Pawan Kalyan - Prakash Raj Movie Shooting: రాజకీయాలు వేరు... సినిమాలు వేరు. రెండింటిని అస్సలు కలపకూడదు. వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా అయినా ఉండవచ్చు. కానీ, వృత్తి విషయానికి వచ్చే సరికి వాటిని పక్కన పెట్టాలి. అచ్చంగా ఇదే పద్దతి పాటిస్తున్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, నటుడు ప్రకాష్ రాజ్. నిన్న మొన్నటి వరకు తిరుమల లడ్డూ విషయంలో ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నా, ఇప్పుడు ఒకే సినిమాలో కలిసి నటిస్తున్నారు. అవును.. మీరు విన్నది నిజమే. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఓజీ’(OG) సినిమాలో ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.  


త్వరలో పవన్ కల్యాణ్, ప్రకాష్ రాజ్ సన్నివేశాల షూట్


ప్రస్తుతం ‘ఓజీ’ సినిమాకు సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో కొనసాగుతోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన ఇంకా ‘ఓజీ’ సినిమా షూటింగ్ లో జాయిన్ కాలేదు. ప్రకాష్ రాజ్ ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ తో సంబంధం లేని సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. త్వరలోనే వీళ్లిద్దరి మధ్య కీలక సన్నివేశాలను  షూట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్, ప్రకాష్ రాజ్ నడుమ కొన్ని ముఖ్యమైన సన్నివేశాలతో పాటు ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్, ప్రకాష్ రాజ్ పలు సినిమాల్లో కలిసి నటించారు. ‘బద్రి’, ‘సుస్వాగతం’, ‘జల్సా’, ‘వకీల్ సాబ్’ లాంటి సినిమాల్లో కలిసి పని చేశారు. అన్ని సినిమాల్లో ఇద్దరూ శత్రువులుగానే కనిపించారు. ఇప్పుడు మరోసారి ‘ఓజీ’లో ఒకరికొకరు శత్రువులుగానే కనిపించనున్నారని సమాచారం. రాజకీయాలలో సిద్ధాంతం పరంగా విభేదాలు ఉన్నప్పటికీ సినిమాల పరంగా కలిసి పనిచేడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.



తిరుమల లడ్డుపై ఇద్దరి మధ్య తీవ్ర వివాదం


తిరుపతి లడ్డు క్వాలిటీపై కొద్ది రోజుల క్రితం ఏపీలో తీవ్ర వివాదం నెలకొన్నది. ఈ వివాదంలోకి నటుడు ప్రకాష్ రాజ్ ఎంట్రీ ఇచ్చాడు. పవన్ కల్యాణ్ టార్గెట్ గా సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేశారు. నెమ్మదిగా వీరిద్దరి మధ్య సనాతన ధర్మం, సమానత్వం అనే గొడవగా మారింది. ఇద్దరు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. పవర్ స్టార్ అభిమానులు ప్రకాష్ రాజ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగారు. ఇప్పుడిప్పుడే ఈ వివాదం సమసిపోతోంది. ఈ నేపథ్యంలో ఇద్దరూ కలిసి సినిమా చేయడం ఆసక్తి కలిగిస్తోంది.


త్వరలో ‘ఓజీ’ సెట్ లోకి పవన్ కల్యాణ


ఇక ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ లో పాల్గొన్న పవన్ కల్యాణ్ ఇప్పుడు ‘ఓజీ’ సినిమాకు డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ‘ఓజీ’ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మీ, శ్రీయా రెడ్డి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌ టైన్‌ మెంట్స్ బ్యానర్‌ పై దానయ్య ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు.  


Read Also: 'గేమ్ ఛేంజర్‌'లో ఒక్క పాటకు రూ. 20 కోట్లా - శంకర్ మూవీ అంటే ఆ మాత్రం ఉంటుంది మరి!