ అండ్ టీమ్ కాస్త రిలాక్స్ అయింది. మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి ట్రిప్ కి కూడా వెళ్లారు. పండగ తరువాత కొత్త షెడ్యూల్ మొదలుపెట్టాలని అనుకున్నారు. కానీ ఇంతలో ఊహించని సంఘటనలు చోటుచేసుకున్నాయి. మహేష్ బాబుకి కరోనా సోకింది. ఆయన ఐసోలేషన్ లో ఉన్న సమయంలోనే అతడి సోదరుడు రమేష్ బాబు మరణించారు. తను ఎంతగానో అభిమానించే అన్నయ్యను చివరిచూపు కూడా చూసుకోలేకపోయిన మహేష్ శోకంలో ఉన్నారు. 

 

దీంతో మరో నెల రోజుల పాటు షూటింగ్ కు వచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు. మరోపక్క దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. సాధారణ పరిస్థితులు ఎప్పుడు వస్తాయో కూడా చెప్పలేని పరిస్థితి. ఒకవేళ అన్నీ సహకరించినా.. వేసవి సీజన్ లో ముందుగా 'ఆర్ఆర్ఆర్' వస్తుంది. ఆ తరువాత గ్యాప్ ఇచ్చి మహేష్ సినిమాను రిలీజ్ చేస్తారు. ఆ లెక్కన చూసుకుంటే ఏప్రిల్ 1న మహేష్ సినిమా వచ్చే అవకాశం లేదు. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన రానుంది.

 

అందుతున్న సమాచారం ప్రకారం.. 'సర్కారు వారి పాట' సినిమా ఆగస్టు 5న రానుందని అంటున్నారు. దాదాపు ఈ డేట్ ని ఫిక్స్ చేయబోతున్నట్లు సమాచారం. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను పరశురామ్ డైరెక్ట్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్, మహేష్ బాబు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.