Chelsea Islan In Mahesh Babu Film: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి  కాంబినేషన్ లో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కబోతోంది. మహేష్ కెరీర్ లో 29వ చిత్రంగా రూపొందబోతోంది. ఏడాది క్రితమే ఈ సినిమా పనులు మొదలయ్యాయి. దాదాపు ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావచ్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి ఏ చిన్న రూమర్ వచ్చినా, సోషల్ మీడియాలో సంచలనంగా మారుతోంది. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.


మహేష్ మూవీలో ఇండోనేషియా బ్యూటీ


మహేష్ బాబు కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఫిక్స్ అయినట్లు వార్తలు వచ్చాయి. రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఫారిన్ బ్యూటీ ఒలివియా మోర్రీస్‌ నటించింది. మహేష్ బాబు మూవీలోనూ ఫారిన్ బ్యూటీని తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇందులో ఫారిన్ నటీనటులు ఉండే అవకాశం ఉందని గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.


ఈ నేపథ్యంలో SSMB 29లో చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ అనే ఇండోనేషియన్ నటిని తీసుకున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. అమెరికాలో పుట్టిన చెల్సియా ఇండోనేషియన్ భాషలో పలు చిత్రాల్లో నటించింది. ఇప్పుడు మహేష్, రాజమౌళి మూవీలో కీలక పాత్ర పోషించనున్నట్లు టాక్ వినిపించింది. అంతేకాదు, ఇన్‌స్టాగ్రామ్‌లో రాజమౌళిని చెల్సియా ఫాలో అవ్వడంతో ఆ వార్తలు నిజమేనని కొందరు అభిప్రాయపడ్డారు.   


‘SSMB 29‘ హీరోయిన్ పై జక్కన్న టీమ్ క్లారిటీ


తాజాగా ఈ వార్తలపై జక్కన్న టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఈ పుకార్లు కేవలం ఊహాగానాలు మాత్రమేనని తేల్చి చెప్పింది. మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో వస్తున్న సినిమాలో చెల్సియా ఎలిజబెత్ అనే ఇండోనేషియా నటిని తీసుకున్నట్లు వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమేనని వెల్లడించింది. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని వివరణ ఇచ్చింది.


ప్రీ ప్రొడక్షన్ పనుల్లో SSMB 29


ప్రస్తుతం SSMB 29 ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. జక్కన్న ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచి భారీగా అంచనాలు నెలకొన్నాయి. రాజమౌళి, మహేష్ బాబు కలిసి చేస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కొనసాగుతోంది. దాదాపు కథ పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ తో పాటు ఇతర నటీనటుల ఎంపికపై ఎలాంటి వివరాలు బయటకు రాలేదు. ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ కాగానే, ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి జక్కన్న తన ప్రాజెక్టుకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


SSMB 29 కథ గురించి విజయేంద్ర ప్రసాద్ ఏమన్నారంటే?


ఇక ఈ సినిమా కథకు సంబంధించి రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అమెజాన్ అడవుల కేంద్రంగా అద్భుతమైన సాహసాలు ఈ సినిమాలో ఉండబోతున్నట్లు చెప్పారు. అంతేకాదు, ఇండియానా జోన్స్ లాంటి కథాంశంతో ఈ సినిమా రూపొందబోతున్నట్లు తెలిపారు. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కెఎల్ నారాయణ ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించబోతున్నారు.






Read Also: మైకుతో కొట్టి, ఫోన్లు విసిరేసి - అభిమానులపై సింగర్ ఆదిత్య నారాయణ్ ప్రతాపం