సరికొత్త టెక్నాలజీ ద్వారా క్రియేటివిటీకి మెరుగులు అద్దడంలోనూ, టెక్నాలజీని ఉపయోగించి వెండితెరపై అద్భుతాలు సృష్టించడంలోనూ సినిమా ఇండస్ట్రీ ఎప్పుడూ ముందు ఉంటుంది. అయితే... కొత్తగా వచ్చిన ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ద్వారా సెలబ్రిటీలు అవసరం లేకుండా కొందరు తమ సృజనకు పదును పెడుతున్నారు. సోషల్ మీడియా ఓపెన్ చేసే ప్రధాని నుంచి ప్రతి సెలబ్రిటీ వరకు వాళ్ళు చేయనిది చేసినట్టు చూపిస్తున్నారు. మరి, ఆ ప్రభావం ఇండస్ట్రీ మీద ఉంటుందా? నటీనటులు అవసరం లేకుండా సినిమాలు చేయవచ్చా? సినిమాల్లో ఆర్టిస్టులను ఏఐ రీప్లేస్ చేస్తుందా? చాలా మందిలో ఉన్న సందేహాలు ఇవి. వీటికి రానా దగ్గుబాటి (Rana Daggubati) ముందు ఉంచింది ఏఐ!


దక్షిణాది ఐదు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ అభివృద్ధి గుర్తించి... దక్షిణ భారతదేశంలోని దార్శనిక ఆలోచనలు, దార్శనికతపై చర్చించేందుకు శతాబ్దానికి పైగా ఘన చరిత ఉన్న ABP నెట్ వర్క్ ఇవాళ చెన్నైలో ABP Southern Rising Summit 2023 నిర్వహించింది. దీనికి రానా దగ్గుబాటి హాజరు అయ్యారు. ఆయన దగ్గర ఏఐప్రస్తావన తీసుకు రాగా...  


ఏఐను మనుషులే నడిపిస్తున్నారు - రానా దగ్గుబాటి! 
సినిమా రంగంలో మాత్రమే కాదని, ప్రతి ఒక్క రంగంపై ఏఐ ఇంపాక్ట్ చూపిస్తుందని రానా దగ్గుబాటి వ్యాఖ్యానించారు. లాయర్, బ్యాంకర్, డాక్టర్... ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో ఏఐ ప్రభావం ఉంటుందన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''మనకు ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన కొత్తల్లోనూ పలు సందేహాలు, విమర్శలు వినిపించాయి. 20 ఏళ్ళ క్రితం ఫోన్ కొనమని చెబితే... అది మంచి ఐడియా అని చాలామంది అనుకోలేదు. కొత్త టెక్నాలజీ, మార్పు వచ్చినప్పుడు... వాటిని అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కొత్త టెక్నాలజీ ఏది వచ్చినా సరే త్వరగా అందిపుచ్చుకుంటుంది. ఎంటర్టైన్మెంట్ క్రియేటివ్ ఇండస్ట్రీ! ఊహలకు రూపం ఇవ్వాలని అనుకుంటాం కాబట్టి క్రియేటివిటీని త్వరగా అర్థం చేసుకుంటాం'' అని చెప్పారు. 


''సినిమాల్లో ఆర్టిస్టులను, టెక్నీషియన్లను ఏఐ రీప్లేస్ చేస్తుందా? అంటే... ఏఐను నడిపిస్తున్నది మనుషులే! దానిని అర్థం చేసుకుని మనమే ప్రపంచం ముందుకు తీసుకు వెళుతున్నాం. అంతే కానీ, ఏఐ మనల్ని ముందుకు నడిపించడం లేదు'' అని రానా చెప్పారు. సినిమాల్లో మనుషులను ఏఐ రీప్లేస్ చేయలేదని ఆయన స్పష్టంగా చెప్పారు.  






వందేళ్ళ సినిమాలో ఎన్నో మార్పులు వచ్చాయ్!
వందేళ్ళ చరిత్ర కల భారతీయ సినిమా ఇండస్ట్రీలో... ప్రారంభం నుంచి ఇప్పటికి ఎన్నో మార్పులు వచ్చాయని రానా చెప్పారు. ఆయన మాట్లాడుతూ ''వందేళ్ళ క్రితం ఇండియాలో సినిమా మొదలైనప్పుడు ఫిల్మ్ ద్వారా షూటింగ్ చేసేవారు. ప్రొజెక్టర్లు ఉపయోగించి తెరపై ప్రదర్శించేవారు. ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీలో షూటింగ్ చేస్తున్నారు. థియేటర్లలో కూడా డిజిటల్ పద్ధతుల్లో ప్రదర్శిస్తున్నారు. సాంకేతికంగా మార్పులు వచ్చాయి. కానీ, సినిమా మారలేదు'' అని చెప్పారు.  


Also Read : 'ప్రేమ విమానం' రివ్యూ : 'జీ 5'లో కొత్త సినిమా ఎలా ఉంది? 'విమానం'కి, దీనికి డిఫరెన్స్ ఏంటి?


తాను విజువల్స్ ఎఫెక్ట్స్ కంపెనీ ప్రారంభించిన సమయానికి, ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయని ఆయన తెలిపారు. అప్పుడు ఉపయోగించిన వస్తువులను ఇప్పుడు తమ విశాఖ రామానాయుడు స్టూడియోలోని మ్యూజియంలో ఉంచామని చెప్పారు. తాను ఆ స్టూడియోలో అలా మిగిలిపోకుండా ఉన్నందుకు సంతోషంగా ఉందంటూ చమత్కరించారు. 


Also Read : నవంబర్‌లో 'వ్యూహం', జనవరిలో 'శపథం' - రెండు పార్టులుగా వర్మ తీస్తున్న జగన్ బయోపిక్



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial