బాలీవుడ్ దర్శకుడు వివేక్ ఆగ్నేహోత్రి తెరకెక్కించిన 'ది వ్యాక్సిన్ వార్' సినిమా పై తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. జోధ్ పూర్ లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ తన ప్రసంగంలో 'ది వ్యాక్సిన్ వార్' చిత్ర ప్రస్తావన తీసుకొస్తూ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ది కాశ్మీర్ ఫైల్స్' అనే సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఈ చిత్రం ఇండియాతో పాటు పాకిస్తాన్ ను సైతం కుదిపేసింది. మనదేశంలో సుందర ప్రాంతమైన జమ్ము - కాశ్మీర్లో హిందూ పండితుల పట్ల పాకిస్తాన్ ముస్లింలు వ్యవహరించిన తీరును సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపించాడు.


ఎన్నో వివాదాలకు దారి తీసిన ఈ సినిమాకు కొన్ని రాష్ట్రాలు పన్నమినహాయింపు కూడా ఇచ్చాయి. వివాదాలతోనే ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అందుకుంది. ఇప్పుడు అదే దర్శకుడు 'ది వ్యాక్సిన్ వార్' అనే మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సెప్టెంబర్ 28న రిలీజ్ అయిన ఈ మూవీ ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న టైంలో వ్యాక్సిన్ తయారీ ఘటనలను ఆధారంగా చేసుకొని ఈ సినిమాని తెరకెక్కించారు వివేక్ అగ్నిహోత్రి. సినిమాలో కాంతారా హీరోయిన్ సప్తమి గౌడ శాస్త్రవేత్త పాత్రలో కనిపించి ఆకట్టుకుంది.






ఆమెతోపాటు బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్, నానా పటేకర్, పల్లవి జోష్, రైమాసేన్, నివేదిత భట్టాచార్య ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తున్న ఈ సినిమా ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్స్ అందుకుంటుంది. తాజాగా ఈ సినిమాపై భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. అందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. జోధ్ పూర్ లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ మధ్యలో 'ది వాక్సిన్ వార్' మూవీ ప్రస్తావన తీసుకొచ్చారు.


" ఇటీవల ది వ్యాక్సిన్ వార్ అనే సినిమా వచ్చిందని విన్నాను. కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో భారత శాస్త్రవేత్తలు పడిన శ్రమ అందులో చూపించారు. మన శాస్త్రవేత్తలు అహోరాత్రులు కష్టించి ఋషుల వలె ల్యాబ్ లలో పరిశోధనలు చేసి సంచలన విజయాలు సాధించారు. ముఖ్యంగా మన మహిళా శాస్త్రవేత్తల విజయాలను 'ది వ్యాక్సిన్ వార్' చిత్రంలో ఎంతో అద్భుతంగా చూపించారు. ఈ చిత్రం చూసిన ప్రతి భారతీయుడు గర్వంతో తలెత్తుకుంటున్నారు. చంద్రయాన్ 3 తో మన శాస్త్రవేత్తలపై మరింత గౌరవం పెరిగింది. వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన మన శాస్త్రవేత్తలను అందరూ గౌరవించనున్నారు. దేశ యువత సైన్స్ పట్ల, శాస్త్రవేత్తల పట్ల ఆకర్షితులవుతున్నారు" అని మోడీ పేర్కొన్నారు.


ఈ సందర్భంగా 'ది వ్యాక్సిన్ వార్' చిత్రాన్ని తెరకెక్కించిన టీమ్ ని అభినందించారు.' ఈ సినిమా ద్వారా మీరు దేశంలోని సైంటిస్టుల కృషిని, సైన్స్ ప్రాధాన్యతను మరోసారి వెలుగులోకి తెచ్చారు. మీ ఈ పని రాబోయే తరానికి ఉపయోగపడుతుంది' అని మోడీ చెప్పుకొచ్చారు. మోడీ చేసిన ఈ కామెంట్స్ తో సినిమా కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని మేకర్స్ భావిస్తున్నారు. ఎందుకంటే గతంలో 'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమా విషయంలో కూడా అదే జరిగింది. సినిమా గురించి మోడీ మాట్లాడిన తర్వాత కలెక్షన్స్ భారీగా పెరగడం గమనార్హం.


Also Read : ఈ రోజుల్లో అవి సర్వసాధారణమే, అందుకు స్పెషల్ గా ఓ బ్యాచ్ ఉంటుంది - ట్రోలర్స్ కి ఇచ్చిపడేసిన భూమి!




Join Us on Telegram: https://t.me/abpdesamofficial