Andhra Pradesh Deputy CM Pawan Kalyan And Central Minister Suresh Gopi Comments On Films: సినిమా స్టార్స్ పవన్ కల్యాణ్, సురేష్ గోపి ఇద్దరూ కీలక పదవుల్లో ఉన్నారు. ఒకరు కేంద్రమంత్రి అయితే మరొకరు రాష్ట్ర మంత్రి, డప్యూటీ సీఎం. 24 గంటల వ్యవధిలో వీళ్లు చేసిన కామెంట్స్‌ వైరల్‌గా మారుతున్నారు. తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ఒకరు సినిమాలు ముఖ్యమని కామెంట్ చేస్తే మరొకరు సినిమాల కంటే ప్రజాసేవే ముఖ్యమని కామెంట్ చేయడం వైరల్ అవుతోంది.

  


ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ఎన్నో పోరాటాలు చేసి ఏపీకి ఉప‌ముఖ్య‌మంత్రి అయ్యారు. నిజానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక స్టార్ హీరోగా అంద‌రికీ తెలుసు. ఎన్నో హిట్ సినిమాలు చేసిన ఆయ‌న కోట్లాదిమంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు. ఆయ‌న్ని 70 ఎంఎం స్క్రీన్ పై చూడాల‌ని అభిమానులు త‌హ‌త‌హ‌లాడుతారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా అంటే కాసుల వ‌ర్ష‌మే. సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా రికార్డుల మోత మాత్రం ఆగ‌దు. ఇక ఆయ‌న కూడా ఒక్క‌ సినిమా చేస్తే చాలు కోట్ల‌లో రెమ్యున‌రేషన్ వ‌స్తుంది. కానీ, అవేమి వ‌ద్దంటున్నాడు ప‌వ‌న్ క‌ల్యాణ్. త‌న‌కు ప్ర‌జా సేవే ముఖ్యం అని చెప్తున్నారు. దీంతో ఇప్పుడు ఆయ‌న ఫ్యాన్స్ అంద‌రూ కేంద్ర మంత్రి సురేశ్ గోపి, ప‌వ‌న్ క‌ల్యాణ్ ని కంపేర్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. 


దేశ సేవ ముద్దు.. 


ఏపీ ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ గ్రామ స‌భ‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. తొలి గ్రామసభలో పాల్గొన్నారు పవన్ కల్యాణ్. అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూరు నియోజక వర్గంలోని మైసూరువారిపల్లిలో ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు ఆయ‌న‌. ఆ కార్య‌క్ర‌మంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ కొన్ని కామెంట్స్ చేశారు. త‌న‌కు సినిమాల కన్నా సమాజం ముఖ్యం అని, సినిమాల కన్నా దేశం ఇంకా ముఖ్యం అని అన్నారు. సినిమాల కంటే గ్రామ‌హితం ముఖ్యం అని చెప్పారు. అన్నంపెట్టే రైతు బాగుంటే అన్ని బాగుంటాయ‌ని, అంద‌రి ద‌గ్గ‌ర డ‌బ్బులుంటేనే సినిమాలు ఆడ‌తాయని చెప్పారు ప‌వ‌న్. అందుకే గ్రామాలు ప‌చ్చ‌గా ఉండాలని చెప్పుకొచ్చారు. 


 ద‌ట్ ఈజ్ ప‌వ‌న్ - ఫ్యాన్స్.. 


ప‌వ‌న్ క‌ల్యాన్ చేసిన ఆ కామెంట్స్ నిమిషాల్లోనే సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయ్యాయి. దీంతో ఆయ‌న ఫ్యాన్స్ ఆ  వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. ద‌ట్ ఈజ్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. సినిమాలు చేయ‌ను అని హింట్ ఇచ్చినందుకు బాధ‌గా ఉంద‌ని, కానీ.. సంపాద‌న కంటే ఆయ‌న‌కు దేశ సేవే ముఖ్యం అని చెప్పిన ఏకైక వ్య‌క్తి అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు. ఆయ‌న చెప్పిన మాట‌లు కొంత బాధ‌క‌లిగిస్తున్నా.. మా హీరో అని చెప్పుకునేందుకు గ‌ర్వంగా ఉందంటున్నారు. 



సినిమాలే ముఖ్య‌మ‌న్న కేంద్ర‌మంత్రి.. 


కేంద్ర‌మంత్రి సురేశ్ గోపి త‌న‌కు సినిమాలే ముఖ్యం అని, సినిమాలు లేక‌పోతే తాను బ‌త‌క‌లేన‌ని స్టేట్ మెంట్ ఇచ్చారు. కేర‌ళ‌ ఫిలిమ్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ మీటింగ్ తిరువ‌నంత‌పురం జ‌రిగింది. ఆ మీటింగ్ కి ముఖ్య అతిథిగా వ‌చ్చిన సురేశ్ గోపి ఈ కామెంట్స్ చేశారు. సినిమాలు చేసుకునేందుకు ప‌ర్మిష‌న్ ఇవ్వ‌క‌పోతే ప‌ద‌వికి రాజీనామా చేసేందుకైనా సిద్ధ‌మే అని అన్నారు. త‌న‌ను కేంద్ర‌మంత్రి ప‌ద‌వి నుంచి తొల‌గిస్తే ఆనందంగా సినిమాలు చేసుకుంటాను అని ఆయ‌న కామెంట్ చేశారు. దీంతో ఇప్పుడు ప‌వ‌న్ ఫ్యాన్స్ ఆయ‌న్ని, త‌మ అభిమాన హీరోని కంపేర్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. 


మొద‌టి నుంచి ప్ర‌జాసేవ‌లోనే.. 


ప‌వ‌న్ క‌ల్యాణ్ సినీ కెరీర్ ప్రారంభించి దాదాపు 28 ఏళ్లు. అయితే, మొద‌టి నుంచి కూడా ఆయ‌న ప్ర‌జా సేవ‌లోనే ఎక్కువ‌గా ఉన్నారు. సినిమాల్లో ఉన్న స‌మ‌యంలోనే ఎంతోమందికి సాయం చేశారు ప‌వ‌న్ క‌ల్యాణ్. రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత కూడా ఆయ‌న చాలా సేవా కార్య‌క్ర‌మాలు కొన‌సాగించారు. పార్టీ త‌ర‌ఫున ఎన్నో మంచి ప‌నులు చేశారు. రైతుల కోసం త‌న సొంత‌డ‌బ్బును ఖ‌ర్చు చేశారు ప‌వ‌న్. అలా ప‌దేళ్లు ప్ర‌జా సేవ‌లో ఉండి, ఎన్నో అవ‌మానాలు, బాధ‌లు, భ‌రించి ఈ స్థాయికి వ‌చ్చారు. అందుకే, ఆయ‌న‌పై న‌మ్మ‌కంతో ప్ర‌జ‌లు క‌ట్ట‌బెట్టిన ఈ ప‌ద‌వి, ప్ర‌జ‌లు ఇచ్చిన బాధ్యతే త‌న‌కు ముఖ్యం అంటూ చెప్పుకొచ్చారు ప‌వ‌న్. ఏదేమైనా ప‌వ‌న్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆయ‌న అభిమానుల్లో కొంత నిరాశ క‌లిగించిన‌ప్ప‌టికీ.. ఆయ‌న ఆలోచిస్తున్న తీరు మాత్రం అద్భుతం అని అంటున్నారు.  


Also Read: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ‘సూపర్’ బ్యూటీ అయేషా టకియా - దెబ్బకు ఇన్‌స్టా అకౌంట్ డిలీట్!