యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ ‘ప్రాజెక్ట్ K’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. లెజెండరీ నటుడు బిగ్ బీ అమితాబ్ బచ్చన్, అందాల భామ దిశా పటాని కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీ దత్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్స్ బయటకు వచ్చాయి.

 

‘ప్రాజెక్ట్ K’ అనేది మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ కథాంశంతో రూపొందే సూపర్ హీరో మూవీ అని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా నిర్మాత అశ్వినీ దత్ ఈ సినిమా జానర్, షూటింగ్ విశేషాలను పంచుకున్నారు. ఇది ఫాంటసీ & సైన్స్ ఫిక్షన్ లో ఎక్కువగా ఉంటుందని, ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తయిందని వెల్లడించారు. 

 

'ప్రాజెక్ట్ కె' చిత్రం గ్రాఫిక్స్ తో కూడుకున్నది కాబట్టి, సినిమా దాదాపు 70% చిత్రీకరణ పూర్తి చేసినప్పటికీ, VFX వర్క్ కు చాలా సమయం పడుతుందని తెలిపారు. వచ్చే ఏడాది అంతా గ్రాఫిక్స్ పై వర్క్ జరుగుతుందని పేర్కొన్నారు. దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్ ల పాత్రలకు సంబంధించిన షూటింగ్ వారం, పది రోజులు మాత్రమే మిగిలి ఉందని.. అతి త్వరలో అది కూడా పూర్తి చేస్తారని నిర్మాత తెలిపారు. అంతేకాదు సినిమాలో ప్రభాస్ తో ఈక్వల్ గా దీపిక - అమితాబ్ కు స్క్రీన్ స్పేస్ ఉంటుందని అన్నారు.

 

‘ప్రాజెక్ట్ K’ సినిమా జానర్ గురించి నిర్మాత వెల్లడిస్తూ, “ఈ చిత్రంలో ఫాంటసీ అండ్ సైన్స్ ఫిక్షన్ అంశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది విష్ణువు యొక్క మోడరన్ అవతారం గురించి ఉంటుంది. కానీ అదే సమయంలో, దీంట్లో సెంటిమెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. యాక్షన్ సీక్వెన్స్ లను పర్యవేక్షించడానికి నలుగురైదుగురు ఇంటర్నేషనల్ స్టంట్ కొరియోగ్రాఫర్ లను తీసుకొచ్చాం. సినిమాలో మీరు చూసే ప్రతి ఒక్కటీ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది” అని చెప్పుకొచ్చారు.

 

కాగా, ఇటీవల మహా శివరాత్రి సందర్భంగా, ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా ‘ప్రాజెక్ట్ K’ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయడంతో పాటుగా, సరికొత్త పోస్టర్ ను ఆవిష్కరించారు. 'ప్రపంచం వేచి ఉంది' అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ పోస్టర్ కు మంచి స్పందన లభించింది. అందరూ ఈ సినిమా ప్లాట్ ను డీకోడ్ చేస్తూ, బిగ్ స్క్రీన్ మీద మ్యాజిక్ ను చూసేందుకు తమ ఎగ్జైట్మెంట్ ను చూపించారు.

 

‘ప్రాజెక్ట్ K’ సినిమా 2024 జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లోనే కాకుండా.. పలు విదేశీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అశ్వినీ దత్ దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ను నిర్మిస్తున్నారు. ఇది ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు అత్యధిక బడ్జెట్ తో రూపొందించబడిన చిత్రాల్లో ఒకటిగా చెప్పబడుతోంది. 

 

ప్రాజెక్ట్-కె చిత్రానికి డానీ శాంచెజ్-లోపెజ్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. మిక్కీ జె. మేయర్ సంగీతం సమకూరుస్తున్నారని మేకర్స్ అప్పట్లో ప్రకటించారు. కానీ ఇప్పుడు అతని స్థానంలో సంతోష్ నారాయణన్ ను తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఇతర వివరాలు వెల్లడికానున్నాయి.