గానకోకిల లతా మంగేష్కర్ మరణం సినీ లోకాన్ని ఆవేదనలో ముంచింది. పలువురు ప్రముఖులు ఆమె మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ హీరో బాలకృష్ణ లతా మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. అందులో దేశం గర్వించదగ్గ గాయని లతా అని కొనియాడారు. దేశంలో ఆమె పాట వినబడని ఇల్లు లేదు, ఆమె గానం మెచ్చని వ్యక్తి లేడు అని పొగిడారు. ఆమె పొందని అవార్డు, రికార్డులు కూడా లేవని చెప్పారు. భారతరత్న, పద్మవిభూషణ్, పద్మ భూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే ఇలా మన దేశంలోని ఉన్నత అవార్డులన్నీ ఆమె సాధించిందని, విదేశీ ప్రభుత్వాలు కూడా పలు పురస్కారాలను ఇచ్చి గౌరవించాయని అన్నారు. 70 ఏళ్లలో 30కి పైగా భాషల్లో 30 వేల పాటలు పాడడం సాధారణ విషయం కాదని అన్నారు. ఆమె మృతి మనదేశానికే కాదు, సంగీత ప్రపంచానికే తీరనిలోటని అభిప్రాయపడ్డారు బాలయ్య.  ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నట్టు చెప్పారు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 


Also Read: లతా దీదీ మరణంతో నేను చెప్పలేనంత వేదనలో ఉన్నా.. ప్రధాని మోదీ భావోద్వేగ ట్వీట్


తన అధ్భుతమైన గాత్రంతో దేశప్రజలను అలరించిన లతా ఫిబ్రవరి 6న తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజుల క్రితం ఆమె కరోనా వైరస్ బారిన పడడంతో కుటుంబ సభ్యులు ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్చారు. నాలుగు వారాలుగా ఆమె ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూనే ఉన్నారు. మధ్యలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. లతా బాగానే ఉన్నారని చెప్పారు, కరోనా నుంచి కోలుకున్నారని చెప్పారు వైద్యులు. మళ్లీ రెండు రోజుల క్రితం పరిస్థితి విషమించింది.  దీంతో ఆదివారం ఉదయం మరణించారు. 


Also Read: లతా మంగేష్కర్ సాంగ్స్, ముప్పై వేల పాటల్లో తెలుగు పాటలు ఎన్నో తెలుసా?


లతా హిందీ, మరాఠీ భాషల్లోనే అధికంగా పాడారు. తెలుగులో పాడినవి మూడే పాటలు అయినా ఆమెకు ఇక్కడ అభిమానులు ఎక్కువే. ఆమె పాడిన ఎన్నో హిందీ పాటలు ఇప్పటికీ తెలుగు వారిలో నోళ్లలో నానుతూనే ఉంటాయి. 1942 నుంచి 2015 దాకా విరామం తీసుకోకుండా ఆవిడ పాడుతూనే ఉన్నారు. 1990లో ఆమెకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందింది. ఏఎన్నార్, ఎన్టీఆర్, నాగార్జున సినిమాల్లో ఆమె పాడారు. వాటిలో బాగా ఫేమస్ అయినా పాట ‘నిదుర పోరా తమ్ముడా’ అనే సాంగ్. 1955లో పాడిన పాట ఇది.