మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో.. పూజా భలేకర్ ప్రధాన పాత్రలో రామ్ గోపాల్ వర్మ ఓ సినిమా తీశారు. 'ఎంటర్ ద గర్ల్ డ్రాగన్' అనేది టైటిల్. చైనీస్ భాషలో విడుదల చేయాలని ఈ సినిమాను రూపొందించారు. దానిని హిందీలో 'లడకీ' పేరుతో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదల చేశారు. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులోకి 'అమ్మాయి' పేరుతో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాను జూలై 15న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 47 వేల స్క్రీన్స్ లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ షురూ చేశారు. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించగా.. దానికి విజయేంద్రప్రసాద్, కీరవాణి లాంటి పెద్దలు గెస్ట్ లుగా వచ్చారు. 


ఈ సందర్భంగా మాట్లాడిన విజయేంద్రప్రసాద్.. '' కబడుటలేదు సినిమా ఈవెంట్ కి వెళ్లినప్పుడు అక్కడ వర్మ కూడా ఉన్నారు.. పదిహేన్నేళ్లుగా గూడు కట్టుకున్న కోపం, చిరాకు, అసహ్యం, బాధ అన్ని కలగలపి అనుకోకుండా కొన్ని మాటలు వచ్చాయి. 'శివ' సినిమా తరువాత వర్మని చాలా మంది స్ఫూర్తిగా తీసుకున్నారు. ఆ తరువాత వర్మ కనిపించడం మానేశారు. మీకేమైనా కనిపిస్తే మళ్లీ అలాంటి సినిమా తీయమని చెప్పండి అనేశాను. ఇప్పుడు 'అమ్మాయి' ట్రైలర్ చూసిన తరువాత చాలా గర్వంగా ఉంది. ఈ సినిమా 47 వేల స్క్రీన్స్ లో రిలీజ్ కావడమనేది గొప్ప విషయం. దీన్ని ఎవరూ బీట్ చేయలేదు. ఎందుకంటే 'అవతార్' లాంటి సినిమాలే 20 వేల థియేటర్లలో రిలీజ్ అయితే ఈ సినిమా 47 వేళా స్క్రీన్లలో రిలీజ్ కావడం తెలుగు వారికి గర్వకారణం'' అంటూ చెప్పుకొచ్చారు. 


ఈ చిత్రానికి రవి శంకర్, డి.ఎస్.ఆర్ సంగీతం అందించారు. ఇండో - చైనీస్ కోప్రొడక్షన్ లో సినిమా రూపొందింది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న ఓ అమ్మాయి ఏం చేసింది? ఏంటి? అనేది కథగా తెలుస్తోంది. మార్షల్ ఆర్ట్స్ రారాజు బ్రూస్ లీ నటించిన 'ఎంటర్ ది డ్రాగన్' చిత్రానికి ఈ 'లడకి' నివాళి అని చిత్రబృందం చెబుతోంది.