Siva Karthikeyan About Sai Pallavi: తమిళ నటుడు శివకార్తికేయన్, టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘అమరన్’. యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాను రాజ్ కుమార్ పెరియస్వామి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి అమర జవాన్ సతీమణిగా నటిస్తోంది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం చెన్నైలో ఆడియో లాంఛ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ వేడుకలో సాయి పల్లవి గురించి కార్తియన్ ఆసక్తికర విషయాన్ని చెప్పి అందరినీ నవ్వించారు.

   


అభినందిస్తే అన్నయ్యా అంది- కార్తికేయన్


సాయి పల్లవి నటించి ‘ప్రేమమ్’ సినిమా చూసి ఆమెను అభినందించడానికి ఫోన్ చేస్తే, అన్నయ్యా అని పిలిచి షాకించ్చిందన్నారు శివ కార్తికేయన్. “నేను అప్పట్లో టీవీ యాంకర్ గా పని చేశాను. ఆ సమయంలో సాయి పల్లవిని కలిశాను. నా షోకు తను గెస్టుగా వచ్చింది. ఆ తర్వాత ఆమె నటించిన ‘ప్రేమమ్’ విడుదల అయ్యింది. ఆ సినిమాలో ఆమె నటన నాకు చాలా బాగా నచ్చింది. వెంటనే ఆమెకు ఫోన్ చేసి అభినందించాను. అద్భుతంగా నటించావని చెప్పాను. ఆమె 'థ్యాంక్యూ అన్నయ్యా' అంటూ షాక్ ఇచ్చింది. నేను అభినందిస్తే, అన్నయ్యా అంటుందా? అని ఫీలయ్యాను. ఆ తర్వాత ఆమె కలిసినప్పుడు ఈ విషయాన్ని చెప్పి, సరదాగా నవ్వుకున్నాం” అని ఫన్నీ ఇన్సిడెంట్ గురించి చెప్పుకొచ్చారు. సాయి పల్లవి ‘ప్రేమమ్’ సినిమాతో పోల్చితే ఇప్పుడు మరింత అద్భుతంగా నటిస్తోందని ఆయన అభినందించారు.   






ఆర్మీ అధికారి రియల్ స్టోరీతో వస్తున్న ‘అమరన్’


‘అమరన్’ చిత్రాన్ని దివంగత ఆర్మీ అధికారి ముకుంద్ రియల్ స్టోరీతో తెరకెక్కిస్తున్నారు. ఆయన భార్య సింధు పాత్రలో సాయి పల్లవి కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. రీసెంట్ గా విడుదలైన సాయి పల్లవి ఇంట్రో వీడియో కూడా ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా ఉంది. ముకుంద్ మరణం తర్వాత భారత ప్రభుత్వం గణతంత్ర్య దినోత్సవంలో ఆయన సతీమణిని సన్మానించే విజువల్స్ తో భావోద్వేగ భరితంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో శివ కార్తికేయన్ ముకుంద్ పాత్రలో అద్భుతంగా కనిపించబోతున్నారు.



అక్టోబర్ 31న ‘అమరన్’ విడుదల


‘అమరన్’ చిత్రాన్ని శివ అరూర్, రాహుల్ సింగ్ కలిసి రాసిన ‘ఇండియాస్ మోస్ట్ ఫియర్‌ లెస్’ అనే బుక్ లోని ఓ అధ్యయాన్ని బేస్ చేసుకుని రూపొందిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జి వి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకురానుంది.  హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, అతడి సోదరి నిఖితరెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ ద్వారా రిలీజ్ చేయబోతున్నారు. అటు సాయి పల్లవి ప్రస్తుతం నాగ చైతన్యతో కలిసి ‘తండేల్’ మూవీలో నటిస్తోంది. బాలీవుడ్ లో ‘రామాయణం’ అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో చేస్తోంది. ఈ మూవీలో ఆమె సీతగా కనిపించనుంది.  


Read Also: కంగనా ‘ఎమర్జెన్సీ’కి సెన్సార్ క్లియరెన్స్... మరీ అన్ని కట్స్ అంటే అసలు మ్యాటర్ ఉంటుందా?