'మత్తు వదలరా', 'సేనాపతి', 'పంచతంత్రం' ఫేమ్ నరేష్ అగ‌స్త్య‌ (Naresh Agastya) కథానాయకుడిగా రూపొందిన సినిమా '# మెన్ టూ' (Men Too Movie). ఇందులో ఆయనకు జోడీగా నాని 'మజ్ను', 'పేపర్ బాయ్', 'టాప్ గేర్' ఫేమ్ రియా సుమన్ కథానాయికగా నటించారు. ప్రముఖ నటుడు బ్ర‌హ్మాజీ, హ‌ర్ష చెముడు, సుద‌ర్శ‌న్‌, మౌర్య సిద్ధ‌వ‌రం, కౌశిక్ ఘంట‌శాల‌, ప్రియాంక శ‌ర్మ ఇతర ప్ర‌ధాన తారాగ‌ణం. ఈ నెల 26న సినిమా విడుదల అవుతోంది. 


'మెన్ టూ' ట్రైలర్ విడుదల చేసిన విశ్వక్ సేన్, సందీప్ కిషన్
లాన్‌ థ్రెన్ క్రియేటివ్ వ‌ర్క్స్ పతాకంపై మౌర్య సిద్ధ‌వ‌రం (Mourya Siddavaram) ఈ '#మెన్ టూ' చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు. శ్రీకాంత్ జి. రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వహించారు. థియేటర్లలో ఈ వారం సినిమా విడుదల కానున్న సందర్భంగా ట్రైలర్ విడుదల చేశారు. యువ కథానాయకులు సందీప్ కిషన్, విశ్వక్ సేన్ 'మెన్ టూ' ట్రైలర్ విడుదల చేయడంతో పాటు చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. 


'మెన్ టూ' ట్రైలర్ ఎలా ఉందేంటి?
'మీ టూ' మూమెంట్ గురించి అందరికీ తెలిసిందే. మహిళలు తమకు ఎదురైన లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ప్రారంభించారు. మరి, ఈ 'మెన్ టూ' ఏంటి? అంటే... 'మీ టూ' ఉద్య‌మంలో త‌ప్పుడు లైంగిక ఆరోప‌ణ‌ల‌కు వ్యతిరేకంగా మన ఇండియాలో ప్రారంభించబ‌డ్డ ఉద్య‌మమే 'మెన్ టూ'.


ఇక, ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే... ఆటో డ్రైవర్ నుంచి పబ్బులో పెద్ద మనిషి వరకు, సమాజంలో పురుషుల పట్ల ఏ విధమైన వివక్ష చూపిస్తున్నారు? అనేది చాలా స్పష్టంగా చూపించారు. షేరింగ్ ఆటోలో లేడీస్ ఎక్కితే చాలు... మగవాళ్ళు డ్రైవర్ సీటుకు షిఫ్ట్ అవ్వాల్సిందే. ఇద్దరి దగ్గర డ్రైవర్ తీసుకునే డబ్బులు ఒక్కటే. కానీ, వివక్ష మగవాళ్ల మీద ఉంటుంది. 


ఆ తర్వాత కథ మగవాళ్ళ కోసమే మొదలైన పబ్బుకు షిఫ్ట్ అయ్యింది. అందులో కపుల్స్ నాట్ అలౌడ్! అంటే... జంటలకు చోటు లేదు. కేవలం మగవాళ్ళకు మాత్రమే ఆ పబ్! ''నా వర్క్ ప్లేస్, నాకు పీస్ ఇచ్చే ప్లేస్ ఇదే! నా బాధలు చెప్పుకునే బారు ఇదే! మిమ్మల్ని అందరినీ చూసి ఎంజాయ్ చేసే పబ్బు ఇదే!'' అని బ్రహ్మాజీ డైలాగ్ చెప్పారు. 


ఆదిత్య పాత్రలో నరేష్ అగస్త్య కనిపించారు. ప్రియాంకా శర్మ బాయ్ ఫ్రెండుకు అమెరికా వెళ్ళడం ఇష్టం లేదు. భార్యకు వంట చేసిపెట్టే పాత్రలో బ్రహ్మజీ! ఈ ముగ్గురూ బారులో కలుస్తారు. అక్కడ హర్ష చెముడు, మౌర్య సిద్ధవరం, ఇంకా మిగతా బ్యాచ్ యాడ్ అవుతారు. అందరూ కలిసి ఏం చేశారు? అనేది సినిమాలో చూడాలి. 'బేసిగ్గా అమ్మాయిలు అంటేనే మంచోళ్ళు' అని ప్రియాంకా శర్మ ఓ డైలాగ్ చెప్పారు. మరి, అంత మంచోళ్ళు అయితే మగాళ్ళకు బాధలు ఎందుకు? అంటే... మే 26న థియేటర్లకు వెళ్ళాలి.


Also Read : బాలకృష్ణ సినిమాలో స్పెషల్ సాంగ్‌కు భారీగా డిమాండ్ చేసిన తమన్నా - క్లారిటీ ఇచ్చిన మిల్కీ బ్యూటీ



కామెడీతో పాటు సీరియస్ సబ్జెక్టు డిస్కస్ చేసినట్టు ఉన్నారు 'మెన్ టూ'లో! సినిమా ట్రైలరులో డైలాగ్స్, నేపథ్య సంగీతం బావున్నాయి. ఈ చిత్రానికి కళ :  చంద్ర‌మౌళి .ఇ, కూర్పు :  కార్తీక్ ఉన్న‌వ‌, పాట‌లు & మాట‌లు:  రాకేందు మౌళి, ఛాయాగ్రహణం : పి.సి. మౌళి, సహ నిర్మాత : శ్రీమంత్ పాటూరి, సంగీతం :  ఎలిషా ప్ర‌వీణ్, ఓషో వెంక‌ట్. 


Also Read : తెలుగు సినిమా ఉన్నంత కాలం ఎన్టీఆర్ పేరు బతికుంటుంది - రామ్ చ‌ర‌ణ్‌