దేశంలో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. దీనికి తోడు ఒమిక్రాన్ వేరియంట్ ఒకటి ఉంది. ఈ మధ్యకాలంలో కోవిడ్ బారిన పడ్డ వారి సంఖ్య మరింత పెరిగింది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ వైరస్ బారిన పడుతున్నారు. టాలీవుడ్ లో ఇప్పటికే మహేష్ బాబు, మంచు మనోజ్, రాజేంద్రప్రసాద్ ఇలా చాలా మందికి కరోనా సోకింది. పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్, రేణు దేశాయ్ లు కూడా ఈ వైరస్ బారిన పడినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 


సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ని కూడా కరోనా విడిచిపెట్టలేదు. తాజాగా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా బారిన పడ్డానని.. నిన్ననే పాజిటివ్ రిజల్ట్ వచ్చిందని చెప్పారు. కాస్త జ్వరంగా ఉందని.. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉంటూ డాక్టర్ల సహాయం తీసుకుంటున్నట్లు చెప్పారు. 


అందరినీ జాగ్రత్తగా ఉండమని.. ఎల్లప్పుడూ మాస్క్ ధరించే ఉండమని కోరారు. ఈ పోస్ట్ చూసిన అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో తెలుగులో రెండు, మూడు సినిమాలు చేసిన ఆయన 'యాత్ర' సినిమాతో తెలుగు వారికి మరింత దగ్గరయ్యారు. ప్రస్తుతం మలయాళంలో నాలుగైదు ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టిన ఆయన.. అఖిల్ నటిస్తోన్న 'ఏజెంట్' సినిమాలో కీలకపాత్రలో కనిపించనున్నారు. 






Also Read: బీచ్ లో భార్యతో బాలయ్య ఫన్.. వీడియో వైరల్..