Tollywood Movies Sankranti 2023 : సంక్రాంతి సందడి మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు... అమెరికాలో కూడా! అక్కడ ఉన్న తెలుగు ప్రేక్షకుల్లో కూడా! అదీ సినిమాల పరంగా! ఒకటి రెండు కాదు... 2023 సంక్రాంతికి తెలుగులో ఇద్దరు అగ్ర కథానాయకులు నటించిన స్ట్రయిట్ తెలుగు సినిమాలు, తమిళ స్టార్ హీరోలు నటించిన రెండు డబ్బింగ్ సినిమాలు, మరో రెండు చిన్న తెలుగు సినిమాలు వస్తున్నాయి. అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి.


ప్రస్తుతానికి బాలకృష్ణది పైచేయి!
Sankranti 2023 Movies Collections : అమెరికాలోని డల్లాస్ ఏరియాలో కొన్ని గంటల క్రితమే సంక్రాంతి సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. నట సింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన 'వీర సింహా రెడ్డి' బుకింగ్స్ ప్రస్తుతానికి మిగతా సినిమాల కంటే ముందు ఉంది. ఆ వెనుకే మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ నటించిన 'వాల్తేరు వీరయ్య' ఉంది.
 
'వీర సింహా రెడ్డి' టికెట్స్ 196 సేల్ అయితే... 'వాల్తేరు వీరయ్య' టికెట్స్ 156 సేల్ అయ్యాయి. విజయ్ 'వారసుడు', అజిత్ 'తునివు' (తెలుగులో 'తెగింపు'గా విడుదల అవుతోంది) టికెట్స్ సేల్ చాలా నెమ్మదిగా ఉన్నాయి. ఎర్లీ సేల్స్ చూస్తే... కనీసం పాతిక టికెట్లు కూడా తెగలేదు. త్వరలో మిగతా లొకేషన్స్ కూడా ఓపెన్ కానున్నాయి. అప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉంటాయో చూడాలి. 


తెలుగు సినిమా టికెట్స్ రేట్ తక్కువ!
USA Ticket Rates - Pongal 2023 Movies : అమెరికాలో టికెట్ రేట్స్ పరిశీలిస్తే... తెలుగు సినిమాలు 'వీర సింహా రెడ్డి', 'వాల్తేరు వీరయ్య'కు 18 డాలర్లు పెట్టారు. తమిళ సినిమాలు రెండిటికి రెండు డాలర్లు ఎక్కువ ఉన్నాయి. 'వారిసు' (తెలుగులో 'వారసుడు'), 'తునివు' చూడాలంటే 20 డాలర్లు పెట్టారు.


Also Read : మెగా, నందమూరి హీరోలు కలుస్తున్నారు - ఫ్యాన్స్ కలిసేది ఎప్పుడు? ఈ గొడవలేంట్రా బాబు?






నాలుగు పెద్ద సినిమాలను పక్కన పెడితే... తెలుగులో మరో రెండు చిన్న చిత్రాలు సైతం ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్, రాజశేఖర్ కుమార్తె శివాని జంటగా నటించిన 'విద్యా వాసుల అహం', సంతోష్ శోభన్ కథానాయకుడిగా యువి క్రియేషన్స్ నిర్మించిన 'కళ్యాణం కమనీయం' సినిమాలు కూడా సంక్రాంతికి వస్తున్నాయి. 


జనవరి 11న అజిత్ 'తెగింపు', 12న బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి', విజయ్ 'వారసుడు', 13న చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. వీటి తర్వాత జనవరి 14న 'విద్యా వాసుల అహం' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆ రోజునే 'కళ్యాణం కమనీయం' విడుదల కూడా!


అసలు పోటీ చిరు, బాలయ్య మధ్యే!
సంక్రాంతి బరిలో ఎన్ని సినిమాలు ఉన్నప్పటికీ... అసలు పోటీ చిరంజీవి, బాలకృష్ణ మధ్యే నెలకొంది. రెండు సినిమాలనూ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. అటు అభిమానులను సంతృప్తి పరుస్తూ... ఇటు ఇండస్ట్రీలో వ్యాపార పరంగా తమ పెట్టుబడిని వెనక్కి రాబట్టుకోవాల్సిన అవసరం ఆ సంస్థకు ఉంది. రెండు సినిమాలు ఒకేసారి విడుదల కావడం వల్ల సుమారు 15 కోట్లు అదనంగా వచ్చే ఆదాయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ కోల్పోతోందని కొందరు కామెంట్ చేస్తున్నారు. థియేటర్స్ విషయంలో సమస్యలు ఉన్నాయని టాక్. అయితే... తమకు ఏ సమస్య లేదని, హ్యాపీగా ఉన్నామని నిర్మాత రవి శంకర్ చెప్పారు. 


Also Read : చిరు, బాలయ్య పోటీ - నో ప్రాబ్లమ్, ఆల్ హ్యాపీస్!