యువ హీరో కార్తికేయ గుమ్మకొండ, 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం 'బెదురులంక 2012'. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాకు సి. యువరాజ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. 'కలర్ ఫోటో', 'తెల్లవారితే గురువారం' చిత్రాల తర్వాత లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ శుక్రవారం ఆగస్టు 25న ఈ సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత బెన్నీ మీడియాతో ముచ్చటించి, సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. 


'బెదురులంక 2012' కథలో 'ఫియర్' (భయం) కూడా ఓ పాత్ర పోషిస్తుందని, అందుకే అలాంటి టైటిల్ అని పెట్టామని బెన్నీ తెలిపారు. ''ఓ ఊహాజనిత గ్రామంలో 2012లో ఓ 21 రోజుల పాటు ఏం జరిగింది? అనేది ఈ సినిమా కథ. మేం చెప్పాలనుకున్న కథను 2012 నేపథ్యం అవసరం. కథ వేరుగా ఉంటుంది. ఫోకస్ అంతా 2012 మీద ఉండదు'' అని చెప్పారు. దర్శకుడు క్లాక్స్ విజన్ స్క్రీన్ మీదకు రావడానికి ఎక్‌పీరియన్స్డ్ టెక్నీషియన్లు అవసరం అనిపించిందని, అందుకే ఎక్కడా కాంప్రమైజ్ సంగీత దర్శకుడిగా మణిశర్మ, సినిమాటోగ్రాఫర్ గా సాయి ప్రకాష్ లాంటి వారిని తీసుకున్నామన్నారు. 


'బెదురులంక' సినిమాలో తనకు నచ్చినట్టు జీవించే పాత్రలో హీరో కార్తికేయ కనిపిస్తారు. అతడ్ని సమాజం ప్రశ్నిస్తూ ఉంటుంది. హీరో ప్రేయసి పాత్రలో నేహా శెట్టి కనిపిస్తారు. హీరో హీరోయిన్లు చిన్నప్పటి నుంచి ప్రేమలో ఉంటారు. అన్ని పాత్రలకు క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది. మన మనసుకు నచ్చినట్లు వంద శాతం బయటకు బతకం. ఒకవేళ చనిపోతాం అని తెలిస్తే చివరి క్షణాల్లో ఎలా ఉంటాం? అనేది ఈ సినిమా కోర్ పాయింట్ అని నిర్మాత చెప్పారు. డ్రామా, కామెడీ సినిమాలో హైలెట్ అవుతాయని.. సినిమాలో బోలెడు క్యారెక్టర్లు ఉన్నా సరే, ఒక్క క్యారెక్టర్ కూడా కావాలని పెట్టినట్లు ఉండదన్నారు. 


హీరోహీరోయిన్ల గురించి బన్నీ మాట్లాడుతూ, ''కార్తికేయతో సినిమా చేసినందుకు చాలా హ్యాపీగా ఉన్నా. అతనితో ఎక్కడా ఇబ్బంది కలగలేదు. ఆయనతో మళ్ళీ పని చేయాలని అనుకుంటున్నా. కార్తికేయ చాలా ప్రొఫెషనల్. అతనితో మరో సినిమా చేద్దామని అనుకుంటున్నాం. హీరోయిన్ నేహా శెట్టికి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. 'డీజే టిల్లు'లో ఆమె స్క్రీన్ ప్రజెన్స్ బావుంది. అందులో మోడ్రన్, అర్బన్ రోల్ చేశారు. ఆ అమ్మాయితో రూరల్ బ్యాక్‌డ్రాప్ రోల్ చేయిస్తే బావుంటుందని అనిపించింది. 'బెదురులంక 2012'తో నేహా శెట్టి ఎటువంటి పాత్రలకైనా సెట్ అవుతుందనే పేరు తెచ్చుకుంటుంది. పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఆమె అంత బాగా నటించింది'' అని అన్నారు. 


Also Read: 'బాయ్స్ హాస్టల్' ట్రైలర్: ఆంధ్రా అంటే కాపులే కాదు, కమ్మోళ్ళు కూడా!


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రైలర్ విడుదల చేయడానికి ముందు కథ గురించి అడిగి తెలుసుకున్నారని బన్నీ తెలిపారు. ''ట్రైలర్ చూసిన తర్వాత సినిమా కాన్సెప్ట్ గురించి చరణ్ మాట్లాడారు. అజయ్ ఘోష్ క్యారెక్టర్ ఎంటరైన తర్వాత సీన్స్ గురించి చెప్పారు. మణిశర్మ మ్యూజిక్ చాలా బావుందన్నారు. ట్రైలర్ చూడటానికి ముందు కార్తికేయ, నేహా శెట్టి పెయిర్ బావుందన్నారు'' అని నిర్మాత చెప్పారు. 


'బెదురులంక 2012' సినిమాలో ఓ పాట రాస్తున్న సమయంలోనే సిరివెన్నెల సీతారామశాస్త్రి శివైక్యం చెందారని బెన్నీ వెల్లడించారు. మణిశర్మ ఆ నోట్స్ తెప్పించారని, మిగతా పాటను లిరిసిస్ట్ చైతన్య ప్రసాద్ రాశారని తెలిపారు. సిరివెన్నెల గారు తిరిగిరాని లోకాలకు వెళ్లిన తర్వాత 'ఆయన లాస్ట్ సాంగ్ మా సినిమాలో ఉంది' అని కొందరు చెప్పారు. నిజానికి ఆయన చివరి పాట మా సినిమాలో ఉన్నా సరే, ఆ విషయం బయటకు చెప్పలేదు. దాన్ని పబ్లిసిటీకి వాడుకోకూడదని భావించాను అని నిర్మాత చెప్పారు. 


ఏ సినిమాకైనా కథ ముఖ్యమని భావిస్తానని బెన్నీ అన్నారు. కథలో 'ఎక్స్' ఫ్యాక్టర్ ఉండాలని తాను బలంగా నమ్ముతానని, ప్రేక్షకుడిగా సినిమా చూసినప్పుడు కొత్తదనం ఉండాలని కోరుకుంటానన్నారు. కథ కుదిరిన తర్వాత మిగతా అంశాలు అన్నీ కుదురుతాయని, ప్రోమో చూసిన తర్వాత 'ఎందుకు ఈ సినిమాకు వెళ్ళాలి' అని ప్రేక్షకులు అనుకోవడానికి ఓ కొత్తదనం కావాలని అన్నారు. 'బెదురులంక 2012' స్టోరీ చెప్పినప్పుడు అందులో పాయింట్ నచ్చిందని, ఎంత ఇంట్రెస్టింగ్ పాయింట్ అయినా సీరియస్ గా కాకుండా వినోదాత్మకంగా చెప్పాలన్నారు.


లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ లో మూడు ప్రాజెక్ట్స్ ఓకే చేశామని బెన్నీ తెలిపారు. అందులో రెండు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫిలిమ్స్ అయితే, ఒకటి మాత్రం భారీ సినిమా అవుతుందని చెప్పారు. 'బెదురులంక 2012' విడుదలైన తర్వాత ఆ చిత్రాలను అనౌన్స్ చేస్తామని ప్రొడ్యూసర్ చెప్పుకొచ్చారు. 


Also Read: 'మర్మాణువు' మూవీ కోసం డైరెక్టర్ వెంకటేష్ మహా క్రౌడ్ ఫండింగ్ క్యాంపెయిన్!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial