Muppalaneni Shiva About Sandade Sandadi Movie: తెలుగు సినిమా పరిశ్రమలో చక్కటి విజయాన్ని అందుకున్న సినిమా ‘సందడే సందడి’. ముప్పలనేని శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ మూవీ 2002లో విడుదలైన చక్కటి సక్సెస్ సాధించింది. ఇందులో జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, శివాజీ, ఊర్వసి, రాసి, సంఘవి ప్రధాన పాత్రలు పోషించారు. కోటి సంగీతం అందించారు. తెలుగులో మంచి హిట్ అందుకున్న ఈ చిత్రం, కన్నడ హిట్ మూవీ ‘కొత్తిగలు సార్ కొత్తిగలు’కు రీమేక్ గా రూపొందింది.


అడ్వాన్స్ తీసుకొని సినిమా చేయమని చెప్పారు- శివ


తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు ముప్పలనేని శివ ‘సందడే సందడి’ సినిమా గురించి కీలక విషయాలు వెల్లడించారు. ఈ సినిమా తీయడానికి ముందు ఎవరికీ హిట్ అవుతుందనే నమ్మకం లేదని చెప్పారు. అయినా, తాను వెనక్కి తగ్గకుండా ఈ సినిమా చేశానన్నారు. శ్రమకు ఫలితం దక్కిందన్నారు. “నాకు ఎంటర్ టైన్మెంట్ అంటే చాలా ఇష్టం. నా సినిమాల్లో కామెడీ అనేది మిస్ కాదు. అయితే, పూర్తి స్థాయిలో కామెడీ సినిమా చేయాలని ఉండేది. ఆ సమయంలో కన్నడ హిట్ మూవీ  ‘కొత్తిగలు సార్ కొత్తిగలు’ తెలుగులో చేయాలి అనుకున్నాను. ముందుగా ఈ సినిమాలో మొదట జగపతి బాబు, రాజేంద్రప్రసాద్ క్యారెక్టర్లు రవితేజ, శ్రీకాంత్ తో చేయించాలి అనుకున్నాను. వారికి అడ్వాన్స్ కూడా ఇచ్చాం. కానీ, ఆ తర్వాత ఎందుకో వారు చేయమని చెప్పారు” అన్నారు.


ఫ్లాఫ్ అవుతుందని చెప్పినా వెనక్కి తగ్గలేదు- శివ


ఆ తర్వాత ఈ సినిమాలో జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, శివాజీ ఓకే అయ్యారని చెప్పారు దర్శకుడు శివ. “రవితేజ, శ్రీకాంత్ నో చెప్పడంతో జగపతి బాబు దగ్గరికి నేను, తాండవ కృష్ణ కలిసి వెళ్లాం. కథ చెప్పాను. కానీ, తను కూడా ఈ సినిమా చేసేందుకు ఇష్టపడలేదు. నేను సినిమాలు చేయడం లేదు కాబట్టి ఇలాంటి స్టోరీతో వచ్చారా? నేను చేయను అన్నారు. నా ఫైల్ చూపించి, ఇంత మందితో చేశాను. నేను తప్పు చేయను అని చెప్పాను. ముందు అడ్వాన్స్ తీసుకోండి. 20 రోజుల తర్వాత నిర్ణయం తీసుకోండి అని చెప్పాను. ఆ తర్వాత వచ్చి నా క్యారెక్టర్ బాగుంది. నటిస్తాను అని చెప్పారు. అక్కడి నుంచి రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వెళ్లాం. ఈ కథ బాగుంది. నేను మెయిన్ లీడ్. సెకండ్ లీడ్ ఎవరు? అన్నారు. మీరే సెకండ్ లీడ్ అండీ. ఫస్ట్ లీడ్ జగపతిబాబు చేస్తున్నారు అని చెప్పాను. మేం ఇద్దరం కలిసి నటిస్తే అట్టర్ ఫ్లాప్ అవుతుంది. బాండ్ పేపర్ మీద రాసిస్తాను అన్నారు. కానీ, చివరకు ఒప్పించాను. సరే మీ ఇష్టం నేను చెప్పాల్సింది చెప్పాను అన్నారు. అక్కడి నుంచి శివాజీ దగ్గరికి వెళ్లాను. వాళ్లిద్దరు ఉండగా, నా పాత్రకు ఏం ఇంపార్టెన్స్ ఉంటుంది బ్రదరూ? అన్నారు. మీ క్యారెక్టర్ కూడా బాగుంటుందని చెప్పాను. పలువురు హీరోలు, హీరోయిన్లతో కలిసి అన్నపూర్ణ స్టూడియోలో ఓపెన్ చేశాను. ప్రొడ్యూసర్ ఎవడో అయిపోయాడ్రా అనుకున్నారు అందరూ. ఈ సినిమా మొదలైన తర్వాత 3 నెలలకు విడుదల అయ్యింది. అదే సమయంలో ‘ఖడ్గం’ కూడా విడుదల అయ్యింది. రెండు సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి” అని చెప్పారు.         


Read Also: ఓ మై గాడ్, రణబీర్‌ను రష్మిక అన్నిసార్లు కొట్టిందా? అసలు విషయం చెప్పిన ‘యానిమల్‘ నిర్మాత