భారతీయ సినిమా ఇండస్ట్రీలో విలక్షణ నటుల్లో ప్రకాష్ రాజ్ ఒకరు. ఎలాంటి పాత్రకైనా తనదైన రీతిలో నటించి ప్రేక్షకులను మెప్పిస్తారాయన. అందుకే ప్రకాష్ రాజ్ కు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. సినిమాల్లో ఎంత విలక్షణ నటన కలిగి ఉంటారో వ్యక్తిగత జీవితంలోనూ ఆయన అదే స్టైల్ ను ఫాలో అవుతూ ఉంటారు. సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ ఆయన యాక్టీవ్ గా ఉంటున్నారు. ముఖ్యంగా బీజేపీ విధానాలను ఎక్కువగా విమర్శిస్తూ వార్తల్లో ఉంటున్నారు.


తాజాగా ప్రకాష్ రాజ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ సినిమా జనవరి 25 న విడుదల అయింది. విడుదల అయిన తొలి రోజు నుంచే భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు మూవీను బ్యాన్ చేయాలంటూ విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడీ సినిమా వందల కోట్లు కలెక్షన్లు సాధించడంతో సినిమాను ముందు వ్యతిరేకించిన వారిని ఉద్దేశించి ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 


షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ మూవీ విడుదలకు ముందు ఆ మూవీ నుంచి విడుదల చేసిన ‘భేషరమ్ రంగ్’ సాంగ్ లో హీరోయిన్ దీపికా పదుకోణ్ ధరించిన కాషాయం రంగు దుస్తులతో ఉన్న సన్నివేశాలు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని మధ్యప్రదేశ్ ఇండోర్ నగరంలో హిందూ సంఘాల ఆద్వర్యంలో నిరసనలకు దిగారు. ఈ సినిమాను వెంటనే బ్యాన్ చేయాలని అన్నారు. అంతేకాకుండా షారుఖ్ దిష్టి బొమ్మను కూడా దహనం చేశారు. దీంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అయితే వాటన్నిటినీ దాటుకొని సినిమా రిలీజై విజయవంతం కావడంతో ఆ ఘటనపై తాజాగా ప్రకాష్ రాజ్ స్పందించారు. ఇటీవల కేరళలోని తిరువనంతపురంలో జరిగిన మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ లో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. షారుఖ్ ఖాన్ సినిమా ‘పఠాన్’ను బాయ్‌ కాట్ చేయాలని ఆందోళన చేసిన వారిపై మండిపడ్డారు. 






‘పఠాన్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా వందల కోట్లు వసూలు చేసిందని ప్రకాష్ రాజ్ అన్నారు. ‘పఠాన్’ సినిమాను బ్యాన్ చేయాలని ఈ నిరసన చేశారని, వాళ్లంతా ఇడియట్స్ అని, మోదీ సినిమాకు రూ.30 కోట్లు వసూలు చేయలేకపోయారు. వాళ్లు మొరుగుతారు తప్ప కరవరని సంచలన వ్యాఖ్యలు చేశారాయన. కేవలం ‘పఠాన్’ సినిమా గురించే కాకుండా వివేక్ అగ్నిహోత్రి దర్వకత్వంలో వచ్చిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాను సైతం ప్రకాష్ రాజ్ విమర్శించారు. సినిమా ఇండస్ట్రీలో పనికిమాలిన సినిమాల్లో ‘కాశ్మీర్ ఫైల్స్’ ఒకటని అన్నారు. ఆ సినిమాను ఎవరు నిర్మించారో మనకు తెలుసు. ఇంటర్నేషనల్ జ్యూరీ.. వాళ్ల మీద ఉమ్మేసింది. నాకు ఆస్కార్ ఎందుకు రాలేదు అని డైరెక్టర్ అడుగుతాడు. అతడికి ‘భాస్కర్’ కూడా రాదు అని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారాయన.  ప్రస్తుతం ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ఇటు సినీ ఇండస్ట్రీలో అటు రాజకీయంగానూ చర్చనీయాంశమవుతున్నాయి. 


Read Also: మాల్దీవుల్లో ప్రభాస్, కృతి సనన్ ఎంగేజ్మెంట్ - ఈ వార్తలు నిజమేనా?